29, సెప్టెంబర్ 2019, ఆదివారం

తొలివలపు (సీరియల్)...PART-17



                                               తొలివలపు….(సీరియల్)
                                                           (PART-17)


రాత్రి. మామిడి తోటలో నులక మంచం మీద కుర్చోనున్నారు బాపిరాజు గారు. తాగిన మత్తు ఆయన తలకు ఎక్కింది. లాంతర్ వెలుతురులో మందు బాటిల్స్ మెరుస్తున్నాయి. ఎదురుకుండా నేల మీద ఈషారం కూర్చోనున్నాడు. వాడూ తాగుతున్నాడు.

"చాలు అయ్యగారూ. ఇదేమిటీ కొత్త అలవాటు? నన్ను తాగొద్దని నాకు బుద్ది చెప్పే మీరు , మీరే ఇలా...! మొదట మీరు ఇంటికి వెళ్ళండి. అమ్మగారు వెతుకుతారు " అన్నాడు.

"అరే పోరా. ఆవిడ పాత శకుంతల లాగా లేదురా. దానికి దయ్యం పట్టింది. అనుమానం దయ్యం. పాపంరా నా కూతురు. లోకం తెలియని పసిపిల్ల. దానికి పెళ్ళిచేయాలని మొండి పట్టుదల పడుతోంది. కన్న కూతురు మీదే అనుమాన పడుతోంది. ఆమె సందేహం వలన ఈ రోజు ఒక ప్రాణం పోయింది. ఇదంతా చూస్తుంటే నా గుండె పగిలిపోతోందిరా. మనసు నొప్పి పుడుతోంది. ఆ నొప్పి తెలియకుండా ఉండటం కోసమే తాగాను..." అంటూ ఒక బాటిల్ తీసుకుని గొంతులో పోసుకున్నారు బాపిరాజు గారు.

సమయం అర్ధరాత్రి దాటింది. ఈషారాం ను పిలిచారు. అతని దగ్గర నుండి సమాధనం లేదు. తూలుతూ లేచి నిలబడటానికి ప్రయత్నించారు....నిలబడలేక మంచం మీద పడిపోయారు.

"నీకు...ఏమైంది..శా..కూ? ఎందుకు.ఇ..లా..." అంటూ ఏదేదో గొణుగుతున్న బాపిరాజు గారి నోటిని మూసింది ఒక చేయి. ఆ చేతిని గట్టిగా పుచ్చుకుని "శకుంతలా" అన్నారు.

వీచిన గాలితో లాంతర్ వెలుగు ఆరిపోయింది. చలనం లేకుండా నిలబడున్నది రాత్రి. ఆ నిశ్శాబ్ధాన్ని చేధిస్తూ దూరంగా ఒక కుక్క ఏడుపు వినబడింది.

తెల్లారింది.

ఈశాన్య దిక్కులో ఉదయిస్తున్న సూర్యుడ్ని స్వాగతిసున్నట్టు పక్షులు హడావిడిగా అరుస్తున్నాయి. పక్షుల అరుపుల శబ్ధాన్ని విని కళ్ళు తెరిచారు బాపిరాజు గారు. గబుక్కున ఏదో గుర్తుకు వచ్చినట్లు మంచం మీద నుండి క్రిందకు దిగారు. దగ్గరగా పడుకోనున్న ప్రమీల, మంచం ఊపుకు నిద్ర నుండి మేల్కుని బాపిరాజు గారిని చూసి నవ్వింది.

మంచం మీద నుండి కిందకు దిగుతూ జారిపోయున్న పమిటను సర్ధుకుంది ప్రమీల.

"ఏమే...రాక్షసీ" - అని తల కొట్టుకుంటూ గోలచేశారు బాపిరాజు గారు.

"ఎందుకిలా చేశావే?  నీకు నేను ఏమి అపకారం చేశాను?"

ఆవేదనతో అడిగిన బాపిరాజు గారిని నిర్లక్ష్యంగా చూసి చెరిగిపోయిన జుట్టును ఒకటిగా చేర్చి గుండ్రంగా చుట్టుకుని బాపిరాజు గారి దగ్గరగా వచ్చింది.

"నువ్వు నాకు మంచే చేసేవయ్యా! నేను కాదని చెప్పటం లేదు? కానీ, అది నీకే తెలియకుండా నీకు పాపంగా మారిపోయింది?"

అర్ధం కాక ఆమెనే చూశాడు బాపిరాజు గారు.

"అర్ధం కాలేదు కదా...దాంపత్య జీవితానికే పనికిరాని ఒకడ్ని నాకు కట్టబెట్టి నా జీవితాన్నే నాశనం చేశారే! అదేనయ్యా మీరు చేసిన పాపం. ఆ రోజే నా దారిలో నేను వెళ్ళి వుండేదాన్ని. కానీ, ‘పెళ్ళి’ అనే ఆశ చూపి మోసం చేశారు. నా భవిష్యత్తే మీ వల్ల ప్రశ్నార్ధకం అయిపోయింది. అతను తాగుబోతుగా ఉన్నా పరవలేదు. సంసారం చేయటానికి యోగ్యతే లేని ఒకడితో ఎలా జీవించగలను? జీవితం వృధా అయిపోయిందే అని అనుకుని ఎన్ని రోజులు ఏడ్చానో తెలుసా? ఆ టైములో నన్ను ఈ స్థితికి తీసుకు వచ్చిన మీమీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనిపించేది. చివరగా మీరే వచ్చి నా వలలో చిక్కుకున్నారు. నిజంగా చెబుతున్నాను. మగాడంటే నువ్వే నయ్యా. నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా?" -- మెల్లగా బాపిరాజు గారి దగ్గరకు చేరి ఆయన ఛాతీ మీద చెయ్యి పెట్టింది.

"ఛీ...ఛీ. చెయ్యి తీయ్. నువ్వు ఇంత నీచమైన మనిషిగా ఉంటావని నేను కొంచం కూడా ఎదురుచూడలేదు. ఇప్పుడే ఈషారం దగ్గర చెప్పి, నిన్ను ఈ ఊరు నుంచి తరిమేసిన తరువాతే నేను ఇంకో పనిచేస్తాను"

ఆవేశంతో చెప్పిన బాపిరాజు గారిని నిర్లక్ష్యంగా చూస్తూ గట్టిగా నవ్వింది ప్రమీల.

"అతను ఇక్కడుంటేగా?" అన్నది.

"ఏం చెబుతున్నావు...ఈషారాం ఎక్కడ? వాడ్ని ఏం చేశావు? ఇప్పుడు చెబుతావా...లేదా?"

"నిజంగా అతన్ని నేనేమీ చెయ్యలేదు. తానుగానే పారిపోయాడు. ఇంకేం చేస్తాడు, తన పెళ్ళాం ఇంకొక మగాడితో ఉండటం చూస్తే ఏ మొగుడు చూస్తూ నిలబడుతాడు? రోషం ఉన్న మనిషి....అందుకనే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు" -- చెప్పేసి గల గలమని నవ్వింది ప్రమీల.

భూమి వెనక్కు తిరిగుతున్నట్లు అనిపించింది బాపిరాజు గారికి. ఇంతకాలంగా తాను చేర్చి పెట్టుకున్న గౌరవం, మర్యాద అన్నీ ఒకే రోజు రాత్రి గాలిలో కలిసిపోయినట్లు అనుకుని లోలోపల తపించిపోయాడు. 'ఆ రోజే భార్య శకుంతల మాటలు వినుంటే నాకు ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడేదా? వినకుండా పోయావే పాపాత్ముడా' తల కొట్టుకుంటూ ఏడుస్తూ తనని తానే నిందించుకున్నాడు. తరువాత, కన్నీళ్ళు చూపును అడ్డుకుంటుంటే...తూలుతూ ఇంటివైపుకు నడవటం మొదలుపెట్టారు.

ఇల్లంతా సాంబ్రాణి పొగ అలుముకుంది. శకుంతలాదేవి, పూజ గదిలో ఉన్నట్లు చెప్పకుండా చెబుతోంది అది. గాయత్రి ఇంకా లేవలేదు. ముందు రోజు తిన్న దెబ్బల వలన వొళ్లంతా వాపెక్కటంతో లేవడానికి కూడా ఓపిక లేక పడుంది.

"భగవంతుడా! ఏ సమస్య రాకుండా నా కుటుంబాన్ని నువ్వే కాపాడాలి"--ప్రార్ధించుకుని పూజ గదిలో నుండి బయటకు వచ్చిన శకుంతలాదేవి, భర్త రావటం గమనించి వంట గదిలోకి వెళ్ళి కాఫీ కలుపుకుని తీసుకు వచ్చింది. అది కూడా గమనించ కుండా ఎక్కడో చూసుకుంటూ కూర్చున్నారు బాపిరాజు గారు.

"కాఫీ పెట్టాను" భర్త మొహం చూడకుండా చెప్పి వెళ్ళబోయింది...కానీ, భర్త చలనం లేకుండా కూర్చోనుండటం గమనించి,

"మిమ్మల్నే" అన్నది, కొంచం గట్టిగా.....ఆప్పుడు మామూలు స్థితికి వచ్చిన బాపిరాజు గారు, తన భార్యను చూసీ చూడంగానే...గబుక్కున ఎగిరి ఆమె కాళ్ళు పట్టుకుని పెద్దగా ఏడవటం మొదలుపెట్టారు.

"నన్ను క్షమించు శకుంతలా. నేను పెద్ద తప్పు చేశానే" అంటూ జరిగిందంతా చెబుతుంటే శకుంతలాదేవి మనసు లోలోపల కొంచం కొంచంగా విరిగి ముక్కలు అవుతోంది.

తండ్రి ఏడుపు విని గాయత్రి లేచి పరిగెత్తుకుని వచ్చింది. తన ముందు వచ్చి నిలబడ్డ కూతురి రెండు చేతులు పుచ్చుకుని తన చెంపల మీద మార్చి మార్చి కొట్టుకున్నారు. తండ్రి అలా ఎందుకు చేస్తున్నారో అర్ధం కాక పోయినా, గాయత్రి తండ్రిని సమాధన పరిచే పనిలో ఈడుపడింది.

చాలసేపు అయిన తరువాతే తండ్రీ, కూతుర్లు ఇద్దరూ అది గమనించారు. ఏదో కాలుతున్న వాసన. మొదట్లో బాపిరాజు గారి బుర్రకు తట్టలేదు. తరువాత బుర్రలో ఎదో ఒక రవ్వ ఏర్పడటంతో సడన్ గా లేచి పరిగెత్తారు. ఏమైందో తెలియక తండ్రి వెనుకే పరిగెత్తింది గాయత్రి. ఇంట్లోని ఏ గదిలోనూ శకుంతలాదేవి కనిపించలేదు. వెనుక గుమ్మం తెరిచి ఉండటంతో అటు వెళ్లారు...స్నానాల గది మొత్తం పొగ కమ్ముకోనుంది.

"శకుంతలా" అంటూ బాపిరాజు గారు పెద్దగా కేకలు వేయడంతో జనం గుమికూడారు. కొంతమంది కలిసి పోరాడిన తరువాత తలుపు పగలకొట్టబడింది. లోపల కనబడిన దృశ్యం చూడగానే కళ్ళు తిరిగి పడిపోయారు బాపిరాజు గారు. శిలలాగా అయిపోయింది గాయత్రి.

అవును! తన భర్త...మరో పురుషుని భార్యను ముట్టుకున్నందు కోసం...ఇక అయన వేలు కూడా తన మీద పడకూడదని నిర్ణయించుకుని మంటల ఆకలికి తనని ఆహారంగా ఇచ్చుకుంది ఆ పతివ్రత శకుంతలాదేవి.

ఇంకా ఉంది.....Continued in: PART-18

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu (బుక్ మార్క్ చేసుకోండి)

27, సెప్టెంబర్ 2019, శుక్రవారం

తొలివలపు (సీరియల్)...PART-16



                                              తొలివలపు….(సీరియల్)
                                                           (PART-16)


ఆ రోజు గాయత్రిని స్కూలుకు తీసుకువెళ్ళి దింపి ఇంటికి వచ్చిన బాపిరాజు గారికి, భార్య పెళ్ళిళ్ల బ్రోకర్ తో మాట్లాడటం వినబడగానే అలాగే అరుగు మీద కూర్చుండిపోయాడు.

"అదంతా తరువాత మాట్లాడుకుందాం! నా కూతుర్ని పెళ్ళికొడుకు వాళ్ళింట్లో అందరూ నచ్చిందని చెప్పేరా...లేదా? ఆది చెప్పండి మొదట"

"నచ్చిందా అని అడుగుతున్నారా...? భలే అడిగేరు పొండి. మీ అమ్మాయే వాళ్ళింటి కోడలని వాళ్ళింట్లో వాల్లందరూ తీర్మానమే చేసుకున్నారు. మీ సమాధానం కోసం మాత్రమే వాళ్ళు కాచుకోనున్నారు. ఒకవేల మీకు వాళ్ళ సంబంధం నచ్చింది అంటే, తాంబూళాలు మార్చుకున్న వెంటనే పెళ్ళి కూడా పెట్టుకోవాలని అనుకుంటున్నారు. వాళ్ళు అలా తొందరపడుతున్నందుకు ఒక కారణం ఉంది. వాళ్ళింట్లో వయసైన ఒకావిడ ఉన్నది. నాలుగు వంశాలను చూసింది. ఆవిడ తన చేతులతో తాళి తీసిచ్చే వాళ్ళింట్లో అన్ని పెళ్ళిల్లూ జరిగినైయట. ఆ వయసైన ఆవిడ ఇప్పుడు సీరియస్ గా ఉన్నదట. కళ్ళు మూసేలోపల చివరి మనవడి పెళ్ళి కూడా చూడాలని ఆశపడుతోందట. అందుకనే ఇలా ఒక ఏర్పాటు.

మీరు దేని గురించి భయపడక్కర్లేదు. చాలా మంచి మనుషులు. ఆ ఇంటి సంబంధం దొరకటానికి మీకు అదృష్టం ఉండాలి. నా కమీషన్ ఎదురు చూసి నేను ఈ మాట చెప్పటం లేదు. ఆ తరువాత మీ ఇష్టం. వాళ్ళకు ఏం సమాధానం చెప్పాలో చెప్పారంటే నేను బయలుదేరతాను" అన్నాడు పెళ్ళిళ్ళ బ్రొకర్.

"ఈ రోజే తాంబూళాలు పుచ్చుకుందామని చెప్పేయండి" అన్నది శకుంతలాదేవి.

"నిజంగానే చెబుతున్నారా?" అన్నాడు పెళ్ళి బ్రోకర్, నమ్మలేక.

"అవును...మీరు వెంటనే అబ్బాయి వాళ్ళింటికి వెళ్ళి విషయం చెప్పి వాళ్ళింట్లో ఏర్పాట్లు చేయమనండి. మేము వెనకాలే వస్తాం"

"మంచిదండి. అయితే బయలుదేరతాను" అని ఉత్సాహంగా బయలుదేరి వెళ్ళాడు పెళ్ళిళ్ళ బ్రోకర్.

బ్రోకర్ వెళ్ళిన తరువాత లోపలకు వెడుతున్న శకుంతలాదేవిని ఆగమని చెప్పి ఆపారు బాపిరాజు గారు.

"నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆ రోజు ఏదో కోపంలో చెప్పావనుకున్నాను. కానీ, ఇప్పుడు నిజంగానే...! వద్దు శకుంతలా, నేను చెప్పేది కొంచం విను"

"అక్కర్లేదు! టైమవుతోంది...బయలుదేరండి"

“నేను రాను”

"అయితే సరి, నేనే అన్నీ ఖాయం చేసుకుని వస్తాను"

"వాళ్ళెవరు....ఎలాంటి కుటుంబం. ఇవన్నీ కనుక్కోకుండనే..."

"నాకు నమ్మకం ఉంది. నా కూతురు ఆ ఇంట్లో సంతోషంగా జీవిస్తుంది"

"శకుంతలా...నేను..."

"నేను నిర్ణయం తీసుకున్నది తీసుకున్నదే. దాన్ని మార్చటం ఇక ఎవరి వల్లా కాదు"

నిక్కచ్చిగా చెప్పి, బయలుదేరింది శకుంతలాదేవి.

*********************

బస్సు దిగి మట్టి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తోంది గాయత్రి. 'నాన్నకు ఏమైంది? ఎందుకు ఈరోజు నన్ను ఇంటికి తీసుకు వెళ్ళటానికి రాలేదు?-- అన్న ఆలొచనతో వస్తుంటే...ఎవరో తనను పిలవటంతో, నిలబడి వెనక్కి తిరిగింది. ఆయసపడుతూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు మోహన్.

'అరె భగవంతుడా! వీడు ఎందుకు ఇక్కడకు వచ్చాడు?' -- ఆమె ఆలొచించిన క్షణంలో అతను ఆమె దగ్గరకు వచ్చాడు.

"ఒక్క నిమిషం ఆగు గాయత్రీ. నేను నీతో కొంచం మాట్లాడాలి"

"నువ్వు ఇక్కడ్నుంచి వెళ్ళిపో మోహన్. మా ఊరి వాళ్ళు ఎవరైనా చూస్తే గొడవ అవుతుంది"

"మాట్లాడి వెళ్ళిపోతాను. ప్లీజ్ గాయత్రీ"

“ఏది మాట్లాడాలనుకున్నా రేపు స్కూల్లో మాట్లాడుకుందాం. మొదట బయలుదేరు"

"కుదరదు గాయత్రీ. నిన్ను ఒంటరిగా కలుసుకోవటం నాకు ఈ రోజే కుదిరింది"

"దేవుడా!...సరే, ఏమిటో త్వరగా చెప్పు"

"మొదట నన్ను క్షమించు గాయత్రీ. బుద్ది లేకుండా నేను ఆ రోజు చేసిన తప్పుకు. పవిత్రమైన మన స్నేహాన్ని అపవిత్రం చేసినందుకు"

"వదిలేయిరా. అదంతా నేను ఆ రోజే మరిచిపోయాను. నువ్వు ఎప్పుడూ నా స్నేహితుడివే...చాలా?"

"నువ్వు అబద్దం చెబుతున్నావు. నేను నీ స్నేహితుడనేది నిజమైతే నాతో ఎందుకు మాట్లాడనంటున్నావు?"

"............................"

"నువ్వు మౌనంగా ఉంటేనే అర్ధమవుతోంది. నువ్వు ఇంకా నన్ను క్షమించలేదని"

"నువ్వు అనుకుంటున్నది నిజం కాదురా"

"అయితే నాకు ప్రామిస్ చెయ్యి. ఇక మీదట మాట్లాడతాను, అంతకు ముందులాగానే మన స్నేహం కొనసాగుతుంది అని చెప్పు. అప్పుడే నమ్ముతాను"

తన ముందు జాపిన అతని చేతినే చూస్తూ నిలబడ్డది గాయత్రి.

'శ్రద్దగా చదువుకోవటానికి వెళ్ళామా...వచ్చామా అని ఉండాలి. ఏ మగడితో పడితే ఆ మగాడితో నిలబడి మాట్లాడటమో, నవ్వనో చెయ్యకూడదు. జ్ఞాపకమున్నదా?'---తల్లి శకుంతలాదేవి , కళ్ళ ముందు కనబడి కళ్ళు పెద్దవి చేసుకుని హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తోంది గాయత్రికి.

అప్పుడు...తాంబూళాల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వస్తోంది శకుంతలాదేవి. దూరం నుండి వస్తున్నప్పుడే మోహన్ తో కూతురు మాట్లాడుతున్నది చూశేసింది. ఆవేశంతో వేగంగా నడిచి కూతుర్ని చేరుకుంది. పాపం...ఇద్దరూ ఇది గమనించలేదు.

"ఏం గాయత్రీ ఇంకా ఆలొచిస్తున్నావు? నా మీద నీకు నమ్మకం లేదు...అంతే కదా?"--అంటున్నప్పుడే అతని కళ్ళల్లో నీళ్ళు ఉబికి వస్తున్నాయి.

"హాయ్! మోహన్. ఏమిట్రా ఇది? సరే...ప్రామిస్" అంటూ అతని చేతిలో చేయివేసిన ఆ క్షణం, హఠాత్తుగా ఎవరో వాళ్ళ చేతులను తోశేసినట్లు అనిపించి ఇద్దరూ తిరిగారు.

ఆవేశం చివరి దసలో నిలబడుంది శకుంతలాదేవి. ఆ సమయంలో తల్లిని అక్కడ ఎదురుచూడని గాయత్రిలో వణుకు మొదలైయ్యింది.

"నేను వచ్చి..." అన్న మొహను కు ఎదురుగా నిలబడి……

"నీకు ఎంత ధైర్యం ఉంటే దీన్ని వెతుక్కుని ఉర్లోకే వచ్చుంటావు? నీ ప్రేమ నీ కళ్ళు కప్పి ఇక్కడి దాకా తీసుకువచ్చిందా...థూ… నువ్వొక…." అంటూ, ఇంకా ఏదేదే మాటలతో తన ఆవేశం తీరే వరకు తిట్టి ముగించింది శకుంతలాదేవి.

ఊరే గుమికూడింది. అవమానంతో కుంగి కృషించి నిలబడ్డాడు మోహన్. వాడ్ని చూడటానికే 'అయ్యో పాపం' అనిపించిది గాయత్రికి. వివరం తెలుసుకుని క్రిందా మీదా పడుతూ పరిగెత్తుకు వచ్చాడు వెంకన్న. శకుంతలాదేవి దగ్గర క్షమాపణ కోరి మేనల్లుడ్ని తీసుకుని వెళ్ళాడు. మరోపక్క గాయత్రిని చెతులు పుచ్చుకుని లాక్కుని వెడుతున్నట్టు నడిచింది శకుంతలాదేవి.

ఇంటి లోపలకు వెళ్ళటం ఆలశ్యం...తలుపులు మూసింది శకుంతలాదేవి. టేబుల్ మీదున్న పెద్ద స్కేల్ తీసుకుని కూతుర్ని పిచ్చి పిచ్చిగా కొట్టింది. నొప్పి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయింది గాయత్రి.

బయట తలుపును విరకొడుతున్నట్టు గట్టిగా తలుపు తడుతున్నారు బాపిరాజు గారు.

ఆవేశం తగ్గిన తరువాత తలుపు తెరుచుకుని బయటకు వచ్చింది శకుంతలాదేవి. ఆమెను కోపంగా చూసుకుంటూ లోపలకు వెళ్ళి భయంతో వణుకుతున్న కూతుర్ని చూసిన వెంటనే ఆయన కళ్ళల్లో నెత్తుటి కన్నీరు వచ్చింది.

మరో అరగంటలో ఆ వార్త ఊరు ఊరంతా పాకిపోయింది. 'వెంకన్న అక్క కొడుకు మోహన్, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు' అని!

ఇంకా ఉంది.....Continued in: PART-17

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

25, సెప్టెంబర్ 2019, బుధవారం

తొలివలపు (సీరియల్)...PART-15



                                              తొలివలపు….(సీరియల్)
                                                           (PART-15)

స్కూల్ హెడ్ మాస్టర్ ముందు నిలబడున్నారు బాపిరాజు, శకుంతలాదేవి. ఎదురుగా చేతులు కట్టుకుని తల వంచుకుని నిలబడున్నాడు మోహన్.

అప్పుడే హడావిడిగా లోపలకు వచ్చాడు వెంకన్న. అతనితో పాటు అతని అక్కయ్య. బాపిరాజు గారిని అక్కడ ఎదురు చూడని వెంకన్న, బాపిరాజు గారి దగ్గరకు వెళ్ళాడు.

"మామయ్యా...మీరెందుకు ఇక్కడ ఉన్నారు?" అని అతను అడిగి ముగించేలోపు,

"అదే నేనూ అడుగుతున్నాను. ఈ అబ్బయి మీకేమవుతాడు?" వెంకన్నను అడిగాడు హెడ్ మాస్టర్.

"వీడు నా అక్కయ్య కొడుకు. ఈమే మొహన్ తల్లి. నాకు అక్కయ్య"

"ఓహో, ఏమ్మా మీ అబ్బాయి ఏం చేశాడో మీకు తెలుసా? సార్ ఎవరో తెలుసా? వాళ్ళ అమ్మాయినే! ఊహూ...మీ దగ్గర మాట్లాడి లాభం లేదు. ఇప్పుడే టి.సి ఇచ్చేస్తాను. తీసుకుని వెళ్ళిపొండి"

"సార్...దయచేసి ఈ ఒక్కసారికి వాడ్ని క్షమించండి. ఇక మీదట ఇలా జరగ కుండా చూసుకుంటాను" అంటూ కాళ్ళ మీద పడినట్లే బ్రతిమిలాడింది మొహన్ తల్లి.

"అవును మామయ్యా...మీరు కొంచం చెప్పండి. ఇక మీదట ఇలా జరగదు. దానికి నేను బాధ్యుడ్ని" అంటూ బాపిరాజు గారి దగ్గర బ్రతిమిలాడాడు వెంకన్న.

"అదంతా కుదరదు. ఈ విషయం బయటకు తెలిస్తే మా స్కూలుకే చెడ్డపేరు వస్తుంది. ఏదో సారు ఈ విషయాన్ని వ్యక్తిగతంగా నా ముందుకు తీసుకు వచ్చారు కాబట్టి నేను తప్పించుకున్నాను. అది జరిగే పనికాదు. నేను ఒకసారి డిసైడ్ చేసింది చేసిందే"

పట్టుదలతో మాట్లాడుతునే ఉన్నారు హెడ్ మాస్టర్.

బాపిరాజు గారికి జాలి గుణం ఎక్కువ. అది ఆయన్ని మౌనంగా ఉంచలేకపోయింది.

"సరే...వదిలేయండి సార్. అబ్బాయి చదువు విషయం కూడా ఇందులో పొదిగి ఉంది. చిన్న పిల్లాడు. ఖండించి, వార్నింగ్ ఇచ్చి వదిలేద్దాం" అన్న భర్తను కోపంగా చూసింది శకుంతలాదేవి.

"సరే...సార్ చెప్పినందువలన విడిచిపెడుతున్నాను. అబ్బాయికి మంచి బుద్దులు నేర్పి పంపండి" అని చివరగా దిగివచ్చారు హెడ్ మాస్టర్.

"చాలా ధ్యాంక్స్ అండి. ధ్యాంక్స్ మామయ్యా" అని చెప్పిన వెంకన్నతో,

"ఈ విషయం మన ఊర్లో ఎవరికీ తెలియకూడదు వెంకన్నా...జాగ్రత్త" అని చెప్పిన బాపిరాజు గారితో 'సరే' అంటూ తల ఊపి మోహన్ని, తన సహోదరిని పిలుచుకుని బయటకు వెళ్ళాడు వెంకన్న.

"అయితే మేము కూడా బయలుదేరతాం సార్" అని హెడ్ మాస్టర్ కి చెప్పి బయలుదేరబోయిన బాపిరాజు గారితో,

"సార్, ఇది కారణంగా తీసుకుని మీ అమ్మాయిని స్కూలుకు పంపకుండా ఉండకండి. గాయత్రి బాగా చదువుకునే పిల్ల" అన్నాడు హెడ్ మాస్టర్.

"ఛ...ఛ! మా అమ్మాయి తప్పకుండా స్కూలుకు వస్తుంది" అని చెప్పి భార్యను తీసుకుని బాపిరాజు గారు కూడా బయలుదేరారు.

మరుసటి రోజు నుండి గాయత్రి స్కూలుకు వెళ్లటం మొదలుపెట్టింది. కానీ, శకుంతలాదేవికి అది కొంచం కూడా ఇష్టం లేదు. కూతుర్ని కారణంగా పెట్టుకుని దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. అది రోజు రోజుకూ పెరిగి పెద్దదవుతోంది. ప్రతి రోజూ గాయత్రి స్కూల్ నుండి వచ్చిన వెంటనే గాయత్రి పుస్తకాల సంచిని వెతికి చూడటం రోజువారి పనులలో ఒకటిగా పెట్టుకుంది శకుంతలాదేవి. దాని గురించి బాపిరాజు గారు ఏదైనా అడిగితే మళ్ళీ ఇద్దరి మధ్యా వాగ్వాదం మొదలవుతుంది. ఈ సమస్యకు మాత్రమే కాకుండా...తల్లి-తండ్రుల మధ్య గొడవలకు తానే కారణం అనే భావన గాయత్రిని పట్టి పీడించడం మొదలుపెట్టింది. తన కుటుంబం కొంచం కొంచంగా సంతోషానికి దూరమవుతుండటం గ్రహించి తట్టుకోలేక తల్లిని వెతుక్కుంటూ వెళ్ళింది.తనతో మాట్లాడమని బ్రతిమిలాడింది.

శకుంతలాదేవి ఏమో కూతుర్ను బద్రకాళి లాగా చూసింది. కావాలని కూతురుకు దూరంగా జరిగింది.

"నేను ఏం తప్పు చేశాను నాన్నా? అమ్మ నాతో మాట్లాడటమే లేదు? కొద్ది రోజుల క్రితం వరకు అమ్మ నామీద ఎంతో ప్రేమగా ఉండేది. నాకు కొంచంగా జలుబు చేసినా తట్టుకోలేదే? అలాంటి అమ్మ ఇలా మారిపోయిందే?"

తన ఒడిలో ముఖం చాటుగా పెట్టుకుని ఏడుస్తున్న కూతురి తల నిమురుతున్న బాపిరాజు మనసు లోలోపల ఏడ్చింది.

"ఏడవకురా తల్లీ. అమ్మకు నీమీద అనుమానం ఏమీ లేదమ్మా. నాకంటే మీ అమ్మకేరా నీమీద ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమను ఆవిడ నాజూకుగా చూపలేక పోతోంది...అంతే. అదికూడ ఒక విధంగా మూర్ఖంగా చూపించే తల్లి ప్రేమే. తన కూతురుకి ఏమీ తప్పుగా జరగకూడదనే భయం...అంతే తల్లీ. నిజానికి మీ అమ్మ తన ప్రాణం అంతా నీమీదే పెట్టుకుంది తెలుసా? నువ్వు కొంచం నిదానంగా ఉండు. అంతా తానుగా సర్దుకుంటుంది"- -అని కూతుర్ని సమాధాన పరిచే ప్రయత్నంలో మునిగిపోయారు బాపిరాజు.

తండ్రి యొక్క మాటలు గాయత్రికి కొంత ఊరట కలిగించటంతో కళ్ళు తుడుచుకుని ఉత్సాహంతో తండ్రి ముఖంలోకి చూసింది.

"అమ్మకు నా మీద నమ్మకం రావాలంటే నేనేం చేయాలి నాన్నా?"

"త్వరగా పెళ్ళి చేసుకోవాలి" వెనుక నుండి వినబడ్డ మాటలు విని ఆశ్చర్యంతో వెనక్కు తిరిగారు ఇద్దరూ.

శకుంతలాదేవి నిలబడుంది.

"ఏమిటే వాగుతున్నావు? చిన్న పిల్లనే అది" భార్యను చూసి అన్నాడు బాపిరాజు.

"నేను మాత్రం కాదనా చెప్పాను! అది వయసుకు వచ్చింది కదా...ఇంకేమిటి? నాకు నా పరువు-మర్యాద ముఖ్యం"

"శకుంతలా...నువ్వు చేసేది చాలా అన్యాయం"

"ఏది న్యాయం-ఏది అన్యాయం అనేది నాకు బాగా తెలుసు. అది మీరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు"

"ఏమిటే వాగుతున్నావు?" -- అని భార్యను కొట్టటానికి చెయ్యి ఎత్తిని తండ్రిని అడ్డుకుని ఆపింది గాయత్రి.

"ప్లీజ్...వద్దు నాన్నా. అమ్మను కొట్టద్దు"- బ్రతిమిలాడింది.

"చూడు ఎంత అహంకారంగా మాట్లాడుతోందో...నువ్వే చూశావుగా?"

తండ్రిని సమాధాన పరిచి, తల్లి వైపు తిరిగింది గాయత్రి.

"అమ్మా...నేను పెళ్ళిచేసుకుంటేనే మీకు సంతోషం, ప్రశాంతత దొరుకుతుందంటే మీ ఇష్టం వచ్చినట్లే చేయండి" అని తల్లితో చెప్పిన గాయత్రి, కళ్ళల్లో నీరుతో లోపలకు పరిగెత్తింది.

ఇంకా ఉంది.....Continued in: PART-16

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

23, సెప్టెంబర్ 2019, సోమవారం

తొలివలపు (సీరియల్)...PART-14



                                                తొలివలపు….(సీరియల్)
                                                             (PART-14)

చివరికి శకుంతలాదేవి పట్టుదలే గెలిచింది!

ఐదో రోజు సంబరం అత్యంత విషేషంగా జరిగి ముగిసింది. ఆ తరువాత ఇదిగో ఈ రోజు స్కూలుకు బయలుదేరింది గాయత్రి.

లంగా-వోణి, రెండు జడలతో తన ముందుకు వచ్చి నిలబడ్డ గాయత్రిని చూసి మైమరిచి కళ్ళార్పకుండా చూసింది శకుంతలాదేవి.

'నిజమే. లోకంలోని అందం మొత్తాన్నీ ఒకటిగా చేర్చి దేవుడు గాయత్రిని మాత్రమే పుట్టించాడు. ఏడో క్లాసు చదువుతున్న గాయత్రికి వయసుకు మీరిన ఎదుగుదల. పక్వం లేని పరువము. కానీ గాయత్రి పాపం! పసిపిల్ల మనసున్న గాయత్రిని తొందరపడి పదేళ్లకే పెద్ద మనిషిని చేయడం అవసరమేనా....ఏం చేయగలం? ప్రకృతి యొక్క చేష్ట ఇది!’

"ఏమిటే...నా కూతుర్ని కళ్ళార్పకుండా చూస్తూ నిలబడ్డావు?" తన గదిలో నుండి బయటకు వచ్చిన తండ్రి బాపిరాజు భార్యను అడిగాడు..

"ఏమండి...మన అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా? నా దిష్టే తగిలేటట్టుంది. మీరు కావాలంటే చూడండి...మన అమ్మాయి మహారాణిలాగా జీవిస్తుంది" అన్న తల్లి శకుంతలాదేవి, గాయత్రి నుదుటి మీద ముద్దు పెట్టుకుని కూతుర్ను తన చెంతకు లాక్కుని గుండెలకు హత్తుకుంది.

తల్లి శ్వాశగాలి తగిలి పులకరించిపోయింది గాయత్రి.

"మరి నీ కూతురు నీ లాగానే కదా ఉంటుంది" అంటూ ఓర చూపుతో భార్య అందాన్ని ఆరాధిస్తున్న భర్తను కోపంగా చూసింది శకుంతలాదేవి.

గబుక్కున తల తిప్పుకుని "వెళ్దామా గాయత్రి?" అంటూ బయటకు వచ్చి తన బండిని తీస్తున్నప్పుడు, వెనుక నుండి వినబడ్డ పిలుపు విని వెనక్కి తిరిగారు బాపిరాజు గారు.

"ఏమిటి మామయ్యా. బయలుదేరారా? ఎరువు కొనడానికి నేను కూడా టౌనుకే వెలుతున్నాను. కావాలంటే గాయత్రిని నేను స్కూల్లో దింపనా?" అడుగుతూ గాయత్రి వైపే చూశాడు వెంకన్న.

వెంకన్న గాయత్రిని చూసే చూపులో ఆకలి, కసి కనబడింది. ఆ చూపులోని భావన అర్ధంకాక స్నేహంగా నవ్వింది గాయత్రి. అదే సమయం మధ్యాహ్నం లంచ్ బాక్స్ ను తీసుకుని బయటకు వచ్చిన శకుంతలాదేవిని చూసి వెంకన్న జారుకున్నాడు. ఊరి ప్రజలకు బాపిరాజు గారి మీద ఎంత మర్యాద ఉన్నదో....శకుంతలాదేవి మీద అంతకన్న ఎక్కువ భయం ఉన్నది. కానీ అందరూ అహంకారం లేని ఆమె అధికారానికి కట్టుబడి ఉంటారు.

దూరంగా వెడుతున్న వెంకన్ననే కోపంగా చూస్తూ ఉండిపోయిన శకుంతలాదేవి గాయత్రి వైపు తిరిగింది.

"ఇలా చూడు గాయత్రీ. నేను చెప్పిందంతా జ్ఞాపకముంచుకో. ఏ మగాడితోనూ నిలబడి మాట్లాడటమో- నవ్వనో కూడదు. ఇళ్లు వదిలితే స్కూలు, స్కూలు వదిలితే ఇళ్లు అనే ఉండాలి...అర్ధమైందా?"

సరి అనేలాగా తల ఊపింది గాయత్రి.

"అబ్బా! మళ్ళీ మొదలు పెట్టిందా? నువ్వు రారా...మనం వెళ్దాం" అన్న బాపిరాజు, గాయత్రిని బండిలో ఎక్కించుకుని బయకుదేరారు.

వాళ్ళిద్దరూ కళ్ళకు కనబడేంత దూరం వరకు చూసి ఇంటిలోపలకు వెళ్ళింది శకుంతలాదేవి.

క్లాస్ రూముకు గాయత్రి కొత్తగా వచ్చిందా...గాయత్రి వచ్చినందువలన క్లాస్ రూము కొత్తగా ఉన్నదా? అనే కన్ ఫ్యూజన్ లోనే ఆ రోజు గడిచిపోయింది. సహ విధ్యార్దుల ఎగతాలి, నవ్వులాటలు గాయత్రిని మరింత సిగ్గులోకి తీసుకు వెళ్ళింది. స్కూలు టైము ముగిసిందో లేదో...సీతాకోక చిలుకులాగా ఎగురుకుంటూ వచ్చి నిలబడున్న తండ్రి బండిపై ఎక్కి కూర్చుంది. బండి ఇంటివైపుకు వెళ్ళింది.

సాయంత్రం టిఫిన్ తో కూతురుకి స్వాగతం పలికి, ఆశతో ప్రేమను కురిపించి తన పనికొసం లోపలకు వెళ్ళింది శకుంతలాదేవి. తల్లి ప్రేమలో తనని తానే మరిచిపోయింది గాయత్రి. కానీ ఆ తల్లి స్పర్ష, ప్రేమ ఇక తనకు దొరకదని అప్పుడు ఆమె తెలుసుకోలేకపోయింది.

హోమ్ వర్క చేయటానికని పుస్తకం తీసినప్పుడు అందులో నుండి ఒక కాగితం బయట పడటంతో...తీసి కాగితాన్ని మడత విప్పింది గాయత్రి. చదివింది. నవ్వు కుంటూ మళ్ళీ మళ్ళీ చదివింది....చివరగా ముఖమంతా చెమట పట్టగా చదివిన కాగితాన్ని మడతపెట్టి, ముఖం తుడుచుకుని తలెత్తింది. ఎదురుగా తల్లి శకుంతలాదేవి. కూతురు ముఖం చూసిన వెంటనే ఏదో తప్పు జరిగిందని అమెకు అర్ధమయ్యింది. గాయత్రి చేతిలో ఉన్న కాగితాన్ని లాక్కుని చదవటం మొదలుపెట్టింది.

‘ప్రియమైన గాయత్రికి,

రెండు వారాలు చనిపోయిన తరువాత ఈ రోజే నిన్ను కలుసుకుంటున్నా. చూసిన క్షణం నుంచి నీతో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించాను. కుదరలేదు. అందుకే ఈ లేఖను రాస్తున్నాను. నీతో ఒక విషయం చెప్పాలి. మన స్నేహ వలయం దాటి నేను నిన్ను ఇష్టపడి చాలా రోజులు అయ్యింది. ఇక నాకు ఓర్పు లేదు. ప్రేమ నిండిన హృదయాన్ని మోస్తూ నీకొసం వైట్ చేసింది చాలు. 'ఐ లవ్ యూ గాయత్రీ. నా స్నేహాన్ని ఆమొదించినట్లే నా ప్రేమనూ అమొదిస్తావనే నమ్మకంతో కాచుకోనుంటాను. రేపు కలుద్దాం'

ఇట్లు
నీ మోహన్.

వెలుతురు లేక చీకటిగా ఉన్నది ఇల్లు.

'తల్లీ-కూతుర్లు ఇద్దరూ ఎక్కడికి వెళ్ళారు?' అన్న ఆలొచనతో లోపలకు వచ్చారు బాపిరాజు. 'స్విచ్' వేసి ఇంట్లో వెలుతురును తీసుకువచ్చారు. ఇంట్లోని పరిస్థితి వెలుతురులో తెలిసిపోయింది. రూమంతా విరిగి పడిన వస్తువులు. మధ్యలో ఒక మూల పిచ్చిదానిలాగా కూర్చున్న శకుంతలాదేవి. ఆమె కాళ్ళ దగ్గర చుట్ట చుట్టుకుని పడున్న గాయత్రి.

పరిగెత్తుకెళ్ళి కూతుర్ని ఎత్తి తన ఒడిలో వేసుకున్నారు. ఆమె పరిస్థితి చూసి ఆందోళన చెందారు. వాతల లాంటి ఎర్రటి నెత్తుటి గీతల శరీరంతో, నొప్పులు భరించలేక గొణుగుతూ పడున్న గాయత్రి తండ్రిని చూసిన వెంటనే మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది.

"నాన్నా...ప్లీజ్ నాన్నా. మీరైనా అమ్మ దగ్గర చెప్పండి. మోహన్ నా స్నేహితుడు మాత్రమే. సైన్స్ పాఠాలలో ఏదైనా సందేహాలోస్తే అతనే నాన్నా నాకు చెప్పిస్తాడు. ఈ లెటర్ నా పుస్తకంలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. అంతకంటే ఈ 'లెటర్’ కు నాకూ ఎటువంటి సంబంధమూ లేదు నాన్నా. మీరైనా నన్ను నమ్మండి"

ఏడుస్తూ బ్రతిమిలాడుతున్న కూతుర్ను లేపి తన భుజాలపై అనించుకుని నిదానంగా నడిపించుకుంటూ తీసుకు వెళ్ళి గదిలో పడుకోబెట్టిన తరువాత భార్య శకుంతలాదేవి దగ్గరకు వచ్చారు.

"ఏమే...మనిషేనా నువ్వు? గాయత్రి పాపమే. పసిపిల్ల వొళ్ళు, పసిపిల్ల మెదడు. గొడ్దును బాదినట్లు బాది దాన్ని నెత్తుటి గుల్ల చేశావు కదే! మనస్సాక్షి అనేది ఉందా...లేదా నీకు?"

ఆయన అడిగిన వెంటనే పొంగుకు వస్తున్న ఏడుపును ఆపుకోలేక గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది శకుంతలాదేవి.

"ఏమండీ... గాయత్రి మనల్ని వదిలేసి ఎక్కడికీ వెళ్ళదు కదా! ఊరులో, బయట జరుగుతున్నట్లు మనింట్లో ఏ తప్పూ జరగదు కదా? నాకు నా కూతురు కావాలి. గాయత్రి మనకు మాత్రమే సొంతం? నేను చూసే అబ్బాయినే అది పెళ్ళి చేసుకోవాలి. కాదూ కూడదు అంటూ ఇంకేదైనా చేస్తే...దాని తరువాత నేను ప్రాణాలతో ఉండను"

"ఏమిటే ఆలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? గాయత్రి మన కూతురే. అది ఏ తప్పూ చేయదు. నీ అనుమానాన్ని తీసుకెళ్లి చెత్త కుండీలో పడేయ్"

సమాధాన పరచిన భర్త గుండెల మీద ఆనుకుని తన ఆవేశాన్ని తగ్గించు కుంటున్న శకుంతలాదేవి హడావిడిగా లేచింది.

"భగవంతుడా... నా కూతుర్ని గొడ్డును బాదినట్లు బాదేనే! అది నొప్పి తట్టుకోలేదే. అమ్మా తల్లీ" అంటూ గాయత్రి గదివైపు పరిగెత్తింది శకుంతలాదేవి.

ఏడ్చి ఏడ్చి అలసిపోయి పడుకున్న గాయత్రిని చూసిన వెంటనే తల్లికి గుండె తరుక్కు పోయింది. గబ గబా వంట గదిలోకి వెళ్ళి పసుపు తీసుకుని, అందులో వేడి వేడి నెయ్యిని కలిపి ఉడకబెట్టి పేస్టులాగా చేసుకుని తీసుకు వచ్చింది. గాయత్రిని తన ఒడిలే పడుకోబెట్టుకుని దెబ్బల గాయాలకు రాసింది. తల్లి కళ్ల నుండి వెలువడిన కన్నీరు బొట్లు బొట్లుగా తన మీద పడ్డా తెలియకుండా పడుకుంది గాయత్రి.

ఇంకా ఉంది.....Continued in: PART-15

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

21, సెప్టెంబర్ 2019, శనివారం

తొలివలపు (సీరియల్)...PART-13



                                           తొలివలపు….(సీరియల్)
                                                        (PART-13)

లక్ష్మీపురం గ్రామమంతా ఆ రోజు పండుగ వాతావరణం నెలకొన్నది. పంచాయితీ ప్రెశిడెంట్ బాపిరాజు గారి ఇళ్లు జన సందడితో కోలాహలంగా ఉన్నది. అందరి మొహాలలోనూ సంతోషం వెల్లివిరిసి ఆడుతూంటే, ఆ ఆనందానికి కారణమైన గాయత్రి మొహంలో మాత్రం శొక రేఖలు కనబడ్డాయి.

ఎందుకు కనబడవు.... నిన్నటి దాకా సీతాకోక చిలుక లాగా ఎగురుతున్న ఆమెను పట్టుకొచ్చి బోనులో అనగదొక్కితే ఆమెకు సంతోషం ఎలా వస్తుంది? 'అక్కడికి వెళ్ళద్దు, ఇక్కడికి వెళ్ళద్దు, అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దు!' అని అమ్మ శకుంతలాదేవి ఆజ్ఞలు ఒకపక్క, ఏదో మరోలోకం నుండి వచ్చిన జీవరాసిని వినోదంకోసం చూడటానికి వచ్చే లాగా ఊరి ప్రజలందరూ ఒక్కొక్కరూ ఆమెను చూసి వెడుతుంటే అది ఆమెలో కోపాన్ని, విసుగుని, శోకాన్నీ ఎక్కువ చేసింది.

ప్రొద్దున ఇచ్చిన భోజనం, ఆమె వేళ్ళు ఇక తాకవని తెలిసి మూలగా ఉండిపోయింది. ఒంటరిగా కూర్చుని ఏవేవో ఆలొచించి చివరికి నీరసంతో సొమ్మసిల్లి నిద్రలోకి వెళ్ళిపోయింది గాయత్రి.

సాయంత్రం. ఎవరేవరో వచ్చి లేపారు. నీళ్ళు నిండిని బిందెల మధ్య నిలబెట్టి స్నానం చేయించారు. కొత్త బట్టలు వేయించారు. పూల జడ వేసి సంతోషించారు. ఆనంద పాటలు పాడారు. తాంబూళం తీసుకుని వెళ్ళిపోయారు.

'ఏం జరుగుతోంది ఇక్కడ?' అని ఆలొచించేలోపు తిరిగి బోనులో బంధీని చేశారు గాయత్రిని. పొడవైన అరుగుకు చివరగా కొబ్బరి ఆకుల గుడార పందిరిలో కూర్చుని మళ్ళీ ఆలొచనలలో మునిగింది గాయత్రి.

అన్ని పనులూ ముగించుకుని అలసిపోయి వచ్చిన బాపిరాజు-శకుంతలాదేవి దంపతులు అరుగుకు మరో చివర కూర్చున్నారు.

"అమ్మాయ్ భొజనం చేసిందా శకుంతలా?" భార్యను అడిగాడు బాపిరాజు.

"భోజనం ఎప్పుడో ఇచ్చేము. భోజనం చేసిందా అనేది తెలియదు"

అరుగుకు చివరగా జరిగి కొబ్బరి ఆకుల గుడారం వైపు చూస్తూ "అమ్మా గాయత్రీ " అన్నాడు బాపిరాజు.

తండ్రి అలా పిలవంగానే 'ఓ' అని ఏడవటం మొదలుపెట్టింది గాయత్రి. ఏమైందో, ఏమిటో అనుకుని గుడారం తడిక తలుపు తెరుచుకుని తొంగి చూశాడు తండ్రి బాపిరాజు.

"ఏమిట్రా...ఏమైందిరా?"

"నన్ను ఎందుకు నాన్నా ఇక్కడ కూర్చోబెట్టారు? నాకు ఇక్కడ భయంగా ఉన్నది"

"అదా విషయం" అని గట్టిగా నవ్వి, "నేనుండుంగా ఎందుకురా భయపడతావు? ఇదంతా ఒక రెండు రోజులే. ఆ తరువాత...."

"ఏం చెప్పారు?" భర్త మాటలకు అడ్డుపడింది భార్య శకుంతలాదేవి.

"ఐదో రోజు సంబరం ముగిసేంతవరకు అది ఇక్కడే ఉండాలి"

"ఏమిటి శకుంతలా...నువ్వు ఇంకా పాత కాలంలోనే ఉన్నావు! ఈ రోజుల్లో ఎవరు ఇలా చేస్తున్నారు?"

"మిగిలిన వాళ్ళ సంగతి గురించి నాకు అనవసరం. నేను మన సంప్రదాయాలను గౌరవించి నడుచుకునే దానిని. మీ చూపులకు నేను పాత పంచాంగంలాగే ఉండిపోతాను. కానీ, ఈ ఇంటి వరకు నేను చెప్పేదే వేదవాక్కు. నేను చెప్పింది వినితీరాల్సిందే. చెప్పేశాను"

"ప్లీజ్ అమ్మా. ఈ రోజు స్కూలుకు లీవు పెట్టాను. ఇంకా అన్ని రోజులు సెలవు పెడితే నా చదువు పాడైపోతుంది"

"అవును. నీది పెద్ద ఐ.ఏ ఎస్ చదువు చూడు. ఆ కాలంలో నేను వయసుకు వచ్చిన తరువాత స్కూలు పక్కకే వెళ్లలేదు తెలుసా? ఏడో క్లాసు వరకు నువ్వు చదువుకున్నది చాలు. త్వరగా నీకు పెళ్ళి చేసి పంపిస్తే మా బాధ్యత తీరిపోతుంది"

"ఏయ్! శకుంతలా, కూతురు దగ్గర ఎప్పుడు, ఏం మాట్లాడాలో నీకు జ్ఞానం లేదా? పాపం...చిన్న పిల్లనే అది. ఈ వయసులోనే అది పెద్ద మనిషి అయ్యిందే నని నేను భాదపడుతూ కూర్చున్నాను. దాని దగ్గర పోయి పెళ్ళి అది,ఇదీ అని మాట్లాడుతున్నావు? నా కూతుర్ను నేను డాక్టర్ కి చదివించబోతాను. దాని తరువాతే పెళ్ళి. ఏమ్మా తల్లీ...నాన్న చెప్పేది కరెక్టే కదా?" అన్నాడు కూతురు వైపు తిరిగి.

"అవును నాన్నా. నేను డాక్టర్కు చదివి మన పేరయ్య తాతకు డబ్బులు తీసుకోకుండా సూది మందు వేయాలి"

ఆమె చెప్పింది విని తల్లితండ్రులిద్దరూ నవ్వారు. వాళ్ళ నవ్వులతో గాయత్రి నవ్వు కూడా కలిసిన సమయం, వాకిట్లో ఎవరో పిలుస్తున్న పిలుపు విని ముగ్గురూ తిరిగి చూశారు.వీళ్ళ గుమాస్తా ఈషారాం నిలబడున్నాడు. అతనితో పాటు ఒక అమ్మాయి తడబడుతూ వచ్చి నిలబడటం చూసి బాపిరాజు-శకుంతలాదేవి అరుగు మీద నుండి లేచి వాళ్ళ దగ్గరకు వెళ్ళారు.

"ఎవరు ఈషారాం...ఈ అమ్మాయి ఎవరు?"

"తెలియదయ్య గారూ. మన మామిడి తోటలో ఒక చివర ఏడుస్తూ ఒంటరిగా నిలబడుంది. 'ఎవరమ్మా?' అని అడిగితే నోరు తెరవటంలేదు. రాత్రి సమయం అవుతోంది...అందుకని ఇక్కడికి తీసుకు వచ్చాను"

"ఏమిటి, ఎందుకు అని విచారించి అలాగే పంపించకుండా ఎందుకురా ఇక్కడికి తీసుకు వచ్చావు?" అన్నది శకుంతలాదేవి. చూసిన వెంటనే ఆ అమ్మాయి నచ్చకపోవటంతో ఆమె మాటలలో కఠినత్వం కనబడింది.

"కాసేపు మాట్లాడకుండా ఉంటావా శకుంతలా. పాపం ఆ అమ్మాయి. రాత్రి సమయం, దారి తెలియక దారి తప్పి వచ్చుంటుంది...మనం విచారించి చూద్దాం" అంటూ ఆ అమ్మాయి వైపు తిరిగారు బాపిరాజు.

"ఏమ్మా...నీ పేరేమిటి?"

"ప్రమీల"

"ఇక్కడికి ఎలా వచ్చావు? నీ సొంత ఊరు ఏది?"

ఆయన అడిగిన వెంటనే ఆలశ్యం చేయకుండా...గబుక్కున కాళ్ల మీద పడి ఏడవటం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి చేసిన హడావిడికి బాపిరాజు గారు వెనక్కు వెళ్ళారు. "మొదట లేవమ్మా...ఏమైందో చెప్పు"

"అయ్యగారూ! మా నాన్న ఒక తాగుబోతు. మా అమ్మను వదిలేసి ఇంకో పెళ్ళి చేసుకోని వెళ్ళిపోయారు. పొట్టకూటి కోసం నేనూ, మా అమ్మా దొరికిన పనిని చేస్తూ కాలం గడుపుతున్నాము. పోయిన నెల ఆరోగ్యం బాగుండక అమ్మ చనిపోయంది. పక్క ఉరిలో కట్టడాల కూలి పని చేసుకుంటున్న నాతో కొంతమంది తప్పుగా ప్రవర్తించారు. వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుని పారిపోతూ దారి తెలియక ఈ ఊరికి వచ్చి జేరాను. అయ్యాగారూ, మిమ్మల్ని చూస్తే మంచివారిలాగా కనబడుతున్నారు. నన్ను ఇక్కడ్నుంచి పంపించకుండా ఏదైనా పని ఇచ్చి కాపాడండయ్యా. మీకు పుణ్యం వస్తుంది" అని బ్రతిమిలాడింది.

"ఇలా చూడు. ఇక్కడ పనిచేయటానికి చాలా మంది ఉన్నారు. నువ్వు మొదట ఇక్కడ్నుంచి బయలుదేరు" అన్నది శకుంతలాదేవి.

"అది కాదు...నేను" అంటూ ఏదో చెప్పబోయిన భర్తను అడ్డుకుంది శకుంతలాదేవి.

"మీరు ఏమీ చెప్పొద్దు. ఆకతాయి పిల్లలు ఏ ఊర్లో లేరు? ఈమెకు ఈ ఊర్లో ఆశ్రయం కలిపించి, ఈమెకు ఏదైనా జరిగితే మనమే ఊర్లో అందరికీ జవాబు చెప్పాలి. అదే ఈమె పెళ్ళి చేసుకుని భార్య-భర్తలుగా వచ్చి సహాయం అడిగుంటే దారాలంగా చేయచ్చు. మాట్లాడకుండా నేను చెప్పేది చెయ్యండి. ఖర్చులకు కొంచం డబ్బులిచ్చి ఈమెను పంపించి మీ పని చూసుకోండి" చెప్పింది శకుంతలాదేవి.

భార్య చెప్పేది సబబే నని అనిపించినా బాపిరాజు గారికి మనసు అంగీకరించలేదు. ఆయన ఆలొచిస్తూ నిలబడటం చూసిన ప్రమీల ఆయన డబుల్ మైండులో ఉన్నాడని అర్ధం చేసుకుంది.

"నాకు డబ్బులంతా వద్దయ్యగారు. నేను వెళ్తాను”--కళ్ళల్లో వస్తున్న నీటిని తుడుచుకుంటూ వెనక్కు తిరిగింది ప్రమీల.

"ఈషారాం, ఈమెను తీసుకు వెళ్ళి బస్సు ఎక్కించి రారా" అన్నది శకుంతలాదేవి.

"సరేనమ్మగారు" అని చెప్పి ప్రమీలతో పాటూ బయలుదేరాడు ఈషారాం.

ఇద్దరూ ఇంటి గేటు ముట్టుకున్నప్పుడు గట్టిగా అరిచాడు బాపిరాజు.

"ఒక్క నిమిషం ఆగు ఈషారాం. ఇద్దరూ ఇక్కడికి రండి"

ఇద్దరూ వచ్చారు...అర్ధంకాక చూశారు.

"నేనొకటి చెబితే చేస్తావారా ఈషా?"

"ఏమిటయ్యగారు ఈ ప్రశ్న? మీ ఉప్పు తిని బ్రతుకుతున్నాను. ఏం చేయాలో ఆజ్ఞ వేయండి"

"అయితే సరే. ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకో"

"అయ్యగారూ...నేను"

"ఆలొచించకురా. నా మాట మీద నీకు నమ్మకం లేదా?"

"సరే అయ్యగారూ. మీ ఇష్టం"

"నువేమ్మా చెబుతావు?"

ఆమె సమాధానం ఏమీ చెప్పకుండా ఈషారాం దగ్గరగా వెళ్ళి నిలబడింది.

బాపిరాజు గారి మనసులో ప్రశాంతత ఏర్పడింది. ఎందుకు ఏర్పడదు...సహాయం అని ఎవరైనా అడిగి వస్తే ఉత్త చేతులతో పంపే అలవాటులేని మనిషాయే!.

మరుసటి రోజు ఊరి జనం ముందు ఈషారం భార్య అయ్యింది ప్రమీల. బాపిరాజు గారు తన మామిడి తోటలో ఈషారం కోసం ఏర్పాటు చేసి ఇచ్చిన ఆ చిన్న గుడిసె ఇప్పుడు ఇంకొక జీవిని స్వాగతించేందుకు కాచుకోనుంది.

ఇంకా ఉంది.....Continued in: PART-14

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

19, సెప్టెంబర్ 2019, గురువారం

తొలివలపు (సీరియల్)...PART-12



                                               తొలివలపు….(సీరియల్)
                                                           (PART-12)


ప్రొద్దున్నే సెల్ ఫోన్ మోగటంతో నిద్ర మత్తులో నుండి బయటపడి, సెల్ ఫోన్ ఆన్ చేసి "హలో!" అన్నాడు రమేష్. అవతల ఎవరిదో తడబడుతున్న గొంతు.

"అదొచ్చి...గాయత్రికి సడన్ గా"

"గాయత్రికి ఏమైయ్యింది?...హలో!" గాబరాగా అడిగాడు రమేష్.

అంతే. అవతల వైపు మౌనం.

"హలో...హలో" అరిచాడు రమేష్.

ఫోన్ కట్ అయ్యింది.

వెంటనే బయటకు వచ్చి మెట్ల క్రింద ఉన్న బైకు తీశాడు రమేష్.

గాయత్రి ఇంటికి చేరుకోవటమే ఆలశ్యం, బైకు స్టాండు కూడా సరిగ్గా వేయకుండా బైకును క్రిందపడేసి లోపలకు పరిగెత్తాడు రమేష్.

అదే సమయం రోడ్డుకు అవతలివైపు ఉన్న చెట్టు వెనుక నుండి జానకీనూ, పద్మానూ బయటకు వచ్చారు.

"నేను చెప్పినట్లే జరిగింది చూశావా? ఇప్పుడేమంటావ్ జానకీ?" - అంటూ మాటలు కొనసాగించింది పద్మ. పద్మ మాట్లాడేదేదీ జానకికి వినబడలేదు. కారణం జానకి గాయత్రి ఇంటివైపే కళ్ళార్పకుండా, కన్నీటితో చూస్తూ నిలబడింది.

'ఇలా కూడానా నమ్మించి మోసం చేస్తారు? వీళ్ళ ప్రేమ కోసం నన్ను ఒక కవచంలాగా ఉపయోగించుకున్నారా? నాది చెప్పనటువంటి ప్రేమే! చెప్పకుండానే ఉంటాను. పరవాలేదు. కానీ, గాయత్రి... నువ్వు నా నుదుటి మీద ముద్దు పెట్టుకుని నా హృదయాన్ని కదిలించావే! నాకూ- రమేష్ కు పెళ్ళి చేయాల్సిన పూర్తి బాధ్యత నాది అని మా అమ్మతో చెప్పావే? నేను నీకు ఏం పాపం చేశాను? నా ఇళ్లు వెతుక్కుంటూ వచ్చావు కదా అని నిన్ను నేను ఏంతో నమ్మాను. ప్రేమ మాత్రమే గుడ్డిదా? కాదు...అభిమానమూ, వాత్సల్యము కూడా గుడ్దివే! అది నీవలనే నాకు అర్ధమయ్యింది. సరే...పోనీ. నమ్మించి మోసం చేసినందుకు ధ్యాంక్స్. కపటం కలిసిన నీ కళ్ళను చూడటానికి నాకు ఇష్టం లేదు. నేను వెళుతున్నాను’

ధారగా కారుతున్న కన్నీటిని తుడుచుకుని బయలుదేరబోయిన జానకి చేతులు పుచ్చుకుని ఆపింది పద్మ.

"ఎక్కడికే వెడుతున్నావు?"

"ఇంటికి?"

"నీకేమన్నా పిచ్చా? ఇంతసేపు నేను చెబుతున్నదేమిటి? నువ్వు చేస్తున్నదేమిటి? నీకు ద్రోహం చేశేసి ఇద్దరూ సంతోషంగా ఉండాలని చూస్తున్నారు. నువ్వు...నాకేమిటని? వెడుతున్నావు! వదలకూడదు జానకీ. రెడ్ హ్యాండడ్ గా దొరికిపోయారు. ఈ చాన్స్ ను నువ్వు వదిలి పెడతావేమోగానీ నేను వదిలిపెట్ట దలుచుకోలేదు. నీకు నమ్మక ద్రోహం చేసిన ఆ గాయత్రిని బాగా కడిగేసి వస్తాను. నాతో రా చెబుతాను" అన్న పద్మ జానకి వద్దంటున్నా అమె చేతులు పుచ్చుకుని గాయత్రి ఇంటివైపుకు నడిచింది.

అదే సమయం...ఇంట్లో గాయత్రి, రమేష్ మీద అరుస్తోంది.

"నేను చచ్చేపోయినా దాని గురించి బాధ పడటానికి నువ్వెవరు? ఎవరో ఏదో చెప్పారనే కారణం చెబుతూ ఇలా ప్రొద్దున్నే వచ్చి నా ప్రాణం ఎందుకు తీస్తున్నావు"

"అదొచ్చి...గాయత్రి. మీకేమైందో నన్న భయంతోనే"

"చాలు...నీ పిచ్చి డైలాగులు! నీకొసం ఒకత్తి కాచుకోనుందే...ఆమె దగ్గరకు వెళ్ళి చెప్పు. మొదట ఇక్కడ్నుంచి బయలుదేరు"

కోపంగా చెప్పిన గాయత్రిని సూటిగా చూశాడు.

'నన్ను అర్ధం చేసుకోవటానికి ఎందుకు ప్రయత్నించవు గాయత్రీ? ఇంకా ఎన్ని రోజులు మన పోరాటం కొనసాగుతుంది? నీ వలన నా హృదయం మాత్రమే బలహీనం అయ్యింది. నా నమ్మకం ఇంకా చచ్చిపోలేదు. ఇప్పుడు కూడా తిరిగి వెళ్ళిపోతున్నాను. ఓటమిలు నిరంతరం కావు’ మనసులో అనుకుంటూ, చిన్నగా నవ్వుతూ వేనక్కి తిరిగి నడిచాడు రమేష్.

"ఒక్క నిమిషం. జానకి విషయం ఏమైంది?"

"మైగాడ్...ప్లీజ్ గాయత్రీ. నా మనసంతా మీరు నిండిపోయి ఉన్నప్పుడు నేనెలా?"

"ఆపు. జానకిని ఎప్పుడు పెళ్ళిచేసుకోబోతావు? దానికి మాత్రం జవాబు చెప్పు"

"జానకీ...జానకీ...జానకీ...ఎవరండీ ఈ జానకీ? నిన్నటి వరకు ఆ అమ్మాయి మీద మీకు రాని ఇంటరెస్టు ఈ రోజు ఎందుకు హఠాత్తుగా వచ్చింది? నేను మిమ్మల్ని 'లవ్' చేస్తున్నాను. మిమ్మల్నే చుటి చుట్టి వస్తున్నాను. అలా ఉన్నా నా మనోభావాలను కొంచం కూడా అర్ధం చేసుకోకుండా మీరు ఎవత్తో ఒకత్తి కోసం"

"ఆపు" అని గట్టిగా అరిచిన గాయత్రి కొద్దిసేపు తరువాత…........

"జానకి ఎవత్తో ఒకత్తి కాదు"----కొంచంసేపు మౌనంగా ఉండి, ఆ తరువాత మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది."అమె...ఆమె నా చెల్లెలు"

అది విన్న రమేష్, బాలాజీ మాత్రమే కాదు...బయట నిలబడి రమేష్-గాయత్రీ మాటలను వింటున్న జానకీ, పద్మ కూడా ఆశ్చర్యపోయారు.

"అవును..నేను చెప్పేది నిజం. జానకీ నా చెల్లెలు. అది నేను రుజువు చేయాలంటే నా చిన్న నాటి జీవితం గురించి మీరు తెలుసుకోవాలి" అని చెబుతూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని తన చిన్ననాటి జీవితం గురించి వాళ్ళకు చెప్పటం మొదలుపెట్టింది.

ఇంకా ఉంది.....Continued in: PART-13

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

17, సెప్టెంబర్ 2019, మంగళవారం

తొలివలపు (సీరియల్)....PART-11

                                      


                                            తొలివలపు….(సీరియల్)
                                                         (PART-11)


ఆ ఎర్ర రంగు కారు వీధి పక్కగా తన శ్వాసను ఆపుకుంది. బాలాజీ, గాయత్రి అందులోంచి దిగి నడిచి-రోడ్డు దాటి ఎదురుగా ఉన్న కాంపౌండ్ గేటును తెరుచుకుని లోపలకు దూరి, కాలింగ్ బెల్ కొట్టి వైట్ చేశారు.

ఒక తలుపు మాత్రం తెరిచిన ఒక ఆవిడ తొంగి చూసి గాయత్రిని చూడటంతో గబుక్కున నవ్వుతూ హడావిడిగా ఆమె దగ్గరకు వెళ్ళింది.

"రామ్మా గాయత్రీ. ఏదో ఒక రోజు నువ్వు ఇలా వచ్చి నిలబడతావని తెలుసు. భార్యా-భర్తల మధ్య వెయ్యి గొడవలు ఉండొచ్చు. అందుకోసం కోపం తెచ్చుకుని పెట్టె పుచ్చుకుని పుట్టింటికి వెళిపోతే అన్నీ సర్దుకుంటాయా? ఈ నాటి ఆడ పిల్లలకు ఓర్పు అనేది లేనే లేదు. పాపం రమేష్ తమ్ముడు, నువ్వు లేకుండా ఎంత కష్ట పడ్డాడో తెలుసా నీకు?"

"ఈమె ఏం మాట్లాడుతోంది?"--అన్న కన్ ఫ్యూజన్ లో ఇద్దరూ నిలబడిపోయారు. ఆమె మాట్లాడుతూ పోతూంటే....గాయత్రికి వొళ్ళు మండుతోంది.

"నిన్ను నా కూతురు అనుకునే చెబుతున్నా గాయత్రీ. అడ్జెస్టు చేసుకోమ్మా...నీ జీవితం బాగుంటుందమ్మా. రమేష్ తమ్ముడికి మంచి మనసమ్మా. అర్ధం చేసుకుంటావనుకుంటా. ఇక నీ ఇష్టం. మేడమెట్లు ఎక్కి వెళ్ళండి" అని చెప్పి తన పని ముగిసినట్లు చటుక్కున వెనక్కు తిరిగి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంది.

గాయత్రి ఎక్కడ చూస్తుందోనని వస్తున్న నవ్వును ఆపుకుంటూ మెట్లు ఎక్కటం మొదలుపెట్టాడు బాలాజీ. వస్తున్న కోపాన్ని దిగమింగుకుంటూ బాలాజీ వెనుకే గాయత్రి కూడా మెట్లు ఎక్కటం మొదలు పెట్టింది.

రమేష్ నివసిస్తున్న ఆ చోటును ఇళ్లు అనడం కంటే కొంచం పెద్ద గది అని చెప్పొచ్చు. ఒక అలమరా తప్పా ఇంకేమీలేదు. ఒక మధ్య గోడ కూడా లేదు. రూములోని ఒక చివర్లో ఒక చెక్క బల్ల, బల్ల మీద ఒక స్యూట్ కేసు, స్యూట్ కేసు పక్కన కొన్ని కెమేరాలు, ఫోటోగ్రాఫీకి సంబంధించిన పుస్తకాలు, కొన్ని ఫోటోలు కలిసి పడున్నాయి...వీటన్నిటికంటే గాయత్రి ఫోటోలు చిన్నవి కొన్ని, పెద్దవి కొన్ని అక్కడి గోడలకు అతికించబడి ఉన్నాయి.

వాటిని చూసి ఒక్క నిమిషం స్థభించి తేరుకుంది గాయత్రి.

ఇంటి యజమానురాలు మాటలకు అర్ధమేమిటో అప్పుడు అర్ధమైయ్యింది ఇద్దరికీ. అదే సమయం.

"వెల్ కమ్ గాయత్రీ" అని వెనుక నుండి గొంతు వినబడింది. గడ్డాలు, మీసాలు మధ్య కనబడకుండా పోయిన పెదవులను ఒకసారి చూపిస్తూ నవ్వుతూ కనబడ్డాడు రమేష్

"ఏమిటిదంతా?" అంటూ గోడలకు అతికించిన తన ఫోటోలను చూపిస్తూ అడిగింది.

"నా యొక్క సంతోషం"

"పిచ్చి పట్టిందా నీకు? నా అభిప్రాయాన్ని ఆ రోజే చెప్పేశాను. ఆ తరువాత కూడా...మర్యాదగా ఇవన్నీ తీసి చెత్తలో పడేయ్. అనవసరంగా ప్రాబ్లం చేస్తూ ఉండకు"

"ముగించారా? ఇక్కడకు మీరు ఎందుకు వచ్చారో దానికి కారణం నేను తెలుసుకోవచ్చా?"

"జీవితంలో మళ్ళీ నీ మొహాన్నే చూడకూడదని అనుకున్నాను. కానీ ఏం చేయను? నిన్ను వెతుక్కుంటూ రావలసి వచ్చిందే! అంతా నా కావ్...లేదు లేదు...నా స్టాఫ్ జానకి కోసం?"

"జానకి కోసమా...ఆమెకు ఏమిటి సమస్య?"

"నువ్వే సమస్య"

"నాకు అర్ధం కాలేదు"

"ఆహా...మంచి నటన"

"ప్లీజ్ గాయత్రి. నిజంగానే అర్ధం కాలేదు"

“నీకు అర్ధం అయ్యేటట్టు చెప్పేంత ఓపికి నాకు లేదు. జానకి గురించి మీ ఇంట్లో మాట్లాడావా...లేదా? ఎప్పుడు పెళ్ళి పెట్టుకుందాం? త్వరగా సమాధానం చెప్పు"

"గాయత్రీ మీరు నన్ను తప్పుగా అర్ధం చేసుకుని మాట్లాడుతున్నారు. జానికి నా స్నేహితురాలు...అంతే"

"నీ యొక్క వివాదం నాకు అక్కర్లేదు. నువ్వు జానకిని ఇస్టపడుతున్నావా...లేదా అనేది కూడా నాకు ముఖ్యం కాదు. ఆమెకు నువ్వు నచ్చావు. నిన్ను పెళ్ళిచేసుకోవటానికి ఆశపడుతోంది. ఆమె సంతోషమే నాకు ముఖ్యం"

"అరె...నిన్నటి వరకు పిల్లీ-ఎలుకలాగా ఉన్న మీ ఇద్దరి మధ్య ఇదేమిటి కొత్తగా?"

"అది నీకు అనవసరమైన విషయం. జానకి వ్యవహారానికి మొదట నీ సమాధానం చెప్పు"

"సారీ గాయత్రీ! నేను ఇంతకు ముందు చెప్పిందే. జానకి నా స్నేహితురాలుగా ఉండటం వరకే ఆమెకు హక్కు ఉంది"

"యూ రాస్కేల్. ఆమెతో సన్నిహితంగా ఉండి, ఆమె మనసును పాడు చేసి, ఇప్పుడు ఏమీ తెలియనివాడిలాగా మాట్లాడుతున్నావు? ఏమనుకుంటున్నావ్ నీ మనసులో? మర్యాదగా ఆమె మెడలో తాళి కట్టి కాపురం చేయటానికి దారి చూడు. లేకపోతే..."

"గాయత్రీ...ప్లీజ్. మీరు బయలుదేరండి. నేను జానకి దగ్గర మాట్లాడతాను"

"ఏం మాట్లాడతావు? నీకు యాక్సిడెంట్ జరిగి, హాస్పిటల్ బెడ్డులో పడుకున్నప్పుడు తిండి, నిద్ర మర్చిపోయి నీ పక్కనే ఉండి నిన్ను చూసుకుంది. మనసు నిండా నీమీద ప్రేమను నింపుకున్న ఆమె దగ్గరకు వెళ్ళి...నేను నిన్ను ‘ప్రేమించటం లేదు’ అని చెబితే, జానకి తట్టుకోలేదు. ఆమెకు ఏదైన జరిగితే ఆ తరువాత నిన్ను వూరికే విడిచిపెట్టను...ఇప్పుడే చెబుతున్నాను"

హెచ్చరిస్తున్నట్టు చెప్పేసి వేగంగా బయలుదేరిన గాయత్రి వెనుకే బాలాజీ కూడా వెళ్ళాడు.

"ప్లీజ్ గాయత్రీ, నేను చెప్పేది కొంచం వినండి" అంటూ వెనుకే పరిగెత్తుకు వచ్చాడు రమేష్.

అమె ఆగలేదు. ఆమె వెళ్ళిన వైపే కదలకుండా చూస్తూ ఉండిపోయాడు రమేష్.

ఇంకా ఉంది.....Continued in: PART-12

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

15, సెప్టెంబర్ 2019, ఆదివారం

తొలివలపు (సీరియల్)....PART-10



                                             తొలివలపు….(సీరియల్)
                                                          (PART-10)

రాత్రి పన్నెడు గంటలు అవుతున్నా నిద్రరాక అటూ ఇటూ దొర్లుతోంది గాయత్రి. నిద్ర ఎలా వస్తుంది. ఒకటా...రెండా? ఇరవై సంవత్సరాలు తరువాత కదా వదిలి వెళ్ళిన రక్త సంబంధం మళ్ళీ వచ్చి అతుక్కుంది. ఈ విషయాన్ని ఎలా-ఎవరితో చెబుతుంది? తడిసిన దిండు హాయిని ఇవటం దిక్కరించినప్పుడు లేచి కూర్చుంది. ఏడుపు ఆపేసినా ఆమె కళ్ళల్లో శోకం ఇంకా కనబడుతూనే ఉన్నది.

'కావ్యా!' అప్పుడే పూసిన పువ్వుకు నేను పెట్టిన పేరు కదా ఇది. ఎలా మరిచిపోతాను. నిన్ను నా హృదయానికి హత్తుకుని లాలించిన రోజులను ఎలా మర్చిపోతాను? నా చిట్టి తల్లీ! బంధువులే లేకుండా ఏకాకిగా తిరుగుతున్న నాకు 'బంధువు నేనున్నాను’ అని చెప్పటానికి వచ్చావా? నల్లటి మేఘాలన్నీ ఒకచోట జేరి వర్షం కురుస్తున్నట్లు, నీ జ్ఞాపకాలు మాత్రమే నా మనసంతా నిండి సంతోష జల్లు పడుతున్నట్టు ఉన్నది. ఇక నేను అనాధను కాను...అనాధను కాను.

కావ్యా! నా ప్రియమైన చెల్లి...ఈ నిజాన్ని ఈ ప్రపంచంలో అందరికీ వినబడేటట్టు అరిచి చెబుతాను, 'ఈమె నా రక్త సంబంధం' అని! చాలు. మనిషికోపక్క అనాధగా మనం జీవించింది చాలు కావ్యా. నా దగ్గరకు వచ్చేయి. నీకు నేనున్నానే చిట్టి తల్లీ! కానీ...కానీ...నా చెల్లీ...నన్ను క్షమిస్తావా? నీ పేగు బంధాన్ని గుంట తవ్వి పూడ్చిపెట్టిన దాన్ని నేనే అని తెలిస్తే నన్ను అక్కయ్యగా ఆదరిస్తావా?

అయ్యో! వద్దు. నువ్వు బలహీనమైన గుండెను మోసుకుంటూ తిరుగుతున్నావు. నిజాన్ని తట్టుకునే శక్తి నీకు లేదు. నాతోనే అన్నీ సమాధి అయిపోనీ. దూరంగా ఉండైనా నా ప్రేమను నువ్వు అర్ధం చేసుకోవాలి. నాకు అది చాలు. నేను పోగొట్టుకున్న సంతోషాలను నీకైనా వెతికి ఇస్తాను. ఇది సత్యం!'

లేచి వెళ్ళి మంచి నీళ్ళు తాగింది. తిరిగి వచ్చి గడియారం చూసింది. మధ్య రాత్రి మూడు దాటింది. తెల్లారే వరకు మేలుకునే ఉన్నది గాయత్రి.

********************

"నిజంగానా చెబుతున్నావా" పద్మా నర్స్ ఇలా అడగటం అది పదోసారి.

"ఇంకా నువ్వు నన్ను నమ్మటం లేదా?" - విసుగ్గా అన్నది జానకి.

"అదికాదే. గాయత్రి మ్యాడమ్ గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. కారణం లేకుండా గాయత్రి మ్యాడమ్ ఏ విషయంలోనూ కలుగజేసుకోదు. ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు"

"నీకు అన్నిటికీ అనుమానమే"

"సడన్ గా నీ మీద ఆమెకు ఎందుకు అంత ప్రేమ? నాకెందుకో డౌట్ గా ఉంది"

"అదే నాకూ అర్ధం కాలేదు"

ఇద్దరూ ఆలొచనలో ఉన్నప్పుడు నర్స్ కల్యాణి లోపలకు వచ్చింది.

"జానకీ, నిన్ను మ్యాడమ్ పిలుస్తోంది"

"ఎందుకు?"

"నాకేం తెలుసు. రమ్మని చెప్పారు"-- అని చెప్పి వెళ్ళిపోయింది.

"సరే...నాకు డ్యూటీ ముగిసింది. నేను బయలుదేరుతాను జానకీ. నువ్వెళ్ళి ఏమిటో చూడు" అని చెప్పి నర్స్ పద్మ కూడా బయలుదేరింది.

'ఏమై ఉంటుంది?' - అనే ఆలొచనతో గాయత్రి యొక్క గది వైపు నడవటం మొదలుపెట్టింది జానకి.

తలుపు మీద తట్టి లోపలకు వచ్చిన జానకిని చూసి... 'వచ్చేసిందా నా చిట్టి తల్లి?'….ఆమె కోసమే ఎదురుచూస్తున్నట్లు కుర్చీలో నుండి లేచి వెళ్ళి స్వాగతించి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది గాయత్రి.

తన చెల్లిని చూడాలనిపించిందే తప్ప, ఆమెతో ఏం మాట్లాడాలో తెలియక భాష మరిచి మౌనంగా నిలబడ్డ గాయత్రిని చూసి......

'ఈమెకు బుర్ర ఏమైనా చెడిపోయిందా ఏమిటి?' అనేలాగా గాయత్రినిని చూస్తూ ఉండిపోయింది జానకి. తరువాత ఓర్పు కోల్పోయింది. "మ్యాడమ్...రమ్మని చెప్పారట?" అన్నది.

"ఏమిటీ?... ఏమీలేదు. వచ్చి...అదే...రమేష్ దగ్గర నుండి ఫోన్ ఏదైనా వచ్చిందా?"

‘లేదు’ అనేలాగా జానకి తల ఊపేటప్పుడు జానకి మొహంలో కనబడ్డ శోకం గాయత్రిని కాల్చింది. దాన్ని చూడలేక,....

"సరే...నువ్వెళ్ళు" అన్నది. జానకి వెళ్ళిన కొన్ని నిమిషాల వరకు ఆలొచనలో కూరుకుపోయింది.

'కావ్యా...నా చిట్టి తల్లీ! నీలో ఏర్పడే చిన్న శోకాన్ని కూడా నా హృదయం తట్టుకోలేకపోతోంది. ఏం చేయను? నీ శోకానికి కారణం తెలియని దానినా నేను? కొంచం వైట్ చెయ్యి. నీకైన సంతోషం నీ ఇళ్ళు వెతుక్కుంటూ వచ్చేటట్టు చేస్తాను’

తన కుర్చీలో కూర్చుని బాలాజీకి ఫోన్ చేసింది గాయత్రి.

"ఏమైంది...అడ్రస్ దొరికిందా?"

"మీ ‘సెల్’ ఫోన్ కట్ చేసి గుమ్మంవైపు ఒకసారి చూడండి"

ఆమె తలెత్తి గుమ్మం వైపు చూసినప్పుడు అద్దాల తలుపు తోసుకుంటూ లోపలకు వచ్చాడు బాలాజీ.

"ఇదిగోండి" అంటూ ఒక కాగితం ముక్కను అమె ముందు జాపాడు.

"వద్దు...నీ దగ్గరే ఉంచుకో. రా...వెళదాం" అంటూ లేచి బయలుదేరింది. గాయత్రి వెనుకే నడిచాడు బాలాజీ.

ఇంకా ఉంది.....Continued in: PART-11

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

13, సెప్టెంబర్ 2019, శుక్రవారం

తొలివలపు(సీరియల్)....PART-9

                                 
                                               తొలివలపు….(సీరియల్)
                                                             (PART-9)

ఆ ఇంటి ముందు ఆ కారు వచ్చి ఆగిన వెంటనే, అందులో నుండి దిగింది గాయత్రి. ఆ ఇంటి తలుపు తట్టి రెండు నిమిషాలు కాచుకోనున్న తరువాత ఒక మధ్య వయస్కురాలు తొంగి చూసింది.

"ఎవరు కావాలి?"

"ఇది జానకి ఇల్లేనా?"

"అవును...మీరు?"

"నా పేరు గాయత్రి. మీ అమ్మాయి నా దగ్గరే పనిచేస్తోంది"

"అరెరే! మీరా? లోపలకు రండి" అంటూ తలుపును పూర్తిగా తెరిచింది, జానకి తల్లి విశాలాక్షి.

"జానకి లేదా?"

"గుడికి వెళ్ళింది. ఇప్పుడు వచ్చేస్తుంది. ఏం తీసుకుంటారు? కాఫీనా లేక టీనా?"

"నో ధ్యాంక్స్. నేను వచ్చిన కారణం చెప్పేస్తాను. మీ అమ్మాయి రమేష్ అనే ఒకతన్ని ఇష్టపడుతోంది. దాని గురించి మీదగ్గర ఏదైనా చెప్పిందా?"

"ఏం చెబుతున్నారు మ్యాడమ్? నా దగ్గర తను ఏమీ చెప్పలేదే?" అన్నది ఆందోళనతో.

"భయపడకండి. మీ అమ్మాయి ఒక మంచి వాడ్నే ఎన్నుకుంది. ఇప్పుడు నేను ఇక్కడికి రావటానికి కారణం వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయటానికి మీ అనుమతి అడగటానికి వచ్చాను"

"సరే నండి. కానీ, అబ్బాయి గురించి"

"దాని గురించిన భయమే మీకొద్దు. మీ అమ్మాయిని సంతోషంగా చూసుకుంటాడు. వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయాల్సిన పూర్తి బాధ్యత నాది. మీరు 'ఓ.కే' అంటే చాలు. ఏమంటారు?"

"తానుగా వచ్చే మంచిని ఎవరు కాదంటారు? మగవాళ్ళు లేని ఇళ్లు. నా బాధ్యతను మీరు తీసుకుంటానని చెబుతుంటే నేను వద్దనా అంటాను? దీంట్లో నాకు పరిపూర్ణ సమ్మతం"

"నన్ను నమ్మి బాధ్యతను అప్పగించి నందుకు కృతజ్ఞతలు. అతి త్వరలో రమేష్ ఇంట్లో నుండి అమ్మాయిని చూసుకోవటానికి వస్తారు. జానకి రాగానే ఈ విషయం గురించి చెప్పండి. నేను బయలుదేరుతాను"

"కొంచం ఉండండి... అంతలోపే బయలుదేరితే ఎట్లా? సంతోషమైన విషయం చెప్పారు. ఇప్పుడే వస్తాను" అని లోపలకు పరిగెత్తింది విశాలాక్షి.

ఒంటరిగా వదిలిపెట్టబడ్డ గాయత్రి ఏం చేయాలో తెలియక అక్కడున్న ఫోటోల వైపు చూసింది. ఆమె చూపు ఇక చిన్న పిల్ల ఫోటోను చూడంగానే అక్కడే ఆగిపోయింది. సడన్ గా ఏదో అనిపించటంతో ఆ ఫోటో దగ్గరకు పరిగెత్తుకెళ్ళి, ఆ ఫోటోను చేతుల్లోకి తీసుకుని క్షుణ్ణంగా గమనించింది.

'ఇది...ఇది...'- అనుకుంటూ ఆలొచనలో ఆమె ఉన్నప్పుడు.

"జానకినే" వెనుక నుండి గొంతు వినబడింది. చేతిలో స్వీటు తో నిలబడున్నది విశాలాక్షి.

'నిజంగానే ఇది జానకీయేనా? నా కళ్ళు నన్ను మోసం చేస్తాయా ఏమిటి? గుండెల్లో ముద్ర వేసుకున్న ఆ పసి మొహాన్ని ఎలా మరిచిపోగలదు? కానీ నా సందేహాన్ని ఎలా తీర్చుకోను? ఈమె దగ్గర ఏమని అడగను? ఎం చెయ్యబోతాను?'-- అనుకుంటూ దీర్గ ఆలొచనలో పడిపోయిన గాయత్రిని చూసిన తరువాత విశాలాక్షే నోరు తెరిచింది.

"మీ దగ్గర ఒక నిజాన్ని చెప్పాలి డాక్టర్. జానకి నేను కన్న బిడ్డ కాదు" అని చెప్పటం ఆపిన విశాలాక్షిని ఆశ్చర్యంగా చూసింది గాయత్రి.

'అలాగైతే నా సందేహం కరెక్టేనా?' --ఏడుపు, సంతోషం కలిసిన ఒక విధమైన భావనతో విశాలాక్షిని చూసింది.

"మా ఆయన స్టేషన్ మాస్టర్ గా ఉండేవారు. మాటి మాటికీ ట్రాన్స్ ఫర్ పేరుతో చాలా ఊర్లకు వెళ్ళిపోయేవారు. అలా ఒకసారి రామాపురం అనే ఊర్లో ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడే జానకిని పసిబిడ్డగా ఆ ఊరి నుండి ఎత్తుకొచ్చారు. పిల్లలు పుట్టే భాగ్యమే లేదని తెలుసుకుని తీవ్ర మనొవేధనకు గురైన మాకు దేవుడే కరునించి మాకు ఈ బిడ్డను ఇచ్చాడనుకుని ఆ బిడ్డను మేము పెంచుకుందామని నిర్ణయించుకున్నాము. జానకి అని పేరు పెట్టుకుని మురిపంగా పెంచుకున్నాము. దానికి ఆరేళ్ళు ఉన్నప్పుడు ఆయన చనిపోయారు" అని చెప్పటం ఆపింది విశాలాక్షి.

అక్కడ గాయత్రికని ఉంచిన మంచి నీళ్ళ గ్లాసు తీసుకుని గబగబా తాగేసి మళ్ళీ మొదలుపెట్టింది విశాలాక్షి.

"తాను ఎవరు అనే విషయం జానకికి ఈ నిమిషం వరకు తెలియదు మ్యాడమ్. ఈ రహస్యాన్ని మీ దగ్గర చెప్పటానికి కారణం, ఒకవేల పెళ్ళి తరువాత పెళ్ళికొడుకు తరఫు వాళ్ళకు ఈ విషయం తెలియవస్తే...తరువాత సమస్య ఏదీ రాకుండా ఉండాలనే. ఇక మీరే చూసుకోవాలి "

మాట్లాడటానికి మాటలు లేక అలాగే కూర్చుండిపోయింది గాయత్రి.

"కావ్యా..."--శబ్ధం రాకుండా పెదవులు ఒకసారి ఉచ్చరించు కున్నప్పుడు లోపలకు వచ్చింది జానకి. గాయత్రిని తన ఇంట్లో ఎదురుచూడని జానకి నిర్ఘాంతపోయి నిలబడ్డప్పుడు కళ్ళార్పకుండా జానకినే చూసింది గాయత్రి.

'పసి బిడ్డా ఈమె? యుక్త వయసులో, యౌవనదశలో సీతాకోక చిలుకలా ఎగురుతున్నదే! ఇన్ని రోజులు నా పక్కనే ఉన్న జానకిని నేను ఎందుకు గుర్తుపట్టలేకపోయాను?'

'మోడు బారిన నా జీవితంలో నేను ఒంటరిగా లేనని అభయం ఇచ్చావే జానకీ! ఎలా ఉన్నావే? రాలిపోయిన నా బంధువా?' - గబుక్కున జానకి మొహాన్ని తన చేతులలోకి తీసుకుని అమె కళ్ళల్లోకి సూటిగా చూసి ఆమె నుదిటిపై ముద్దు పెట్టుకుంది.

వేనక్కు జరిగింది, బయటకు వచ్చింది. కారు ఎక్కింది. తిరిగి వెళ్ళింది.

గుమ్మం వైపే చూసింది జానకి. 'నేను చూసేది కల కాదు కదా?' అనుకున్నది.

"హిట్లరా...లే...లేదులేదు. గాయత్రీనా ఈమె? నమ్మలేకపోతున్నాను. ఇదేమిటి...నామీద హఠాత్తుగా ఇలాంటొక ప్రేమ? దీనికి కారణం?"

కూతురి యొక్క మనొభవాన్ని అర్ధం చేసుకున్న దానిలాగా...గాయత్రి వచ్చి వెళ్ళిన కారణాన్ని కూతురుకు చెప్పింది విశాలాక్షి.

"రమేష్ గురించి నీ దగ్గర చెప్పనందుకు సారీమ్మా"

"అమ్మ దగ్గర చెప్పటానికి ఎందుకురా అంత సంశయం? సరే...పోనీ. అంతా మంచిగా జరిగితే సరి. ఒకత్తిగా ఉండి నీ పెళ్ళి ఎలా చేయాగలను అని భయపడ్డాను. ఇక నాకు ఆ భయం- లేదు. ఎవరు కన్న బిడ్డో ఆ గాయత్రీ, జీవితంలో బాగుండాలి"

గాయత్రిని అభినందించి లోపలకు వెళ్ళింది విశాలాక్షి.

ఇంకా కూడా ఆలొచనా గుప్పెట్లో చిక్కుకునే ఉన్నది జానకి.

ఇంకా ఉంది.....Continued in: PART-10

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

11, సెప్టెంబర్ 2019, బుధవారం

తొలివలపు(సీరియల్)....PART-8




                                                తొలివలపు….(సీరియల్)
                                                             (PART-8)

ఇరవై సంవత్సరాలు కనబడకుండాపోయిన గాయత్రిని, ఇంకా ఎన్నిరోజులకు చూస్తామో నన్న ఆవేదనలో ఉండే రమేష్, గాయత్రి కనబడిన తరువాత నాలుగైదు రోజులు గాయత్రిని చూడకపోవటం వలన పిచ్చి పట్టినవాడిలాగా అయ్యాడు. తన ఊరి నుండి తిరిగి వచ్చీ రాగానే గాయత్రిని చూడటానికి బయలుదేరాడు. గుమ్మం దాటుతున్నప్పుడు 'సెల్ ఫోన్ మోగింది. తీసి "హలో" అన్నాడు.

"హలో రమేష్. నేను జానకి మాట్లాడుతున్నాను" అన్నది అవతలి గొంతు.

"చెప్పండి" అన్నాడు ఆ రోజు ఆమె మీద ఏర్పడ్డ కోపాన్ని మర్చిపోయి.

"హమ్మయ్య....అవును ఎక్కడికి వెళ్ళిపోయారు రమేష్? ఫోన్ చేస్తే 'నాట్ రీచబుల్’ అని వస్తూనే ఉంది"

"మా ఊరు వెళ్ళాను...అందుకే! సరే. ఏమిటి విషయం...చెప్పండి?"

"ఏమీలేదు...నేను మీతో కొంచం మాట్లాడాలి"

"నేను కూడా నీతో మీతో కొంచం మాట్లాడాలి. ఎక్కడ...ఎప్పుడు 'మీట్' చేద్దాం?"....రమేష్ అలా అడగటంతో ఏం మాట్లాడాలో తెలియక మౌనం వహించింది జానకి

".................."

"హలో జానకీ, 'లైన్ లో ఉన్నారా?"

"ఆ, చె...చెప్పండి"

"ఎందుకు తడబడతున్నారు?"

"ఏమీ లేదు"

"సరే, నేనే చెబుతాను. సాయంత్రం ఐదు గంటలకు గుడి పక్కనున్న పార్కులో వైట్ చేస్తాను...వచ్చేయండి"

అవతలి వైపు జానకి స్థంభించి నిలబడున్నది తెలియక బయలుదేరాడు రమేష్.

'చెప్పేయాలి. నా గాయత్రిని గురించి ఆడ హిట్లర్/దయ్యం అంటూ మళ్ళీ ఇంకోసారి అలా మాట్లాడ వద్దని చెప్పేయాలి. లేకపోతే ఇక్కడితో మన స్నేహం ముగించుకుందాం అని చెప్పేద్దాం'--మనసులో అనుకున్నాడు.

బైకులో ప్రయాణం చేస్తున్నప్పుడు తన తల్లి అడిగింది జ్ఞాపకమొచ్చింది అతనికి.

"నా కోడల్ని ఎప్పుడ్రా తీసుకు వస్తావు?" --ఇప్పుడు కూడా తన తల్లి అతని ఎదురుగా నిలబడి అడుగుతున్నట్లు ఉన్నది అతనికి.

'అతి త్వరలోనే అమ్మా' తనలో అనుకున్నాడు. కళ్ళెదుట గాయత్రి కనిపించి నవ్వింది. గబుక్కున ఉత్సాహం వచ్చి బైకు వేగాన్ని పెంచాడు.

హాస్పిటల్ ను చేరుకున్నప్పుడు అక్కడ పెద్దగా జనం లేరు.

'గుడ్ మార్నింగ్' అన్న కఠం విని ఒక 'స్కాన్ రిపోర్ట్' చూస్తున్న గాయత్రి 'ఎవరా?' అని తలెత్తి చూసింది. రమేష్ నిలబడున్నాడు.

'మళ్ళీ ఇతను ఎందుకు వచ్చాడు?'-అనిపించింది. లోపల చెలరేగిన కోపం మొహానికి చేరేటప్పటికి, ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు రమేష్.

"ప్రొద్దున పూట మీరు చాలా అందంగా ఉన్నారు" అన్నాడు.

తన కోపాన్ని అనుచుకోవటానికి చాలా శ్రమ పడింది గాయత్రి. అతను దాని గురించి పట్టించుకోలేదు.

"ఇప్పుడు ఆరొగ్యం బాగుందా గాయత్రీ? ఆ రోజు మీరున్న పరిస్థితి చూసి చాలా భయపడిపోయాను తెలుసా?" అన్నాడు గబుక్కున శోఖంగా ముఖం పెట్టుకుని.

“కానీ, ఆ రోజు ఎందుకురా బ్రతికేము అని ఇప్పుడు అనిపిస్తోంది. ఇలా నీ మొహాన్ని చూసే అవకాశమే ఉండకుండా పోయేది చూడు"

నిదానంగా చెప్పిన గాయత్రిని ఆశ్చర్యంతో చూశాడు.

"ఎందుకు గాయత్రీ అలా మాట్లాడుతున్నారు?"

"ఇంకెలా మాట్లాడమంటావు? చెప్పు! ఒకటి...నన్ను ప్రశాంతంగా ఉండనీ.లేదా...నా కళ్ళకు కనబడకుండా ఎక్కడికైనా వెళ్ళిపో"-- తలమీద చేతులు పెట్టుకుని తల వంచుకున్న ఆమెను బాధతో చూశాడు.

"ఓ.కే. గాయత్రీ. నేను వెళ్ళిపోతాను. కానీ, ఒక విషయం మాత్రం చెప్పండి. మీ మనసులో నేను ఉన్నానా....లేనా? దయచేసి నిజం చెప్పండి"

"లేరు...చాలా! అసలు ఎవరు నువ్వు? నువ్వుగా వచ్చావు...ఏదేదో వాగావు. ఇప్పుడు నిజం చెప్పండి అంటే ఏమిటి అర్ధం? నాకు అర్ధం కాలేదు?"

"నాతో ఆడుకోకండి గాయత్రీ. మీరు మాత్రం నాకు దొరకకపోతే నేను...." అతను ముగించేలోపు....

"చచ్చిపొండి" అని గట్టిగా అరిచిన ఆమె "నువ్వు చచ్చిపోయినందు వలన ఈ లోకమేమీ పనిచేయకుండా ఆగిపోదు. ఇక్కడకొచ్చి నా ప్రాణం తీయకుండా ఎక్కడికైనా వెళ్ళి తగలడు. నీ వళ్ల నా ప్రశాంతతే పోయింది. నీ మొహం చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతోంది. ఇక్కడ్నుంచి వెళ్ళిపో"

మాటలతో తన మనసును విరిచేసిన ఆమెను బాధగా చూస్తున్న రమేష్ ఇక మాట్లాడటం ఇష్టంలేక లేచి నడవటం మొదలుపెట్టాడు.

"ఒక్క నిమిషం" - తెరవటానికి తలుపును ముట్టుకున్న అతన్ని గాయత్రి గొంతు ఆపింది.

"నువ్వు నన్ను కలవటానికి రావటం ఇదే చివరి సారిగా ఉండాలి"- అని చెప్పి తన పని చేసుకోవటం మొదలుపెట్టింది.

అదేసమయం బస్సు దిగిన జానకి, బైకును తోసుకుంటూ వస్తున్న రమేష్ ను చూసి నడకలో వేగం పెంచింది.

'ఈ టైములో ఈయన ఎందుకు హాస్పిటల్ కు వచ్చి వెల్తున్నాడు? నన్ను వెతుక్కుంటూ వచ్చాడో? సాయంత్రం వరకు వైట్ చేయలేడా? ఏమిటంత అర్జెంటు? ఒకవేల నాలాగానే నువ్వు కూడా ప్రేమను చెప్పటానికి ఇబ్బంది పడుతున్నావా? కానీ ఇదేమిటి...రమేష్ ఏం చేస్తున్నారు? త్వరగా రోడ్డు క్రాస్ చెయ్యండి. అయ్యో...' ఆమె అరుపు గాలిలో కలిసిన సమయం 'ఢాం' అని ఆ శబ్ధం వినబడింది.

నిమిషంలో గుమికూడిన గుంపును తోసుకుంటూ ముందుకు వచ్చింది జానకి. చొక్కా అంతా రక్తంతో, బోర్ల పడున్న రమేష్ ని చూసిన ఆమెకు హృదయం పనిచేయటం మానేసింది.

తర్వాతి పది నిమిషాలలో...రమేష్ ప్రమాదానికి గురి అయ్యి తన హాస్పిటల్లో 'అడ్మిట్' అయిన న్యూస్ గాయత్రికి తెలుపబడింది. బలమైన దెబ్బలు తగలటం వలన స్పృహ కోల్పోయున్నాడు. దగ్గరే ఉండి అతన్ని చూసుకుంటోంది జానకి.

అయ్యింది. నాలుగైదు రోజుల గడిచిన అతరువాత ఆ రోజు అతను స్పృహలోకి వచ్చాడు. కళ్ళు తెరవటానికి అతను శ్రమ పడుతున్నప్పుడు దగ్గరలో మాటలు వినబడి కదలకుండా అలాగే పడుకున్నాడు.

"చూడు జానకీ. నువ్విలా మొండి పట్టు పడితే ఎలా? దయచేసి బయలుదేరు. నేను చూసుకుంటాను"

"లేదు పద్మా...ఈ పరిస్థితిలో ఈయన్ను వదిలిపెట్టి"

"అరే భగవంతుడా! నేను చూసుకుంటానని చెబుతున్నాను కదా? నన్ను కూడా ఆ హిట్లర్ గాయత్రీ లాగా రాతి గుండె దాన్ని అని అనుకుంటున్నావా? ఒక ప్రాణం యముడితో పోరాడుతోందని తెలిసిన తరువాత కూడా పరిగెత్తుకు వస్తుందని అనుకుంటే...వేరే డాక్టరుకు ఫోన్ చేస్తోంది. ఇన్ని రోజులలో ఒకసారైనా ఈ గదివైపు వచ్చిందా చూశావా? ఆక్సిడెంటు కేసులను 'హిట్లర్ గారు అటెండ్ చేయరట. ఏం మనిషి?...మనస్సాక్షి లేని మృగం"

"వదిలేయ్ పద్మా. ఇప్పుడు నా బాధంతా రమేష్ గురించే. ఇలా కళ్ళు తెరవకుండా పడున్నారే! అది తలచుకుంటేనే భయంగా ఉంది"

"ఇలా చూడు జానకీ. రాజేశ్వరి డాక్టర్ చెప్పింది నువ్వు నమ్మటం లేదా? నీ రమేష్ కి ఏమీ అవదు. చాలా? అనవసరమైన ఆలొచనలు పెట్టుకుని మనసు పాడుచేసుకోకుండా ఇంటికెళ్ళి 'రెస్టు’ తీసుకో. ఈ నాలుగైదు రోజులుగా నువ్వు సరిగ్గా తినను కూడా లేదు. దయచేసి బయలుదేరు. నేను చూసుకుంటా" అని స్నేహితురాలు బలవంతం చేయటంతో మనసులేకపోయినా బయలుదేరి వెళ్ళింది జానకి.

తన గదిలోనే ఉండి అక్కడ జరిగినదంతా 'సెక్యూరిటీ కెమేరా' రికార్డింగ్ ద్వారా చూస్తున్న గాయత్రి, కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది.

అదే సమయం కళ్ళు తెరిచి మెల్లగా లేచిన రమేష్- తూలుకుంటూ నడిచి, ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్ళాడు.

ఇంకా ఉంది.....Continued in: PART-9

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

9, సెప్టెంబర్ 2019, సోమవారం

తొలివలపు(సీరియల్)....PART-7



                                                తొలివలపు….(సీరియల్)
                                                            ( PART-7)

అది అమ్మవారి గుడి.

గాయత్రి పేరు మీద అర్చన చేయంచి బయటకు వచ్చాడు రమేష్. చెప్పులు వెతికి వేసుకుని తల ఎత్తినప్పుడు అదిరిపడ్డాడు.

అంత పక్కనే జానకి నిలబడుంటుందని అతను ఎదురుచూడలేదు.

"గుడికి వచ్చే అలవాటు ఉందా?" అడిగింది.

"ఏం...ఉండకూడదా?" - చిన్నగా నవ్వాడు.

"అయ్యో! నేనేదో సరదాకి అడిగాను" - ఆమె కూడా నవ్వింది.

"అది సరే...ఈ రోజు మీకు పనిలేదా?"

"ప్రొద్దున డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళే వస్తున్నాను. విషయం తెలుసా మీకు? ఈ రోజు మా హాస్పిటల్ స్టాఫ్ అందరూ జాలీగా 'ఎంజాయ్' చేశాము"

"అలాగా...అంత ఎంజాయ్ చేయటానికి కారణమేమిటో?"

"ఆ కారణాన్ని ఇలా రోడ్డు మీద నిలబడి చెప్పదలుచుకోలేదు...నాతో రండి" అంటూ ముందుకు నడిచింది.

వేరే దారి లేక ఆమె వెనుకే నడిచాడు రమేష్.

దగ్గరున్న పార్కులోకి వెళ్ళింది. ఒక బెంచ్ మీద కూర్చుంది. రమేష్ అమె పక్కనే కూర్చున్నాడు. అప్పుడే అక్కడకొచ్చిన అబ్బాయి దగ్గర రెండు బఠానీల పొట్లాలు కొని ఒకటి రమేష్ చేతికి ఇచ్చింది జానకి. మొహమాట పడుతూనే ఆ కాగితం పొట్లంను తీసుకున్నాడు రమేష్.

'చెప్పేయ్. దొరికిన సంధర్బాన్ని జారిపోనివ్వకు. బహిరంగంగా నీ ప్రేమను ఇప్పుడే అతనితో చెప్పేయ్. నిన్ను చూసిన రోజు నుండి 'నో వేకన్ సీ బోర్డ్' బయట వెలాడదీసినట్టు చెప్పేయ్' - మనసు చెప్పే అదేశంకోసం ఆమె వేచి ఉన్నప్పుడు.

"ఏమండి... ఏదో చెప్తానని చెప్పి ఇక్కడకు తీసుకు వచ్చి, కూర్చోని ఇలా నేలనే వేడుకగా చూస్తే అర్ధమేమిటి?" అన్నాడు.

"ఈ రోజు నాకు రెండు సంతోషాలు"

"అదే అడుగుతున్నా. ఏమిటవి?"

"ఒకటి... ఇలా మీతో పార్కులో కూర్చుని మాట్లాడే అవకాశం దొరికినందుకు. ఇంకొకటి...మా ఆడ హిట్లర్ దయ్యం దగ్గర నుంచి మాకు ఒక రోజు విడుదల దొరికినందుకు"

"మీరు ఎవరి గురించి చెబుతున్నారో తెలియటం లేదు!" అన్నాడు అర్ధంకాక.

"ఏమిటి రమేష్ మీరు? నేను ఆ రోజే చెప్పానే...అంతలోనే మర్చిపోయారా? ఆ డాక్టర్...అదే గాయత్రీ. ఆమె గురించే చెబుతున్నాను"

అతని చేతులో ఉన్న కాగితం గాలికి ఎగిరిపోయింది.

"ఏదో ఒంట్లో బాగుండలేదుట. శనేశ్వరం...మా ప్రాణం తీయటానికి మళ్ళీ లేచి రాకుండా, అలాగే పైకి పోయి జేరిపోతే చాలా బాగుంటుంది" అన్నది.

ఆమె కొనిచ్చిన బటానీలు అతని గొంతు దాటటానికి మొరాయించినై. గబగబా లేచాడు.

"ఏమైంది... ఎందుకు హఠాత్తుగా లేచారు?" అన్నది కొంచం ఆందోళనతో.

"ఏమీ లేదు. నేను బయలుదేరతాను" అన్నాడు...ఆమె మొహం చూడకుండా.

"అర్జెంటుగా వెళ్ళాలా?"

"అవును" అంటూ నడవటం మొదలుపెట్టాడు.

తన ప్రేమను బహిరంగంగా అతనితో చెప్పేయాలని అనుకున్న ఆమె, అతని ఒకే మాటతో కొంచం జంకి వెనక్కు తగ్గింది. తన మోటార్ సైకిల్ వైపు వెడుతున్న అతని దగ్గరకు పరిగెత్తింది.

"నన్ను కొంచం 'బస్ స్టాపింగు లో దింపగలరా? ప్లీజ్..."

'నో' అని చెప్పటం కరెక్టు కాదు. అందులోనూ రాత్రి సమయం కాబట్టీ "సరే" అన్నాడు.

బైకులో అతనితో ప్రయాణిస్తున్నప్పుడు గాలిలో ఎగురుతున్నట్లు అనిపించింది జానకికి. నాగరీకంగా అతనికి, తనకూ మధ్య గ్యాపు వదిలి కూర్చోనున్నా మనసులో అతనితో ఆనుకుని హాయిగా మాట్లాడుతూ వెడుతున్నట్లు ఊహించుకున్నది. ముందు కూర్చున్న అతని మొహం కనపడకపోయినా, అతని శ్వాశ గాలి తాకుతుంటే కళ్ళు మూసుకున్న ఆమెకు ఏవేవో కవితలు గుర్తుకు వచ్చాయి.

'ఎప్పుడు బైకు నుండి దిగింది...బస్సు ఎలా ఎక్కింది, ఎలా ఇళ్ళు జేరింది?' - అనేది ఏదీ ఆమెకు జ్ఞాపకం లేదు. భోజనం చెయడానికి పిలిచిన తల్లి పిలుపుకు 'ఆకలిగాలేదు’ అని చెప్పి మంచం మీద పడుకున్న ఆమెను వదలకుండా అల్లరి చేస్తున్నాడు రమేష్.

ఇంకా ఉంది.....Continued in:PART-8

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

7, సెప్టెంబర్ 2019, శనివారం

తొలివలపు(సీరియల్)....PART-6

                                                  తొలివలపు….(సీరియల్)
                                                              ( PART-6)

గోడ గడియారంలోని రెండు ముళ్ళు ఒకదాని మీద ఒకటి తలపెట్టి పడుకోనున్నాయి. తన పరిస్థితిని-డాక్టర్ బాధ్యతను మరచిపోయి తన మనసులో జరుగుతున్న పోరాటం నుండి బయటపడలేక కొట్టుకుంటోంది గాయత్రి.

'ఎలా బయటపడగలను? త్వరగా మరిచిపోగల విషయమా అది? ఆ సంఘటనను ఇప్పుడు తలుచుకున్నా ఒళ్ళు గగుర్పు పుడుతోందే! నా రెక్కలు పీకి పారేసి, నా భవిష్యత్తులో చీకటి నింపిని ఆరోజు, భూదేవి తల్లి ఒడిలో ఆనందంగా విరబూసి పరిమలం విదజల్లుతున్న పువ్వుల మధ్యలో విరబూసిన రాత్రే వాడిపోయిన పువ్వులా నిలబడ్డ ఆ రోజు.

'అయ్యో! వద్దు. మనసా ఆ రోజును జ్ఞాపకం చేయకు! మర్చిపో. దేన్నీ జ్ఞాపకం పెట్టుకోకుండా మర్చిపో! చీకటినిండిపోయిన నా జీవితంలో వెలుతురును వెతుక్కుంటూ వచ్చి నిలబడ్డాడే ఒకడు. ఎవరతను? ఎంతో కొంత నాలో మిగిలున్న ప్రాణాన్ని తీసుకువెళ్ళటానికి వచ్చాడా? దేవుడా! ఎవరైనా అతనికి అర్ధం అయ్యేటట్టు చెప్పండి. ప్రాణం, శరీరం మాత్రమే ఉన్న నేను ఎటువంటి భావాలూ లేని రాయి లాగ తిరుగుతున్నాను. నా జీవితంలో వసంతం పోగొట్టుకుని చాలా సంవత్సరాలు అయ్యింది!

పాపం! ఏమీ అర్ధం చేసుకోలేని వయసులో ఏర్పడింది అతని ప్రేమ. అర్ధమయ్యేట్టట్టు చెబితే అర్ధం చేసుకోగలడు. నా గురించి మర్చిపోతాడు’ లేచి అద్దం ముందు వెళ్ళి నిలబడింది. మనిషంత ఎత్తు అద్దం. అద్దంలోని ఆమె ప్రతిబింబం నిర్భయంగా ఆమెలోని శోకాన్ని కలిపి చెప్పింది. 'నేను ఇంకా అలసిపోలేదు’ అనేలాగా తొంగి చూసిన కన్నీటిని తుడుచుకుని స్నానల గదిలోకి వెళ్ళింది. కళ్ళు మూసుకుని చాలాసేపు నిలబడింది. కళ్ళముందుకు వచ్చి నిలబడింది రమేష్ యొక్క శోకమైన ముఖం.

'అతన్నికొట్టుండ కూడదో?'--అని ఒక్క క్షణం ఆలొచించినప్పుడు మరు క్షణమే ఎదిరించింది ఆమె మనసు. 'నదిలో వరద పొంగుకు వచ్చేటప్పుడు అనకట్టు కట్టి వరదను ఆపటంలేదా? అదేలాగనే ఇది కూడా. నీ మీద అతను పెట్టుకున్న ప్రేమ ఇప్పుడు అతన్ని నిదానంలో ఉంచుతుంది. నువ్వు కొట్టిన చెంప దెబ్బ అతను నీకొసం మరుసటి అడుగు వేయటానికి ముందు అతన్ని ఒకసారి ఆలొచింప చేస్తుంది. కన్ ఫ్యూజ్ అవకు..క్లియర్ గా ఉండు! ప్రేమలో పడ్డ అతన్ని ఒడ్డుకు తీసుకురా! నువ్వు చేయాల్సిన బాధ్యతల కోసం ఒక ప్రపంచమే నీకొసం కాచుకోనుంది.

ఉత్సాహం పొందిన శరీరంతో స్నానాల గదిలో నుండి బయటకు వచ్చింది గాయత్రి. అదే సమయం మొదటి తుమ్ము ఆమెలో తన ప్రారంభోత్సవాన్ని మొదలుపెట్టింది. అప్పటికి ఇరవై సార్లు తొంగి చూశాడు బాలాజి. ఆమె తుమ్మటం తెలుసుకుని పరిగెత్తుకెళ్ళి మాత్ర తీసుకువచ్చి ఇచ్చాడు.

"టిఫెన్ తినడానికి రా అక్కా. ప్రొద్దుట్నుంచి నువ్వు ఏమీ తినలేదు"

"వద్దు బాలాజీ. అకాలిగా లేదు. కొంచంగా తల నొప్పి. నేను కొంచం 'రెస్టు తీసుకుంటాను. రాజేశ్వరి మేడమ్ దగ్గర ఈ విషయాన్ని చెప్పి హాస్పిటల్ను ఒకసారి చూసేసి వెళ్ళమని చెప్పు"

'సరే' అనేలాగా తల ఊపి వెళ్ళిపోయాడు బాలాజి.

ఆమె పరుపు మీద పడి కళ్ళు మూసుకుంది.

హడావిడిపడుతూ వచ్చాడు రమేష్.

అతనికోసం కాచుకున్నవాడిలా తలుపు తెరిచాడు బాలాజి.

"ఏమైంది...నా గాయత్రికి ఏమైంది...చెప్పు?"

తన భుజాలను పట్టుకుని ఊపుతూ అడిగిన రమేష్ ని తీసుకుని గాయత్రి రూముకు వెళ్ళాడు బాలాజీ.

శబ్ధం విని, వాడిపోయిన పువ్వులాగా ఒదిగి దుప్పట్లో ముడుచుకుపోయి పడుకుంది. జ్వరం క్షణ క్షణానికీ పెరుగుతూ ఆమెను తన కంట్రోల్లోకి తెచ్చుకుంది.

"తలనొప్పిగా ఉన్నదని చెప్పి పడుకున్నారు సార్. చాలాసేపటి నుండి పడుకునే ఉన్నారు. ప్రొద్దుట్నుంచి ఏమీ తినలేదని, టిఫిన్ తినడానికి రమ్మని పిలవటానికి వచ్చి చూస్తే ఇలా...” మాట్లాడలేక కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు బాలాజి.

గాయత్రికి దగ్గరగా కూర్చున్నాడు రమేష్. ప్రేమ నిండిన అతని మనసు ప్రేమికురాలి పరిస్థితి చూసి తల్లడిల్లింది. తన కుడి చేతితో ఆమె కుడి చేతిని పట్టుకున్నాడు. ఏడ్చిన కళ్ళతో అమె మొహాన్ని చూశాడు.

'నన్ను ఎందుకు ఇలా ఆందోళనకు గురిచేస్తావు గాయత్రీ? నేను నీ వాడినని ఎప్పుడు అర్ధం చేసుకోబోతావు? నిజంగా చెప్పు. నేనెవరో తెలియటంలేదా నీకు? నీకోసం జీవించటం మొదలుపెట్టి ఎన్నో సంవత్సరాలయ్యిందే? ఇంకా ఎంత కాలం నన్ను కాచుకోమని చెబుతావు? నీ సంకెళ్ళను పగలకొట్టుకుని నువ్వు బయటకు ఎప్పుడు రాబోతావు? చాలు గాయత్రీ, ఇక నాకు ఓపికలేదు! నీ జీవితాన్ని ఎప్పుడో నా దగ్గర అప్పజెప్పారు. జీవితాన్ని పారేసుకున్నాను అని బాధ పడకు. నిన్ను కాపాడలేకపోయినందుకు...నిజానికి బాధ పడాల్సింది నేను...! దానికొసం నన్ను క్షమించు. లేచి నాతో పోట్లాడు. దయచేసి కళ్ళు తెరు గాయత్రీ!’

తల వంచుకుని ఏడుస్తున్న రమేష్ వీపును తడుతూ సముదాయించాడు బాలాజి. అదే సమయం గాయత్రిలో చిన్న కదలిక కనబడింది. వెంటనే నిటారుగా కూర్చున్నాడు రమేష్.

శ్రమ పడుతూ కళ్ళు తెరిచింది గాయత్రి. కనీటితో దగ్గర కూర్చున్న రమేష్ ను చూసి అధిరిపడ్డది. తన చెతిని పట్టుకోనున్న అతని చేతిని విధిలించి విడిపించుకుంది. ఆమె శరీరంలోని వేడి మొత్తం ఆమె కళ్ళల్లోకి వచ్చి చేరినట్టు కళ్ళు ఎర్రగా ఉన్నాయి...ఆమె చూపులోని వెడిని తట్టుకోలేక తల దించుకున్నాడు రమేష్.

కోపంతో లేచి ఏదో చెప్పాలనుకుని నోరు తెరిచిన గాయత్రికి మాటలు రాలేదు. దానికి బదులు ఆమె నోటి నుండి వేగంగా వచ్చిన వాంతి, ఎదురుగా కూర్చున్న రమేష్ ని అభిషేకం చేసింది.

కళ్ళు తిరిగి పడిపోయింది గాయత్రి. రమేష్ ఆందోళనతో లేచాడు. పరిగెత్తుకుని వెళ్ళి నీళ్ళు పట్టుకొచ్చి తన ప్రేయసి మొహం కడిగాడు. బాలాజీ సహాయంతో ఆ చోటును క్లీన్ చేసి, అన్నింటినీ మార్చి 'హమ్మయ్య' అనుకుని వెనక్కి తిరిగాడు. ఎదురుగా డాక్టర్ రాజేశ్వరి.

"రమేష్"

"రండి డాక్టర్, కూర్చోండి" అంటూ సోఫా చూపించాడు.

"నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్?" అడుగుతూ సోఫాలొ కూర్చుంది.

తన మనసు విప్పి చెప్పాడు.

"ఆమె నువ్వు అనుకునే విధంగా లేదు రమేష్. ప్రేమ, పెళ్ళి అనే మాటలు వింటేనే అరవటం మొదలుపెడుతుంది. నేను ఇదివరకే ఈ విషయంగా గాయత్రితో మాట్లాడి, పోరాడి ఓడిపోయాను. మాట్లాడకుండా తిరిగి ఊరు వెళ్ళిపో. వేరే ఒక అమ్మాయిని చూసి పెళ్ళిచేసుకుని లైఫ్ లో సెటిల్ అవటానికి ప్రయత్నం చెయ్యి"

"నేను మా ఊరికి తిరిగ వెళ్ళిపోతాను డాక్టర్...అయితే ఒక్కడ్నీగా కాదు, గాయత్రిని తీసుకుని"

అతన్ని లోతుగా చూసింది. “నేను చెప్పలనుకున్నది చెప్పాను...తరువాత నీ ఈష్టం. నేను బయలుదేరతాను" అంటూ లేచింది డాక్టర్ రాజేశ్వరి.

"ఇంజెక్షన్ చేశాను...తగ్గిపోతుంది" అని చెప్పి గుమ్మం వైపు నడవటం మొదలుపెట్టిన డాక్టర్ రాజేశ్వరి వెనక్కి తిరిగి ఒక్కసారి రమేష్ ను చూసి అతని దగ్గరకు వచ్చింది. "గాడ్ బ్లెస్ యు" అని చెప్పి వెళ్ళిపోయింది.

ఇంకా ఉంది.....Continued in:PART-7

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)