17, డిసెంబర్ 2019, మంగళవారం

అలల రహదారి...మిస్టరీ



                                                         అలల రహదారి

అలలు ఏర్పరచిన రహదారి - రోజుకు రెండుసార్లు, కేవలం ఒక గంట మాత్రమే తెరుచుకుంటుంది.

ఫ్రాన్స్ దేశంలో నాయర్మౌటియర్ అనే ద్వీపానికీ, వాండీ అనే నగరానికీ మధ్యవున్న రెండు సముద్ర తీరాలనూ కలుపుతూ సముద్రపు అలలు ఏర్పరచిన రహదారే 'పాసేజ్ డు గాయ్స్’ అనే రహదారి.


పూర్వం ఇటు నుండి అటు వెళ్ళటానికి పడవ మాత్రమే అధారం. కానీ 18 వ శతాబ్ధంలో ఒక రోజు సముద్రం విడిపోయి ఆ రెండు ఊర్లకూ ఒక రహదారి ఏర్పరచింది. అలా ఎందుకు ఏర్పడిందో తెలియని ప్రజలు మొదట ఆశ్చర్యపోయినా, క్రమేపీ ఆ రహదారిని వాడుకునే వారు. కానీ రెండుగా విడిపోయిన నీరు, ఒక గంట తరువాత ఆ రహదారిని మూసేస్తూ కలిసిపోయేది. అలా రోజుకు రెండుసార్లు మాత్రమే ఒక గంటో లేక రెండు గంటలో దారి వదిలేది. ఈ విషయం తెలియక అప్పట్లో చాలామంది ప్రజలు ఆ రహదారి గుండా వెళుతుంటే, ఆకస్మికంగా సముద్రపు అలలు ఒకటైపోయి, ఆ దారిని మూసేసేవి. అదే సమయాన ఆ రహదారిలో వెళుతున్న ప్రజలు ఆ అలలలో కొట్టుకుపోయేవారు.


నాగరికత పెరుగుతున్నకొద్దీ ఈ రహదారి ఏర్పడటం, మూసుకుపోవడంతో పాటూ అది ఎంత సమయంలో జరుగుతోంది అనేది కూడా లెక్కలు కట్టి, ప్రమాదం లేని సమయాలలో మాత్రమే ఈ రహదారి వాడేవారు. ఒక్కోసారి వారి లెక్కలు తప్పి మనుష్యులు కొట్టుకెళ్ళటం జరిగేది.

ఇలా సముద్రంలో రహదారి ఏర్పడుతోందని 1701 లో మొదటిసారిగా చిత్రపటాలలో చూపించారు. 1840 లో శాస్త్రవేత్తల లెక్కలతో ప్రభుత్వం అక్కడ తారుతో రహదారి ఏర్పరిచింది. కానీ ఆ రహదారి మూసుకుపోవటాన్నీ, రోజుకు రెండుసార్లు మాత్రమే ఆ రహదారి తెరుచుకోవటాన్ని మాత్రం వారు ఆపలేకపోయారు. అందువలన 1971లో ఆ రహదారికి కొన్ని మైళ్ళ దూరంలో ఓ వంతెన నిర్మించారు. కానీ ప్రజలు అలలు ఏర్పరచిన రహదారినే ఉపయోగిస్తూ వచ్చారు.


ప్రపంచంలోని మరికొన్ని ప్రదేశాలలో ఇలాంటి రహదారులున్నా, ఈ రహదారి మాత్రం ప్రాముఖ్యత తెచ్చుకుంది. కారణం, దీని పొడవు--రెండు ఊర్లకూ మధ్య 4.5 కిలోమీటర్ల దూరం ఉండడమే! అంత దూరానికి రహదారి ఏర్పడుతుంది. అలాగే రహదారి మూసుకుపోయినప్పుడు అక్కడ నీరు 1.3 మీటర్ల ఎత్తు నుండి 4 మీటర్ల దాకా ఉంటుంది.


ప్రకృతి అలల మూలంగా ఏర్పరచిన ఈ రహదారిని దాటటమే మన మనసులను కదిలిస్తుందని ప్రజలు ఈ రహదారినే వాడుతున్నారు. అందువలన ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుని ఆ రహదారికి ఇరువైపులా అలల కోసం హెచ్చరికగా ఉండమని ప్రకటన పలకలు ఉంచింది. అయినా అప్పుడప్పుడు బాధాకరమైన సంఘటనలూ జరుగుతూనే ఉన్నాయి.


ప్రభుత్వం అలలు వచ్చేటప్పుడు తప్పించుకోవటానికి ఎత్తైన రక్షణ టవర్లు నిర్మించారు. ఆ టవర్లలో ఎక్కి తప్పించుకున్న వారిని ప్రభుత్వం రక్షక దళాలను పంపి రక్షిస్తుంది. ఈ రహదారిని చూడటానికీ, అందులో నుండి నడవటానికి పలుదేశాల నుండి పర్యాటకులు వస్తూ ఉంటారు.

Images Credit: To those who took the original Photos.

*******************************************************************************************

1 కామెంట్‌: