17, మే 2019, శుక్రవారం

దైవరహస్యం(నవల).....PART-2

ఆ రాయిని తీసి, ఆ రాయి క్రింద ఉన్న గుంతలోకి చూసినప్పుడు క్రింద మంచం లాంటి ఒక మట్టి దిబ్బె ఉండటం చూసి మేస్త్రీకి చెందిన మనుష్యులు ఆశ్చర్యపోయారు.

"అయ్యా...ఈ రాయికి క్రింద ఒక మట్టిదిబ్బె ఉన్నది. అది ఆరడుగులు లోతులో ఉన్నది. అది పడగొడితేనే  మనం పునాది వేయగలం"

"ఏదీ? నన్ను చూడనీ" అంటూ మేస్త్రీ గుంతలోకి చూశాడు. అతని ముఖంలోనూ ఆశ్చర్యం.

"ఏమిటి మేస్త్రీ...మట్టి దిబ్బే అంటున్నారుగా...మరైతే దానిమీదే పునాది వేయొచ్చుగా?"

"నాకెందుకో అది వట్టి మట్టి దిబ్బెలాగా కనబడటం లేదు...ఆ మట్టి దిబ్బె క్రింద ఇంకేదైనా ఉన్నదేమోనని అనుమానంగా ఉంది...అందుకని ఆ మట్టి దిబ్బెను జాగ్రత్తగా తవ్వి చూశేద్దాం"

"అలాగే చేయండి" చెప్పాడు అశోక వర్మ.

మేస్త్రీతో పాటు నలుగురు క్రిందకు దిగారు. నలుగురూ నాలుగ పక్కలా నిదానంగా మటిదిబ్బెను తవ్వటం మొదలు పెట్టారు. రెండు అడుగులు తవ్విన తరువాత 'కంగు’ మని శబ్ధం వినబడింది. అక్కడ మరింత జాగ్రత్తగా తవ్వారు. ఆశ్చర్యం అక్కడ ఒక ఇనుప పెట్టి ఉన్నది. తాళం వేసుంది.
విషయాన్ని ఆశోక వర్మకు చెబుతూ “అయ్యా...చూస్తుంటే అది దేవుడి పెట్టె లాగా కనబడుతోంది.. ఈశాన్య మూల ఉన్నదంటే  అదే అయ్యుంటుంది. ... పెట్టెలో ఏముందో చూడాలి”
 
"దేవుడి పెట్టె అని ఎలా చెబుతున్నావు?"

"పెట్టె మీద త్రిశూలం బొమ్మ వేసుంది. దేవుడి విగ్రహమో లేక ఆభరణాలో అయ్యుంటుంది"

అశోకవర్మకు చెమటలు పట్టటం మొదలయ్యింది. 'గుడి కడదామనుకున్నాం. విషయం ఇంకోమాదిరిగా మారుతోంది తనలో తానే మాట్లాడుకుంటూ మేస్త్రి మాటలకోసం ఎదురు చూశారు. కొద్ది నిమిషాలు గడిచినై. మేస్త్రీ దగ్గర నుండి సమాధానం రాలేదు.

"మేస్త్రీ ఏమిటి ఆలశ్యం?" అశోకవర్మ గారే అడిగారు. 

"తాళం పగలకొట్టటానికి కుదరటం లేదండి. పెట్టెను పైకి తీసుకు వచ్చి ఇంకేదైనా వస్తువుతో పగలకొట్టాలి"

“పైకా? పెట్టెను ఎలా పైకి తెస్తారు?"

“పెట్టెకు పైన ఒక పిడి ఉందండి. దానికి తాడు కట్టి పైకి లాగొచ్చు"

"మరైతే అలాగే కానివ్వండి".

పెద్ద తాడు వచ్చింది.

తాడును పెట్టె పిడికి గట్టిగా కట్టి పెట్టెను పైకి లాగారు.

పెట్టెను తెరవటానికి వాళ్ళ దగ్గరున్న ఆయుధాలన్నింటినీ ఉపయోగించారు. ఎన్నో సంవత్సారాలుగా తెరవని పెట్టె కాబోలు, ఒక పట్టాన రాలేదు. అందరికీ చెమటలు కారుతున్నాయి. చివరికి ఒక గొడ్డలితో నలుగురూ నాలుగుసార్లు కొట్టినప్పుడు తాళం తెరుచుకుంది. పెట్టెను తెరిచి చూసినప్పుడు.....
                                  ****************************************
 "టక...టక...!"

తలుపు ఎవరో కొడుతున్నారు...పరమేశ్వర్ గారు తెరిచారు.

ఎదురుగా కోటేశ్వరరావ్!

"ఎవరయ్యా ఆ లావుపాటి వ్యక్తి...మీ శ్మశాన స్థలాన్ని కొనడానికి వచ్చినట్లు తెలుస్తోంది?"

కోటేశ్వరరావ్ నేరుగా విషయానికి వచ్చాడు. అలాగే పరమేశ్వర్ ఆహ్వానం లేకుండానే ఆయన ఇంటిలోపలకు ప్రవేశించి హాలులోని కుర్చీలో కూర్చున్నాడు. అతని ధోరణిలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు.

కోటేశ్వరరావ్ కొంత గొడవ పెట్టుకునే మనిషి.

ఉర్లో వున్న అందరి ఇళ్ళలోని విషయాలు కొంతవరకు తెలుసు. అందుకని కోటేశ్వరరావ్ అంటే పరమేశ్వర్ గారికి ఒక చిన్న భయం. ఆ భయం పరమేశ్వర్ గారి ముఖంలోనూ కనపడ్డది.

"ఏమిటి పరమేశ్వర్... నేను అడిగినదానికి సమాధానమే చెప్పలేదు?"

"ఏం చెప్పమంటారు అంకుల్...? ‘ప్రాణాలు కావాలంటే వదిలేయండి. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ స్థలాన్ని మాత్రం ఎవరికీ అమ్మొద్దు’ అని మా నాన్నగారూ, అమ్మగారూ చెప్పి చనిపోయారనేదే కారణం. ఇదంతా ఆ లావుపాటి ఆయనకు చెప్పదలుచుకోలేదు. అందుకే....స్థలం అమ్మటం ఇష్టంలేదు, మీరు వెళ్ళచ్చు అని చెప్పాను"

"అమ్మకీ, నాన్నకీ నువ్వు ఇలాగా గౌరవం ఇచ్చేది! ఆ లావు మనిషి కోటి రూపాయలదాకా ఇస్తానంటున్నాడే...?"

“మీరు నా దగ్గర ఇంకేమీ మాట్లాడకండి! మీ వయసుకు మర్యాద ఇచ్చి...ఏది కారణమో దాన్ని మీ దగ్గర చెప్పేశాను. అంతకు మించి నన్నేమీ అడగకండి"

పరమేశ్వర్ గారి ముఖం, చెంపలు రంగు మారినై.

కోటేశ్వరరావ్ కోపంగా చూసుకుంటూ వెళ్ళిపొయాడు.

వాకిలి దాటిని కోటేశ్వరరావ్ తిరిగి పరమేశ్వర్ గారి ఇంటి లోపలకు వచ్చాడు.

"ఆ లావుపాటి మనిషి శ్వామీజీని చూడటానికి వెళ్ళాడు. శ్వామీజీ నిన్ను పిలిచి స్థలాన్ని అమ్మేయి అంటే నువ్వేం చేస్తావ్?"

“నేను కొలుస్తున్న ఆ ఏడుకోండలవాడే వచ్చి చెప్పినా నేను వినను. ఎందుకంటే...ఆయన మాట కన్నా నాకు నా తల్లితండ్రుల మాటే ఎక్కువ” 

కోటేశ్వరరావ్ కి చెప్పుతో కొట్టినట్టు అనిపించింది. అప్పుడే పరమేశ్వర్ గారి ల్యాండ్ లైన్ ఫోన్ మోగింది.

చెవులు పెద్దవి చేసుకున్నాడు కోటేశ్వరరావ్.

"ఆశీర్వాదం పరమేశ్వర్! నేను శ్వామీజీ మాట్లాడుతున్నాను. శివ కటాక్షంతో అన్నీ బాగానే జరుగుతాయి ...ఇప్పుడు నాకు బాగా కావలసినవాడు,  సింహాద్రి అనే అతను మీ స్థలం విషయంగా నిన్ను కలిశాడుట. నువ్వు అమ్మనన్నావట?"

"అవును శ్వామీజీ! ఇప్పుడే కోటేశ్వరరావ్ అంకులు కూడా ఆ స్థలాన్ని అమ్మితే ఏమైంది నీకు అని అడిగారు. నేను కొలుస్తున్న శ్రీనివాసుడే వచ్చి చెప్పినా, మా పెద్దల ఆశ ప్రకారం ఆ స్థలాన్ని నేనే ఉంచుకుంటాను అని చెప్పాను. మీకు అదే సమాధనం మరొకసారి చెప్పాల్సిన అవసరం ఉండదిని అనుకుంటున్నాను" అని శ్వామీజీకి సరైన సమాధానం చెప్పారు పరమేశ్వర్ గారు.

 పరమేశ్వర్ గారితో ఇంతకంటే మాట్లాడటానికి ఏమీలేదని నిర్ణయించుకున్న శ్వామీజీ ఫోను పెట్టాశారు.

గుమ్మం దగ్గరే నిలబడి వీళ్ళ మాటలను వింటున్న కోటేశ్వరరావ్ నిరాసతో వెనుతిరిగి వాకిటి గుమ్మం దాటేటప్పుడు 'కొరియర్”  పోస్ట్ వచ్చింది. కొరియర్ పోస్ట్ తెచ్చిన అతన్ని ఒక సారి క్రిందకూ, పైకి చూసి కోటేశ్వరరావు వెళ్ళిపోయారు.

పరిగెత్తుకెళ్ళి సంతకం పెట్టి కొరియర్ తీసుకున్నారు పరమేశ్వర్ గారు.

కొరియర్ మీదున్న ఫ్రమ్ అడ్రెస్స్ చూసిన వెంటనే అది హైదరాబాదులో ఉంటున్న తన కూతురు తులసి  దగ్గర నుండి అని తెలుసుకున్నారు.

పరమేశ్వర్ గారి భార్య మీనాక్షి కూడా ఆశతో  దగ్గరకు వచ్చింది.

"ఎవరండి...తులసియేనా?"

"అవును మీనాక్షీ"

"అలాగే గట్టిగా చదవండి...నేనూ వింటాను"

"నీ కూతురు ఇంకా పాతకాలంలోనే ఉన్నది అనుకుంటే...నువ్వు కూడా అలాగే ఉన్నావే?" అంటూ చదవటం మొదలుపెట్టారు.

'మై డియర్ మమ్మీ-డాడీ...

ప్రేమ ముద్దులు!
ఇక్కడ నా 'ట్రైనింగ్' ముగిసింది. 'డ్యూటీ'లో చేరడానికి ఆర్డర్ ఇచ్చేశారు. మధ్యలో ఒక రోజు కూడా 'లీవ్' లేదు.

నాకు 'క్రియేటివ్ అసిస్టంట్' పోస్టింగ్ వేశారు. అన్ని అలవన్స్ లతో కలిపి నలభై వేల రూపాయలు జీతం వస్తుంది. మొదటి నెల జీతం తీసుకున్న వెంటనే అది తీసుకుని వస్తాను. మన కులదైవమైన పార్వతీపురంలోని వెంకటేశ్వర స్వామి కి అభిషేకం చేయించి, మీరు చెప్పినట్లు మొదటి జీతం డబ్బును హుండీలో వేశేద్దాం.

ఈ నవీన యుగంలో ఇలా నేను ఉత్తరం రాయటానికి కారణం ఉన్నది. 'సెల్ ఫోన్లో’ మాట్లాడితే... ఆ నిమిషాలతో నా మాటలు ముగిస్తాయి. ఉత్తరం అంటే అలా కాదు. అమ్మకి నా జ్ఞాపకము వచ్చినప్పుడల్లా తీసి చదువుకోవచ్చు. ఎక్కువ ఖర్చూ లేదు. అంతేకాదు, ఉత్తరాలు ఆలొచనలను లోతుగా పంచుకోవటానికి సరైనవి.

ఈ 'సెల్ ఫోన్’ పరమ 'వేస్టు’ ! ఇది వ్యాపార లావాదేవీలు మాట్లాడుకొవటానికే ఉపయోగపడుతుంది మరియు దీనివలన నష్టం జరుగుతోంది. నాతో పనిచేస్తున్న ఒక అమ్మాయి చాలా పాపం. 'హాస్టల్లొ’ ఆమె స్నానం చేస్తున్నప్పుడు ఎవరో దొంగతనంగా 'సెల్ ఫోన్లో' వీడియో తీశారు. అది చూపి డబ్బు గుంజటానికి ప్రయత్నించారు. తరువాత నేనే ఆమెకు ధైర్యం చెప్పి, పోలీసులకు కంప్లైంట్ చేసి...వీడియో తీసిన అతన్ని పట్టుకోవటానికి సహాయపడ్డాను. వాడు ఏడేళ్ళ వరకు బయటకు రాలేడు. అతనిపై చాలా బలమైన నేరారోపణలను రిజిస్టర్ చేశాము.
ఇది చదివేసి నా గురించి అనవసరంగా కంగారు పడకండి. నేను జాగ్రత్తగానూ, రక్షణగానూ ఉన్నాను...ఉంటాను.

కారణం, నేను మీ కూతుర్ని.

నన్ను ఎవరూ, ఏమీ చేయలేరు.

నాకు పార్వతీపురం వెంకటేశ్వర స్వామి తోడు ఉంది.

ఆ విపూది పెట్టుకోకుండా ఆఫీసుకు వెళ్ళను. దీనివలన నా సహ ఉద్యోగులు, స్నేహితులూ నన్ను  ఎగతాలిగా  'తులసి మాతాజీ'  అని పిలుస్తారు. వాళ్ళ ఎగతాలి నాకు సంతోషాన్నే ఇస్తోంది.

నాన్నా! నువ్వు కాఫీలో పంచదార వేసుకోకు. అమ్మా...నువ్వు రోజు మోకాళ్ళు మడిచి వ్యాయామం చెయ్యి. అప్పుడే నీకు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటుంది.

నాన్నా...ఈ ఉత్తరం చేరినట్లు నాకు ఫోన్ చేయండి. ఫోనులో దీని గురించి ఐదు నిమిషాలు మాట్లాడితే...నిజానికి అదే ఆనందం !

ఇట్లు.
ప్రేమతో.
మీ తులసి.

పొడువాటి ఆ ఉత్తరాన్ని చదివిన పరమేశ్వర్ గారికి చాలా సంతోషంగానూ, తృప్తిగానూ అనిపించింది. తులసి తెలివితేటలు, ఆలొచనలు ఆయనకి కొండంత ధైర్యానిచ్చింది.
తల్లి మీనాక్షి కళ్లల్లో నీళ్ళు జేరాయి.

"ఏమండి.... వెంటనే దానికి ఫోన్ చేయండి. దాని గొంతు వినాలి..."

“ఉండు మీనాక్షీ...నీలోని ఆతృత కొంచం తగ్గనీ! ఈపాటికి ఉత్తరం దొరికి...మనం చదువుతున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటుంది తులసి. ఆదే ఆలొచనతో మన ఫోను కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ, మనం వెంటనే ఫోన్ చేయకూడదు. కొంచం దాన్ని ఏడిపిద్దాం"

"ఏమిటండి మీరు...అది చిన్న పిల్ల! దాన్నిపోయి ఏడిపించడం?" ఎప్పుడెప్పుడు ఏ ఆటలు ఆడాలో తెలియదా?

"మన పిల్ల దగ్గర మనం ఆడకపోతే ఇంకేవరు ఆడతారు"

"వద్దండీ అది తట్టుకోలేదు"

"అరె...దానికోసం నువ్వెందుకు ఏడవటం? ఏదో సరదాకోసం చెప్పాను. దానికొసం అంత సీరియస్ అవ్వాలా?"

“మరేమిటండి...మనల్ని విడిచిపెట్టి అది ఒకత్తిగా ఉంటోంది. హోటల్ భోజనం. ఎవరి చేతి వంటనో తింటూ అఫీసు పనులు చేసుకుంటోంది...దానికి మన ఆలొచనలే సుఖాన్నీ, తృప్తిని ఇస్తాయి"

"దానికి మాత్రమేనా...మనకి కూడా కదా?”

"మాట్లాడుతూనే ఉన్నారు గానీ ఫోన్ చెయటం లేదు....ఫోన్ చెయ్యండి"

"నేను ఫోను చేసి ఇవ్వకపోతే...రైలెక్కి మీ అమ్మాయిని చూడటానికి నేరుగా వెళ్ళిపోతావనుకుంటా?"

"ఖచ్చితంగా...అలాగనుక నేను వెలితే, నా బంగారు తల్లికి నాలుగురోజులు నా చేత్తో వండిపెడతా"

"పిచ్చిదానా! దానికి నువ్వు ఇప్పుడే రెడీ అవ్వు. నేనూ నీతో వస్తాను. ఇద్దరం మన కూతురి ముందు వెళ్ళి నిలబడదాం"

"నిజంగా చెబుతున్నారా?......సరే...ఫోన్?"

"అరే, మనం నేరుగా వెల్తున్నాం కదా?"

"మనం వెళ్ళటానికి ఎలాగూ ఏడెనిమిది గంటలు పడుతుంది. ఈలోపు మన దగ్గర నుండి ఫోన్ రాలేదే నని తులసి కంగారుపడుతుందే?"

"బాగా కంగారు పడని"

"సరే! మనం ఫోను చేయకపోతేనేం...అదెలాగూ చేస్తుంది"

"అదేమీ కుదరదు. నా సెల్ ఫోన్ 'ఆఫ్' చేసేశ్తాను"

"ఏమిటండి మీరు? తిరిగి తిరిగి మీ దారిలోకే వెలుతున్నారు"

“నేను ప్రేమను చేరుస్తున్నాను. మనకి ఫోన్ చేసి స్విచ్డ్ ఆఫ్ అని వచ్చి తులసి కంగారుపడుతూంటే దాని ఎదురుగా వెళ్ళి నిలబడతాం. అప్పుడు తులసికి ఎలా ఉంటుందో ఊహించుకో"

"దాన్ని కంగారు పెట్టి దాని ఎదురుగా నిలబడటం? ఏమిటండీ మీ ఆటలు? ఫోన్ చేసి ఇద్దరమూ బయలుదేరి వస్తున్నాము అంటే... ఆ మాట ఎంత సంతోషం ఇస్తుందో తెలుసా?"

“మీనాక్షి...నీ ప్రేమకు ఒక హద్దు లేదు.  ఏప్పుడూ నువ్వొక విషయాన్ని మరిచిపోయే మాట్లాడతావు. మనకు వయసు పైబడుతోంది.  మనం మన జీవితాంతం దానితో ఉండగలమా?” 

"మీరేం మాట్లాడుతున్నారు? మీ మాటలు నాకేమీ అర్ధంకావటంలేదు"

“పిచ్చిదానా...కలిసి ఉండేటట్లే...విడిపోయి ఉండటం కూడా నేర్చుకోవాలి. ఒకవేల మన జీవితం ముగిసి మనం వెళ్ళి జేరిపోతే, మన అమ్మాయి భయపడి నిలబడిపోకూడదు. ధైరంగా తన దారిలో తాను ఎదుగుతూ ముందుకు వెళ్ళిపోవాలి. దానికి ఇదంతా ఒక ట్రైనింగ్ "
పరమేశ్వర్ గారు తన వాదనను న్యాయపరిచాడు.

మీనాక్షి మాత్రం చివరివరకు భర్త మాటలను అంగీకరంచలేదు. భర్తకు తెలియకుండా రహస్యంగా కూతురుకి ఫోన్ చేయాలని నిర్ణయించుకుంది.

తులసి 'సెల్ ఫోన్’ నాట్ రీచబుల్ అనే వస్తోంది! 
 ******************************************************************************
పెట్టెను తెరిచి చూసినప్పుడు.....

అందులో ఒక విగ్రహం పడుకోబెట్టబడి ఉంది. పెట్టెలోని ఆ విగ్రహం నిటారుగా పడుకుని ఆకాశాన్ని చూస్తోంది. చాలా కాలంగా ఆ విగ్రహం పెట్టెలోనే ఉండటం వలన అది మట్టితో మూసుకుపోయుంది. మంచి గుడ్డతో ఆ విగ్రహం పైన ఉన్న మట్టిని తుడిచారు. అప్పుడు విగ్రహం పై పడిన వెలుతురులో విగ్రహం కాంతితో వెలిగిపోయింది. అది ఒక దేవత విగ్రహం. ఏ దేవతో తెలియటం లేదు. మూడడుగుల వెడల్పు, ఐదడుగుల ఎత్తు ఉన్నది. ఒక చేతిలో చేతి నిండుగా ఆయుధాలు! ఇంకొకక చేతిలో ఒక చిన్న కత్తి మాత్రమే ఉన్నది. 

మేస్త్రీ, మెస్త్రీ మనుష్యులు, అశోక్ వర్మ, ఆయన భార్య శేషమాంబ ఆ విగ్రహం ను చూసి విస్తుపోయారు.

"అయ్యగారూ...దేవుని విగ్రహం"

"చూస్తే అలాగే ఉన్నది. కానీ ఎందుకు ఈ విగ్రహం ను పెట్టెలో పెట్టి తాళం వేశారో తెలియటం లేదు" చెప్పాడు మేస్త్రీతో ఉన్న ఇంకో వ్యక్తి.

"ఇప్పుడేం చెయ్యాలయ్యా?"

"ఏంచేయాలో నాకూ తెలియటం లేదు"

"ఏమండి మన ఊరి చివర్లో ఉన్న కొండ మీద నివసిస్తున్న ఆత్మానంద శ్వామీజి ని కలిసి విషయం చెప్పి వివరాలు ఆయన్ను అడుగుదామా?" శేషమాంబ సలహా ఇచ్చింది.

"ఇలాంటి విషయాలను అడగటానికి ఆ శ్వామీజీయే సరైన వ్యక్తి. అలాగే చేయండి! ప్రస్తుతానికి ఈ విగ్రహం ను ఈ పెట్టలోనే పెట్టి ఈ గుంత పైనే ఉంచుదాం. ఆత్మానంద శ్వామీజీ గారు వచ్చి చూసిన తరువాత ఆయన ఎలా చెబితే అలా చేద్దాం"  అని చెప్పి తన పనిని వాయిదా వేశాడు మేస్త్రి.

అశోక వర్మ లో ఆదుర్దా కనబడుతోంది. మేస్త్రీ గుంపు వెళ్ళిపోయాక....శేషమాంబ అడిగింది.

"ఏమండి...ఏమిటండి ఇదంతా? మంచికా...చెడుకా?"

"అదే శేషూ నాకూ అర్ధం కావట్లేదు. ఇది దన్నం పెట్టుకో వలసిన  విగ్రహమా...లేక ఇలా భూమిలోపలే ఉండాల్సిన విగ్రహమా?...తెలియటం లేదు"

"సరే రండి...ఇప్పుడే కొండపైకి వెడదాం"

"ఇప్పుడు మనకు అదొక్కటే దారి" అని చెప్పి, బయలుదేరటానికి ముందు ఇంట్లో ఉన్న చెక్క పలకలను తీసుకుని గుంతను మూయడానికి ప్రయత్నించాడు. కుదరలేదు. ఈలోపు విషయం తెలుసుకున్న ఊరి ప్రజలు అక్కడకు రావటం మొదలు పెట్టారు.
                                    *********************************
 పరమేశ్వర్ గారు, ఆయన భార్య మీనాక్షీ ఆ నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న బస్ స్టాండుకు వచ్చారు. బయట ఉర్లకు వెళ్ళే బస్సులు ఆగే చోటుకు వెళ్ళి నిలబడ్డారు.

తుపాకీలో నుంచి బుల్లెట్లు దూసుకు వెడుతున్నట్టు ఆ నాలుగురోడ్ల రహదారి మీద వాహనాలు దూసుకు వెడుతున్నాయి. భార్య మీనాక్షి ముఖం వాడిపోయుండడం గమనించారు పరమేశ్వర్ గారు. అలా ఎందుకుందో ఆయనకు అర్ధమైంది.

"మీనాక్షీ...నీ కూతురితో మాట్లాడ దలుచుకుంటే మాట్లాడు" అంటూ సెల్ ఫోన్ ఆమె చేతిలో పెట్టాడు. ఆమే ఫోన్ చేసింది.

"నాట్ రీచబుల్ అనే వస్తోంది..."

"అంటే తులసి సిగ్నల్ దొరకని చోట ఉండుంటుంది"

"అదెలాగండీ...మన సిటీలోనే సిగ్నల్ దొరుకుతున్నప్పుడు...అంత పెద్ద నగరంలో సిగ్నల్ దొర్కకుండా పోతుందా?"

"కోపగించుకోకు...! కొన్ని సమయాలలో సిగ్నల్  టవర్ కు ‘పవర్ కట్’ ఏర్పడుతుంది. మన దేశంలో ‘పవర్ కట్’ లేని ఊరే లేదే?"

పరమేశ్వర్ గారి మాటలు ఆమెకు తృప్తినివ్వలేదు. ఆమెకు తులసితో మాట్లాడితేనే మనసుకు ఊరట కలిగేటట్టు ఉంది.

ఆ సమయంలొనే వాళ్ళు ఎక్కవలసిన హైదరాబాద్ బస్సు అటువైపు వచ్చింది. కానీ అక్కడ ఆగకుండానే వెళ్ళిపోయింది. మరో రెండు బస్సులు కూడా ఆగకుండా వెళ్ళిపోయినై.

"ఏమిటండీ ఇది! బస్సులు చూస్తే ఖాలీగానే ఉన్నాయి… కానీ ఒక బస్సు కూడా ఆగటం లేదు"

“ఈ బస్సులన్నీ నగరంలో వారికే కాబోలు"

"మనం కూడా టాక్స్ కడుతున్నాముగా?"

“మనమెంత కడుతున్నాం....వాళ్ళలాగా వేలు కాదుగా. కొంచంగా కడుతున్నాం"

"మీరు ప్రభుత్వానికి ఆదరణగా మాట్లాడుతున్నారా లేక ఎదిరించి మాట్లాడుతున్నారా?"

"నేను న్యాయాన్ని మాట్లాడుతున్నాను! నీకెలా తీసుకోవాలనిపిస్తే అలా తీసుకో. నగర జీవితంలో కొంత చెడు, కొంత మంచి ఉన్నది. సిటీ జీవితంలోనూ అంతే!"

"ఎందుకిలా ఏమిటేమిటో మాట్లాడుతున్నారు...ఇంతవరకు బాగానే ఉన్నారుగా?"

"ఏం చేయను...బస్సు దొరికేంత వరకు మనకు టైము గడవాలిగా?"

పరమేశ్వర్ గారు సరదాగా చెబుతుంటే, వాళ్ళని రాసుకుంటూ ఒక కారు వచ్చి నిలబడింది.
కారు అద్దాలు గబుక్కున దిగినై.

కారులో ఉన్న అతని ముఖం కనబడింది...అంతకు ముందు పరమేశ్వర్ గారి ఇంటికి వచ్చిన ఆ లావుపాటి మనిషి.

"హలో ప్రొఫసర్..." అన్నాడు.

పరమేశ్వర్ గారికి అతన్ని చూడటానికి ఇష్టం లేదు.

తల తిప్పుకున్నాడు.

"ప్రొఫసర్...మిమ్మల్నే! ఎక్కడికి బయలుదేరారు?"

"అది మీకెందుకు?"

“కోపగించుకోకండి....మీరి చెప్పక పోయినా నాకు అర్ధమవుతోంది. మీరు నిలబడున్న చోటు చూస్తేనే మీరు హైదరాబాద్ వెడుతున్నారని. నేనూ హైదరాబాద్ కే వెల్తున్నాను. ఎక్కండి. హైదరాబాద్ లో ఎక్కడ దిగాలో చెప్పండి"

"చాల ధ్యాంక్స్! మేము బస్సులోనే వెలతాం"

"ఏమిటి ప్రొఫసర్...నన్ను మీ జన్మ విరొధిని చూసినట్లు చూస్తున్నారు. నేను చాలా మంచివాడిని"

"ఇప్పుడు మీరు కొంచం నోరు మూసుకుంటారా?"---పరమేశ్వర్ గారు కొపంగా అరిచారు.

ఇంక ఏమీ మాట్లాడకుండా అతను కూడా అక్కడి నుండి బయలుదేరాడు.

వెనకాలే ఇంకొక కారు! చూసిన వెంటనే అదొక ట్రావల్స్ కారు అని తెలుస్తోంది. ఈ కారు కూడా పరమేశ్వర్ గారిని ఆనుకుంటూ నిలబడ్డది.

లోపల నుండి డ్రైవర్ మాట్లాడాడు.

"సార్...వస్తారా? కారు హైదరాబద్ వరకు వెడుతోంది"

"లేదయ్యా...మేము బస్సులోనే వెల్తాం"

"సార్...బస్సు చార్జీ ఎంతో అంతే డబ్బులు ఇవ్వండి"

పరమేశ్వర్ గారు ఆలొచనలో పడ్డారు.

"ఏమండీ...వెల్దామండి..." అన్నది భార్య మీనాక్షి.

“సరేనయ్యా...కానీ ఒక కండిషన్! వెళ్ళే దారిలో ఇంకెవరినీ ఎక్కించుకోకూడదు"

"అలాగైతే ఒక వందరూపాయలు చేర్చి ఇవ్వండి సార్"

"ఇప్పుడే కదా బస్సు చార్జీ డబ్బులు ఇస్తే చాలన్నావు?"

"డీజల్ ఖరీదు గురించి కొంచం ఆలొచించండి సార్"

"ఇలా చూడయ్యా...ఆ డీజల్ ఖరీదులు నీకు మాత్రమే కాదు; నాక్కూడా!"

"సరే సార్...మీ ఇష్టమైనట్టే ఇవ్వండి...ఎక్కండి"

డ్రైవర్ కారు దిగి, వెనుక డిక్కీ ఓపన్ చేశాడు.

వాళ్ళ సూట్ కేసులను అందులో పెట్టి, డిక్కీ మూశాడు.

వాళ్ళు వెనుక సీటులో ఎక్కి కూర్చున్నారు.

మీనాక్షికి కి ఉత్సాహంగా ఉంది.

డ్రైవర్ ఏ.సి ఆన్ చేసి, సి.డి పెట్టి పాటలు ఆన్ చేశాడు.

"డ్రైవర్...పాట ఆపు! నాకు ఈ సినిమా పాటలంటేనే ఇస్టం లేదు" అన్నారు పరమేశ్వర్ గారు.

డ్రైవర్ పాటలు ఆపాడు.

"ఏమండి ఇప్పుడు ఫోన్ చేసి చూడండి. తులసి లైన్ దొరుకుతుందేమో..."

పరమేశ్వర్ గారు ఫోన్ చేసి చూశారు. లైన్ దొరకలేదు.

ఇంతలో టోల్ గేట్ వచ్చింది.

విసుగ్గా డబ్బులు అందించాడు డ్రైవర్. రసీదు తీసుకుంటూ "సరైన దోపిడీ దారులు మీరు...రోడ్డువేసి దాన్ని మైన్ టైన్  చేయాల్సిన బధ్యత ప్రభుత్వానిది! ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని సంపాదిస్తున్నది కాంట్రాక్టర్లు" తన కోపాన్ని కక్కాడు.  పరమేశ్వర్ గారు నవ్వుకున్నారు. 

"కరెక్టుగా చెప్పావయ్యా...నా ఊరికి నేను రావటానికి వీడి దగ్గర రోజూ అనుమతి అడగాల్సి వస్తోంది. దారికి అడ్డుపడి కూర్చుని మరీ ప్రాణం తీస్తున్నారు. బాధ్యత కోసం కొద్ది డబ్బులు తీసుకుంటే పరవాలేదు. వందల లెక్కలో టాక్స్ వేసి కొల్ల గొడుతున్నారు. నిజానికి రోడ్డు వేయటానికి ఎంత ఖర్చు పెట్టారు?...దాన్ని 'రికవర్ చేయడానికి ఈ టోల్ గేట్ టాక్స్ కలక్షన్ సరైన పద్దతేనా? అని నాలో చాలా ప్రశ్నలు ఉన్నాయి….కొన్ని టోల్ గేట్ లలో పది పదిహేను సంవత్సరాలుగా టోల్ వసూలు చేస్తున్నారు. ప్రజలు విప్లవంతో ఎదురు ప్రశ్న వేస్తే గానీ వీళ్ళు మారరు"

డ్రైవర్ ఒక సారి తిరిగి చూసి నవ్వాడు.

పరమేశ్వర్ గారు కూతురు తులసికి మళ్ళీ ఫోన్ చేశాడు. మంచికాలం ఈ సారి కనెక్షన్ దొరికింది.

"తులసీ..."

"నాన్నా..."

"ఏంటమ్మాయ్...నీ లైన్ దొరకటమే కష్టంగా ఉన్నది"

"నేను ఏం.డి రూములో మీటింగులో ఉన్నాను. అక్కడ సెల్ ఫోన్ వర్క్ చేయదు. జామర్ ఉన్నది..."

"అదా సంగతీ!  'బై ద బై'...నీ ఉత్తరం అందింది. బాగా రాసావమ్మా!"

"ధ్యాంక్స్ నాన్నా! మీ ఫోను కోసమే రూము బయటకు వచ్చాను...వెంటనే మీ దగ్గర నుండి కాల్ వచ్చింది"

"కొంచం ఉండమ్మా మీ అమ్మ మాట్లాడాలట..." అంటూ పరమేశ్వర్ గారు ఫోనును భార్యకు ఇస్తూ మనం కారులో వస్తున్నట్టు చెప్పకు... సస్పెన్స్ గా వెళ్ళి నిలబడదాం" అన్నాడు.

అవేమీ పట్టించుకోకుండా సెల్ ఫోన్ తీసుకుని "తులసీ" అన్నది మీనాక్షి.

"అమ్మా...వచ్చే నెల కచ్చితంగా నిన్ను కలుస్తానమ్మా"

"ఎలా ఉన్నావురా?"

"నాకేమమ్మా...బాగున్నాను! కానీ, భోజనానికే కష్టంగా ఉన్నది. నేను తింటున్న మెస్ లో రాఘవులు అనే ఒకాయన వంటాయనగా ఉంటున్నాడు. ఆయనకి ఈ ప్రపంచంలోనే చాలా ప్రియమైనది గుమ్మడి కాయ. రోజూ దానితోనే సాంబార్, అలాగే బీట్రూట్ కూర. ఎందుకంటే కూరగాయల మార్కెట్టులో ఈ రెండు కూరలే చౌకగా దొరుకుతాయి...అందుకే"

"అలాగైతే నీ నాలుక చచ్చిపోయిందని చెప్పు"

"అది చచ్చి...దాన్ని పూడ్చి కొన్ని నెలలవుతోంది. ఇప్పుడు నేను అద్దెకు తీసుకున్న నాలుకతో మాట్లాడుతున్నా" పకపక నవ్వింది తులసి.

మీనాక్షీకి కళ్ళల్లో నీళ్ళుతిరిగినై. పెదవులదాకా వచ్చిన 'మేము వస్తున్నామమ్మా' మాటను బలవంతంగా ఆపుకుంది.

"ఊర్లో వర్షాలు ఏమైనా పడ్డాయా?"

"వర్షాలా....గిర్షాలా! ఊరి ప్రజలందరూ కలిసి ఏడిస్తే...కళ్ళల్లో నీళ్ళొచ్చి, అందులో నాలుగు చుక్కలు నేలమీద పడితేనే"

"ఊరి కోలనులో నీళ్ళున్నయ్యా...ఎండిపోయిందా?"

“ఏవో కొంచంగా ఉన్నాయి. పవర్ కట్టేనమ్మా ప్రాణం తీస్తోంది. పనిచేయకపోయినా ఎండల వేడికి, చెమటకు టయర్డ్ అయిపోతున్నాం"

"ఇక్కడ నాకు ఆఫీసులో ఏ.సి ఉందమ్మా...కానీ రూములో చాలా కష్టం"

"హాస్టల్లొ కాకుండా పోనీ వేరుగా ఇల్లు తీసుకుని ఉండొచ్చుగా”

“అద్దె పది నుండి పేన్నెండు వేల దాకా పెట్టాలమ్మా. వచ్చే జీతంలో సగం డబ్బు అద్దెకే కట్టేస్తే ఎలాగమ్మా?"

"అందుకని ఇలాగే ఎన్ని రోజులు కష్టపడతావు"

"నా జీతంతో ఇల్లు కొనుక్కునేంతవరకు సహించుకోవాలమ్మా"

"దాని కంతా యొగం కావాలమ్మా. మనకని ఉన్న స్థలాన్నే మనం ఉపయోగించుకోలేకపోతున్నాము..."

"నేనూ అడగాలనే అనుకున్నాను! దాన్ని ఉంచుకోవటం కంటే ఎవరికైనా ఆమ్మేస్తే పొతుందిగా అమ్మా..."

“అదెందుకు అడుగుతావ్...ఈ రోజు కూడా ఆ స్థలం కొనడానికి ఒకరొచ్చారు..."---మీనాక్షి ఆ స్థలం గురించి మాట్లాడటం మొదలుపెట్టినప్పుడే ఆ విశాద సంఘటన చోటు చేసుకుంది.
వెగంగా వెడుతున్న వాళ్ళ కారు మీద...'బ్రేక్' పట్టని లారీ ఒకటి అత్యంత వేగంతో ఢీ కొట్టింది. ఆ శబ్ధాన్ని సెల్ ఫోన్ మూలం తన చెవిలో విన్న తులసి మనసు తునకలయ్యింది...తల్లి చేతిలోని సెల్  ఫోన్ లాగానే ?

Continued.....Part-3

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి