17, సెప్టెంబర్ 2021, శుక్రవారం

ఎలుకల దేవాలయం...(ఆసక్తి)

 

                                                                                 ఎలుకల దేవాలయం                                                                                                                                                                              (ఆసక్తి)

                                               20 వేల ఎలుకలున్న కర్ణిమాతా దేవాలయంలో ఎన్నో వింతలు

                                     రాజస్థాన్ లోని బికనేర్ కు 30 కి.మీ దూరంలో ఉన్నది   దేవాలయం

ఆలయంలో ఎక్కడ చూసినా ఎలుకలే ఎలుకలు...వేల సంఖ్యలో ఎలుకలు...గుంపులు గుంపులుగా ఎలుకలు... ఎవరి పాదాల మీదుగా ఎలుకలు పరుగులు తీస్తాయో వారికి అమ్మ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టు, అదృష్టం కలిసొచ్చే కాలం దగ్గర్లోనే ఉన్నట్టు భక్తుల నమ్మకం. ఎలుకలు తిన్న ప్రసాదమే భక్తులకు పంపకాలు జరుగుతాయి...ఇలా ఎన్నో వింతలు.  

హిందువుల దేవతైన దుర్గామాత మరో అవతారమే కర్ణిమాత అంటారు. సిందూరం రాసిన ఏకశిల మీద అమ్మవారు చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. ఒక చేత త్రిశూలం, మరో చేత రాక్షస తల పట్టుకొని సింహవాహినిగా భక్తుల చేత పూజలందుకుంటుంది.

బికనీర్ రాజవంశీయులకు కర్ణిమాత కులదైవం. ఆలయాన్ని 15 శతాబ్దంలో గంగాసింగ్ అనే రాజు నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆలయం 20 శతాబ్దపు మొదట్లో పునర్నిర్మించారు. మొఘలుల శిల్పకళానైపుణ్యం ఇక్కడి గోడల మీద ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆలయం ముందు భాగమంతా పాలరాతి వైభవంతో విరాజిల్లుతుంది ఆలయానికి వెండి ద్వారాలు, నగిషీలు చెక్కిన పాలరాతిని హైదరాబాద్కు చెందిన కర్ణి ఆభరణ తయారీదారులు ఇచ్చినట్టు కథనాలు ఉన్నాయి.

ఆలయంలోనే దాదాపు 20 వేలకు పైగా ఎలుకలు ఉన్నాయి. ప్రసిద్ధ ఎలుకలను కబ్బాలు అని పిలుస్తారు. ఎలుకలు దైవత్వ ఎలుకలుగా గ్రామస్థులు పూజిస్తారట. భక్తుల రాకపోకలకు ఏమాత్రం జంకకుండా అవి స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. భక్తుల పాదాల మీదుగా పరుగులు తీస్తుంటాయి. భక్తులు పెట్టిన నైవేద్యాలను, పాలు, పెరుగు, పండ్లు, స్వీట్లు ఆరగిస్తుంటాయి.

ఆలయం గురించి రెండు కథనాలు చెబుతారు.

మొదటి కథ

కర్ణిమాతా పెంపుడు కుమారుడు లక్ష్మణ్ యొక్క కథ ప్రకారం అతడు కోలయత్ తెహసీల్ లోని కపిల్ సరోవర్ వద్ద సరస్సులో నీరు త్రాగు ప్రయత్నంలో పడిపోతాడు. కర్ణిమాత యమునితో అతన్ని కాపాడమని కోరుతుంది. మొదట తిరస్కరించినా చివరికి మనసు మార్చుకొని లక్ష్మణ్ తో పాటు కర్ణిమాత యొక్క మగ సంతానాన్ని ఎలుకలుగా  మార్చి పునర్జన్మ యిస్తాడు.

కర్ణిమాత బాల్యం నుంచి దుర్గాదేవి ఉపాసకురాలు. ఈమె 150 సంవత్సరాలు జీవించిందని తెలుస్తోంది. పుట్టుకతోనే ఈమెకు అతీంద్రియ శక్తులు ఉండేవని ప్రచారం. తనకున్న శక్తులతో పేదలు, భక్తుల సమస్యలు పరిష్కరించేదని ప్రతీతి. అందుకే ప్రజలు ఆమెను దేవతలా కొలవడం ప్రారంభించారు. ఒకరోజు ఆమె ఆకస్మాత్తుగా తన ఇంట్లోనే అదృశ్యమైంది. ఎవరికీ కనిపించలేదు. ఆమెకు అక్కడే ఆలయం నిర్మించి, నాటి నుంచి పూజలు జరిపారు. కొంతకాలానికి భక్తులతో ఆమె మాట్లాడుతూ తమ వంశస్థులంతా త్వరలోనే చనిపోతారని, వారంతా ఎలుకలుగా జన్మించి ఇక్కడే ఉంటారని, వారికి అన్నపానీయాలు సమర్పించి ధన్యులు కమ్మని ప్రజలకు చెప్పిందట.

సమయంలో కర్ణిమాత వంశంలో దాదాపు 600 కుటుంబాలు ఉండేవట. మాత చెప్పిన విధంగానే కొన్ని రోజులకు కుటుంబాల వారంతా మరణించడం, తర్వాతే ఆలయంలో ఎలుకలు గుంపులు గుంపులుగా రావడం చూసిన వారంతా కర్ణిమాత వంశీయులే ఎలుకలుగా మారారని భావించారు. నాటినుంచే ఎలుకలను కర్ణిమాతతో సమానంగా పూజించడం మొదలుపెట్టారట.

రెండవ కథ

కథ ప్రకారం 20 వేల మంది బలమైన సైన్యం ఒకానొక యుద్ధంలో ఓడిపోయి, పారిపోయి దేష్నోక్ గ్రామానికి చేరుకుంది. ఇక్కడికి వచ్చాక యుద్ధం నుంచి పారిపోవటం మహాపాపమని, దానికన్నా మరణమే మేలు అని తెలుసుకున్న వారు తమకు తామే మరణశిక్ష విధించుకున్నారు. కర్ణిమాత వారి ఆత్మహత్య దోషం పోవడానికి ఆలయంలో ఎలుకలుగా ఉండిపొమ్మని చెప్పిందట. సైనికులంతా కర్ణిమాతకు తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ అక్కడే ఉండిపోయారట. అలా మానవులే ఎలుకలుగా పునర్జన్మ ఎత్తినట్టుగా భావిస్తారు.

తెల్లని ఎలుకలు దేవతాస్వరూపాలు...

వేల కొలది నల్లని ఎలుకల మధ్య కొన్ని తెల్లని ఎలుకలు కనిపిస్తాయి. ఇవి కనిపించడానికి కారనం తెలిపే మరో కథ కూడా ప్రచారంలో ఉంది. కర్ణిమాతకు ముగ్గురు పిల్లలు పుట్టి పురిట్లోనే కన్నుమూశారు. దీంతో ఆమె తన భర్తకు సొంత చెల్లెలినే ఇచ్చి వివాహం చేసింది. వారి కుమారుడు ఒకసారి ఆడుకుంటూ కపిల్ సరోవర్లో పడి చనిపోయాడు. కర్ణిమాత బిడ్డ ప్రాణాలను ఇవ్వమని యముడిని వేడుకుంది. యముడు ఆమె ప్రార్థనలకు కరగలేదు. కర్ణిమాత దుర్గాదేవి అనుగ్రహంతో కుమారుడిని బతికించుకుంది. అంతేకాదు కుమారుడితో పాటు ఆమె మిగతా ముగ్గురు బిడ్డలూ తిరిగి బతికారట. ఆలయంలో కనిపించే నాలుగు తెల్లని ఎలుకలు కర్ణిమాత బిడ్డలేనని, నాలుగు ఎలుకలు కనిపించిన వారికి కర్ణిమాత పూర్తి ఆశీస్సులు లభించినట్టే అని భక్తుల నమ్మిక. అందుకే నాలుగు తెల్లని ఎలుకలు కనిపించేదాక భక్తులు అక్కడే కూర్చొని ఓపికగా ఎదురుచూస్తుంటారు. అయితే, తెల్ల ఎలుకలు ముఖ్యమైన వేడుకలలో మాత్రమే కనిపించడం విశేషం

ఎలుకలకు ఆహారం ఇవ్వడం గొప్ప వరంగా భక్తులు భావిస్తారు. అయితే, ఆలయంలో పొరపాటున ఎవరి వల్లనైనా ఎలుక చనిపోతే వారు అంతే బరువు గల వెండి ఎలుకలను ఆలయానికి ఇచ్చి దోషాన్ని పోగొట్టుకోవాలి

అమ్మవారి ఎదుట ఎలుకలున్న నైవేద్యాన్నే భక్తులకు ప్రసాదంగా పంచుతారు.

Image Credits: To those who took the original photos.

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి