4, అక్టోబర్ 2020, ఆదివారం

మాస్టారు…..(కథ)

 

                                                                                      మాస్టారు                                                                                                                                                                       (కథ)

బస్సు నుండి దిగిన వెంటనే చల్ల చల్లటి గాలి శరీరానికి తగలగానే పరవసించిపోయాడు వెంకట్ అనే వెంకటా చలపతి.

నాలుగు సంవత్సరాల గ్యాప్ తరువాత తన సొంత ఊరైన టంగుటూరులో కాలు మోపుతున్నప్పుడు మనసులో ఏదో తెలియని ఆనందం తాండవం ఆడింది.

గాలితో కలిసిన మట్టివాసన మధ్య కురిసిన వాన అతని నసాలాలంలోకి దూరి జ్ఞాపకాలను గుర్తు చేసింది.

వెంకటా చలపతి రాకను   ఇల్లే పండుగ చేసుకుంది.

" ఏమోయ్ సీతాలక్ష్మీ...మన అబ్బాయి వెంకట్ వచ్చాశాడే..." తండ్రి ఏడుకొండలు తన కొడుకును చూసిన ఆనందంలో కోలాహలం తో ఉండగా, ఎనిమిది గజాల లేపాక్షీ చీర కట్టుకుని, రూపాయ్ బిల్లంత కుంకుమ బొట్టు పెట్టుకున్న సీతాలక్ష్మీ గబగబ మని పరిగెత్తుకుంటూ వచ్చింది. 

"నాయనా...ఎప్పుడయ్యా వచ్చావు... తల్లిని చూడకుండా నువ్వు ఎలా ఉండగలిగావు...? పాపం, నా కొడుకు పూచిక పిల్లలాగా చిక్కిపోయాడు. కాసేపుండవయ్యా...దిష్టి తీస్తాను. ఊర్లో ఉన్న వాళ్ళందరి కళ్ళూ నీమీదే పడుంటాయి..." అని చెబుతూనే హారతి పళ్లెం తీసి దిష్టి తీసింది.

"అన్నయ్యా...ఎలా ఉన్నావు...?" ప్రేమతో అన్నయ్యను కౌగలించుకుంది ముద్దుల చెల్లెలు.

"బాగున్నానురా...టౌన్లో ఉన్న కాలేజీకి బస్సు ఎక్కి వెళ్ళటం కష్టంగా ఉన్నదని చెప్పావుగా...అందుకొసం అన్నయ్య నీకు 'స్కూటీ' ఆర్డర్ చేశానురా...రేపు వస్తుంది"

"వావ్..." ఎగిరి గంతులువేసింది.

తనని ఎవరో ఓర కంటితో చూస్తున్నట్టు వెంకట్ కు అనిపించగా అది అతని అత్త కూతురు సుందరి యొక్క చూపు అని గ్రహించాడు. ఆమెను చూసిన వెంటనే పరవసించిపోయాడు.

వెంకట్ కు, సుందరికి వచ్చే మాఘ మాసంలో తాంబూలాలు పుచ్చుకోవాలని పెద్దలు నిర్ణయించారు.

"అయ్యా...నువ్వు మొదట్లో పంపు సెట్టు దగ్గరకు వెళ్ళి స్నానం చేసిరావయ్యా. అమ్మ నీకిష్టమైన గుత్తి వంకాయ కూర, అల్లం పచ్చడి, ములక్కాడ ముక్కల పులుసు చేస్తాను...అలాగే మన దొడ్లో పండిన దోసకాయతో దోస ఆవకాయ వేశాను..."

తల్లి చెప్పిన వెంటనే నోరూరింది. వేగంగా వెళ్ళి స్నానం చేసి వచ్చి భోజనానికి కూర్చుని ఒక పట్టుపట్టాడు వెంకట్.

తరువాత సూట్ కేసు ఒకటి తెరిచి, అందులో ఉన్న మూడు లక్షల రూపాయలు తీసుకుని బయలుదేరటానికి సిద్దమయ్యాడు.

"వెంకట్...ఎక్కడకయ్యా బయలుదేరుతున్నావు?"

"నాన్నా...మన గోపాల్ రావ్ మాస్టారును చూసి, డబ్బు ఇచ్చేసి వద్దామని..."

"చాలా మంచిదబ్బాయ్... దైవాన్ని చూడటానికి నేనూ నీతో వస్తానయ్యా..." అన్న ఆయన, కాళ్ళకు చెప్పులు వేసుకున్నాడు. తండ్రీ-కొడుకులిద్దరూ బయలుదేరి వెళ్ళారు.

వెంకటా చలపతికి దారి పొడుగునా మాస్టారు గురించిన జ్ఞాపకలే పరిగెత్తినై.

గోపాల్ రావ్ మాస్టారు,-- ఈశ్వరపురం గవర్నమెంట్ స్కూల్లో లెక్కల టీచర్. సరళానికి చిహ్నం. విద్యార్ధులకు పాఠాలు ఈజీగా అర్ధమయ్యేలాగా చెప్పటం ఆయన మేధస్సు. 

"స్టూడెంట్స్...ఎవరెస్టు శిఖరం యొక్క ఎత్తు 8,848 మీటర్లు. దీన్ని మీరు చాలా ఈజీగా ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలంటే ఎనిమిది ఎనిమిదిగా నాలుగుసార్లు ఎనిమిదిని గుర్తుంచుకుంటే చాలు. అర్ధమయ్యిందా...?"----చాలా అందంగా ఈజీగా జ్ఞాపకం ఉంచుకునేలా సూక్ష్మంగా చెప్పే గోపాల్ రావ్ మాస్టారు అంటే అతనికి చాలా ఇష్టం.

మాస్టారు గోపాల్ రావ్ - చారుమతి దంపతులకు ముగ్గురు వారసులు. మొదటివాడు శివాజీ. చదువులో అంతంత మాత్రమే. సంగీతం మీద చాలా ఇంటరెస్టు కలిగినవాడు. రెండోది కోకిలా. మూడోది పద్మావతి. ఇందులో పద్మావతి కి ఒక కాలు పొట్టిగా ఉంటుంది.

చారుమతికి ఎంతో కొంత చదువు, జ్ఞానం ఉండటంతో ముగ్గురు పిల్లలనూ 'కాన్వెంట్' లో చేర్చాలని పట్టుపట్టింది.

"కాన్వెంట్ ఎందుకు...? నేను పనిచేస్తున్న గవర్నమెంట్ స్కూల్లోనే చేర్చేద్దాం..." -- గోపాల్ రావ్ మాస్టారి జవాబు.

"ఏమిటీ...? గవర్నమెంట్ స్కూలా...?"--ఏదో అసహ్యాన్ని తొక్కిన దానిలాగా మొహాన్ని వికారాంగా ఉంచుకుంది.

"ఏం...? 'గవర్నమెంట్ స్కూల్ అంటే అంత చవుకగా ఉందా...? ఎంతోమంది మేధావులు అక్కడే నే చదువుకుంది..."

గోపాల్ రావ్ మాస్టారు జవాబుతో కొంచం ఇబ్బంది పడ్డా పట్టుదల అనే ఆయుధంతో విజయం సాధించింది చారుమతి.

'ఇంటర్ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినై. జిల్లాలోనే మొదటి స్టూడెంటుగా 600 మార్కులకు 597 మార్కులు తెచ్చుకుని వెంకటా చలపతి పాసవటంతో గోపాల్ రావ్ మాస్టారు చాలా ఆనందించారు. ఆయన కొడుకు శివాజీకి 600 మార్కులకు 310 మార్కులు మాత్రమే వచ్చినై.   

శివాజీ ఇష్టపడినట్టు వాడిని సంగీత కళాశాలలో చేర్చాలనుకున్న గోపాల్ రావ్ మాస్టారు ఆలొచనకు అడ్డుపడింది చారుమతి.

"ఏవండీ...మ్యూజిక్ చదివి, మీ కొడుకు ఏమైనా బాలమురళి కృష్ణ లాగా అవుతాడా...? నేను చెప్పింది చెయ్యండి. బ్యాంకులో దాచుకున్న డబ్బు తీసి వాడ్ని 'బి.' చదివించండి".

"'బి. నా?' మనవాడు కేవలం 310 మార్కులే తెచ్చుకున్నాడు. వాడికి 'బి.' సీటు రాదు. వాడికి మ్యూజిక్ అంటేనే ఇష్టం. వాడి ఇష్టానికి శత్రువుగా నేను రోజూ నిలబడను...".---ఖచ్చితంగా తన నిర్ణయాన్ని చెప్పి బయటకు వచ్చిన గోపాల్ రావ్ మాస్టారుకు దారిలో వెంకటా చలపతి, అతని తండ్రి కనబడ్డారు.

"నమస్తే మాస్టార్..."

"నమస్తే...ఏం వెంకట్. కాలేజీలో చేరాలని నీ ఉద్దేశం? 'బి.' కౌన్సలింగ్ అయిపోయిందే...?”--ఆయన అడుగగా...కళ్ళల్లో నీళ్ళతో నిలబడ్డాడు వెంకట్.

"ఎక్కడ మాస్టారూ...వీడు చదవాలనుకున్న చదువుకు మూడు లక్షలు అవుతుందని చెబుతున్నారు. అంత డబ్బుకు పేద రైతు ఎక్కడికి వెళ్ళగలను...? ప్రెశిడెంట్ గారు లేదని చెప్పారు...అందుకని ఆయన ఫ్యాక్టరీలోనే లెక్కలు చూసే గుమాస్తాగా వెంకట్ని చేర్చుకోమని అడగాలనుకుంటున్నాను..." భవ్యంగా  వెంకట్  తండ్రి చెప్పగా, మాష్టారు వేగంగా అడ్డుపడ్డాడు.

అలా ఏదైనా చేసి అతని జీవితాన్ని నాశనం చేయకండి. మీరు ఇంటికి రండి. కొంచంసేపట్లో నేనూ వస్తాను..."---ఏదో నిర్ణయించుకున్న వారిలాగా చెప్పటంతో...కన్ ఫ్యూజన్ తో ఇద్దరూ వాళ్ళింటికి వెళ్ళారు.

కాసేపట్లో మాస్టారు ఇంటికి వచ్చారు. తాను తీసుకు వచ్చిన పసుపు రంగు సంచీతీసి అందులో ఉన్న మూడు లక్షల రూపాయలు  వెంకట్ నాన్న దగ్గర ఇచ్చి "వాడ్ని బాగా చదివించండి చదువుకునే పిల్లాడు రోజూ కష్ట పడకూడదు..." మాస్టారు మనసు కరిగేలాగా మాట్లాడటంతో...సాష్టాంగంగా ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడు వెంకట్.

సంవత్సరాలు దొర్లినై.

అతను బాగా చదివి కాలేజీ క్యాంపస్ ఇన్ టర్ వ్యూలో సెలెక్ట్ అయి ఢిల్లీ లోని ఒక పెద్ద విదేశీ కంపనీలో మంచి జీతంతో ఉద్యోగంలో చేరాడు.

దృశ్యాలు మారినా--- గోపాల్ రావ్ మాస్టారును అతను మరువలేకపోయాడు.

మామూలు కంటే రోజు ఇంట్లో ఎక్కువ జనం బయట నిలబడటం చూసిన వెంకట్ గందరగోళ పడ్డాడు. 

"అయ్యో మహారాజా...మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా..."----ఆడవారి ఏడుపులు వినబడటంతో వెంకట్ మనసును ఎవరో పిండుతున్నట్టు ఒక నొప్పి.

గోపాల్ రావ్ మాస్టారు ప్రాణం మట్టిని వదిలి విడిచిపోయింది.

వెంకట్ కు, అతని తండ్రికి షాక్.

చారుమతి చుట్టూ అప్పులవాళ్ళు గుమికూడారు.

"ఏమిటయ్యా ఇది...శవం కూడా ఇక్కడ్నుంచి వెళ్ళలేదు. ఇంతలోనే డబ్బులు అడుగుతున్నారే...?" తలమీద కొట్టుకుంటూ ఏడుస్తోంది చారుమతి.

మాస్టారు తన రెండో కూతురు కోకిల పెళ్ళికి బయట అప్పు తీసుకున్నారు. శివాజీ సంగీత కళాశాలలో ప్రొఫసర్ గా పనిచేస్తూ ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.  అప్పట్నుంచీ సగం చనిపోయిన వ్యక్తిలాగా అయిపోయాడు మాస్టారు. చేతిలో డబ్బులు లేవు. కొడుకు చనిపోయిన దుఃఖంతో ఆయనా చనిపోయాడు.

ఇవన్నీ చుట్టు పక్కలున్న వాళ్ళను అడిగినప్పుడు వెంకట్ కు దొరికిన వివరాలు.

" చారుమతి. అప్పులను ఎలా తీర్చబోతోందో?"

"అప్పును పక్కన పెట్టవే...వాళ్ళ చివరి అమ్మాయి పద్మావతికి ఒక కాలు వికలాంగం. ఎలా పెళ్ళిచెయ్యబొతుందో...?"

చారుమతి చెవులకు వినబడేటట్టు ఊర్లోని కొందరు మాట్లాడటం మొదలు పెట్టారు.

ఇవన్నీ గమనించిన వెంకట్ తీర్మానంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు.

చారుమతి చుట్టూ గుమికూడిన అప్పుల వాళ్ళను పిలిచి వాళ్ళకు ఇవ్వాల్సిన డబ్బును ఇచ్చాడు.

తరువాత చారుమతి ముందు కూర్చున్నాడు. "మీ అమ్మాయిని నేను పెళ్ళి చేసుకుంటాను..." అని చెప్పాడు. మాస్టారు తనకు చేసిన సహాయాన్ని క్లుప్తంగా చెప్పి ముగించాడు.

వెంకట్ తండ్రికి మొదట్లో అతని నిర్ణయం షాక్ గా ఉన్నా, ఆలొచించి చూసినప్పుడు అదే కరక్టే అనిపించింది.

చారుమతికి మనసు నిండిపోయింది.

వెంకటా చలపతికి  ఒక్క క్షణం తన అత్తయ్య కూతురు సుందరి ముఖం జ్ఞాపకానికి వచ్చి కనుమరుగు అయ్యింది. "నిజమైన ప్రేమ...సంధర్భ పరిస్థితులను అర్ధం చేసుకుంటుంది" అని ఖచ్చితంగా నమ్మాడు.

గోపాల్ రావ్ మాస్టారు చివరి యాత్రను స్టూడెంట్స్ ముందుండి నడపగా ఆయన ఆత్మ శాంతి చెందింది.

*****************************************సమాప్తం***********************************************

ఇవి కూడా చదవండి:

కరోనా వైరస్ వ్యాప్తికి కారణం!?(న్యూస్/ఆసక్తి)

ఈ బొమ్మలో ఏముంది?(మిస్టరీ) 

********************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి