5, అక్టోబర్ 2019, శనివారం

తొలివలపు (సీరియల్)...PART-20



                                                తొలివలపు….(సీరియల్)
                                                             (PART-20)

చేదైన తన పాత జీవితం గురించి గాయత్రి చెప్పి ముగించినప్పుడు అది వింటున్న హృదయాలన్నీ శోక మయం అయినై.

తన ఆవేదనలో నుండి బయటపడలేక తల వంచుకుని కూర్చోనున్న ఆమె దగ్గరకు చేరుకుని ఓదార్పుగా ఆమె భుజం మీద చెయ్యివేశాడు రమేష్.

ఆ స్పర్శ గ్రహించి గబుక్కున తలపైకెత్తింది. చటుక్కున ఆ చేతిని తోసి పారేసింది. కోపంతో లేచి అతని మొహంలోకి చూసి అతని మొహానికి ఎదురుగా వేలు జాపి హెచ్చరిస్తున్నట్టు చెప్పింది.

"మిస్టర్ రమేష్. మీరు జాలి పడాలని ఎదురుచూసి నేను ఇవన్నీ చెప్పలేదు. ఒకవేల నా గురించిన నిజాలు మీకు తెలిస్తే, నా దారికి మీరు అడ్డు రారనే నమ్మకంతోనూ, ఇకనైనా జానకి మీ మీద పెట్టుకున్న ప్రేమను మీరు అర్ధం చేసుకుని ఆమె ప్రేమను అంగీకరిస్తారనే నమ్మకంతో నా గురించి అంతా చెప్పాను"

బయట నిలబడి గాయత్రి చెప్పిందంతా విన్న జానకి ఏడుస్తూ, తూలి పడబోతూ గోడకు అతుక్కుపోయింది.

లోపల గాయత్రి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది.

"మీకు ఒకటి తెలుసా రమేష్? జానకి ఎవరనేది వాళ్ళింటికి నేను వెళ్ళినప్పుడే నాకూ తెలిసింది. అమే నా చెల్లెలు అని తెలిసినప్పుడు అలాగే ఆమెను కౌగలించుకోవాలని అనిపించింది. ఈ ప్రపంచానికే వినబడేటట్టు...నేను అనాధను కాను అని గట్టిగా అరవాలనిపించింది. దాన్ని మా ఇంటికి పిలుచుకు వచ్చి నాతో పాటూ ఉంచుకుందామని అనుకున్నాను.

కానీ...ఏం చెప్పి నేను నన్ను జానకి దగ్గర పరిచయం చేసుకోను? చెప్పండి? ఇదిగో ఇదే చేతులతో ఆమె తల్లిని చంపాను. ఆమె తల్లి యొక్క పేగు బంధం అనుబంధాన్ని తెంపి ఆమెను అనాధను చేసిన పాపిని నేను. ఇవన్నీ జానకికి తెలిస్తే ఆమె నన్ను ఎలా క్షమిస్తుంది? వద్దు రమేష్. నేను ఎవరనే నిజం ఎప్పటికీ ఆమెకు తెలియకూడదు. ఎందుకంటే ఆమెను మరొసారి పోగొట్టుకొటానికి నేను రెడిగా లేను. నాకు ఆమె కావాలి. ఈ ప్రపంచంలో నాకు సొంతం అని చెప్పుకోవటానికి ఆమె ఒకత్తైనా కావాలి.

జానకిని పెళ్ళి చేసుకోమని నేను మిమ్మల్ని ఒత్తిడి చేయటానికి కారణం ఉంది. మీ గురించి నాకు ఏమీ తెలియదు. కానీ, మీరు మంచివారని మాత్రం నాకు కచ్చితంగా తెలుసు. నా చెల్లెల్ను సంతోషంగా చూసుకుంటారని అర్ధమవుతోంది. ఇది మాత్రమే కాదు...అది ఎవరినో పెళ్ళిచేసుకుని...ఎక్కడికో వెళ్ళటం కంటే...ఆమె ప్రేమిస్తున్న మిమ్మల్నే పెళ్ళిచేసుకుంటే, దూరం నుండైనా ఆమెను రోజూ చూస్తూ రోజులు గడుపుతూ ఉండిపోతాను.

నా ఆస్తి మొత్తం మీ పేరు మీద రాసి ఇచ్చేస్తాను. జానకి మెడలొ మీరు తాళి కడితే చాలు. ఆమె మీ మీద, నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ప్లీజ్...నన్ను అర్ధం చేసుకోండి. నా చెల్లెల్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పండి"

చెల్లెలు కోసం తన దగ్గర బ్రతిమిలాడిన గాయత్రి దగ్గర నుండి దూరంగా జరిగి గాయత్రిని చూసి విరక్తిగా నవ్వాడు రమేష్.

"గాయత్రీ, నువ్వు ఎంత పెద్ద మేధావివో అంత పెద్ద తెలివితక్కువ దానివి కూడా!"- అన్న రమేష్ ని ఆశ్చర్యంతో చూసింది గాయత్రీ.

"లేకపోతే ఏమిటి...? ఇంతకు ముందే పెళ్ళైన ఒకడికి మీ చెల్లెల్ను ఇచ్చి పెళ్ళిచేస్తానని ఇలా మొండికేస్తున్నారే! దీన్ని తెలివితక్కువ తనం అని చెప్పకుండా ఇంకేమని చెప్పాలి? నువ్వు నన్ను చూడటానికి నా గదికి వచ్చినప్పుడే నా భార్యను నీకు పరిచయం చేసానే...మరిచిపోయావా గాయత్రీ?"

"నేను ఇంత దూరం చెబుతున్నా నువ్వు నా మాట వినటం లేదు కదూ...అయితే సరే. నేను ప్రాణాలతో ఉంటేకదా సమస్య! ఇప్పుడే దీనికి ఒక ముగింపు పెడతాను" అంటూ జరిగింది గాయత్రి.

గాయత్రి అన్న చివరి మాటకు ఆందోళన చెందిన జానకి లోపలకు వెళ్ళడానికి ప్రయత్నించేటప్పుడు రమేష్ నోటి నుండి వచ్చిన మాటలు విని అలాగే నిలబడిపోయింది. అక్కడే ఉన్న బాలాజీ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు.

"ఒక్క నిమిషం గాయత్రీ. జీవితంలో మనం ఒకటిగా చేరలేకపోతే ఏం...చావు మనల్ని చేర్చనీ! రా... ఇద్దరం కలిసే చచ్చిపోదాం" అన్నాడు ఆమె దగ్గరకు జరిగి.

గబుక్కున అతని చొక్కా కాలర్ పుచ్చుకుంది గాయత్రి.

"ఎవరురా నువ్వు? నిజం చెప్పు. ఎందుకు నన్ను వెంబడిస్తూ వచ్చి ఇలా గొడవ పెడుతున్నావు? నీకూ, నాకూ సంబంధమే లేనప్పుడు చావు గురించి మాట్లాడుతున్నావు... నీ మూర్ఖత్వానికి హద్దే లేకుండా పోయింది "

"నీకూ, నాకూ సంబంధం ఉంది గాయత్రీ" అన్నాడు, ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ.

తన పట్టుదలని సడలించుకుని వేనక్కు జరిగి అతన్ని అర్ధంకానట్లు చూసింది గాయత్రి.

"దేవుడు మన ఇద్దరికీ భార్యా-భర్త అనే ముడివేసి ఇరవై సంవత్సరాలు ముగిసిపోయింది. మన ఇంటి పెద్దలు కలుసుకుని, మాట్లాడుకుని, నిర్ణయించుకుని మన ఇద్దరికీ ఇలాంటి బంధుత్వాన్ని ఏర్పరచి వెళ్ళింది నువ్వు మరిచిపోయుండవని అనుకుంటాను"

'కొవ్వు ఏక్కిన కుక్కా! ఇద్దరూ కలిసి పారిపోదామని పధకం వేస్తున్నారా? నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అలా జరగనివ్వనే. నీకొసం నేను నిశ్చయం చేసిన పెళ్ళికొడుకుకే నువ్వు తల వంచాలి. కాదు- కూడదూ అంటూ ఇంకేదైనా జరిగితే...?'తల్లి శకుంతలాదేవి మాటలు గుర్తుకువచ్చి,'అలాగైతే ఇతను?'...కళ్ళు గట్టిగా మూసుకుంది గాయత్రి.

ఆమె ఆలొచనలను చెదరగొట్టే విధంగా తన మాటలను పొడిగించాడు రమేష్.

"మొదట్లో మన పెళ్ళి నాకు ఇష్టం లేదు. అప్పుడు నేను కాలేజీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. మా బామ్మ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని నా భవిష్యత్తు గురించో, నా సొంత ఇష్టాల గురించో ఆలొచించని నా కుటుంబం అంటే నాకు కోపం వచ్చింది. 'కొన్ని రోజులలో చావబోయే బామ్మకొసం నా కలలను గొయ్యి తవ్వి పూడ్చిపెట్టకండి’ అని ఎంతో చెప్పి చూశాను. ఊహూ...చివరకు బామ్మ మొండితనమే గెలిచింది. మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి నిశ్చయతార్దం ముగించుకుని వెళ్ళిన మీ అమ్మ మీద కోపం వచ్చింది.

ఆ తరువాత, మన ఇద్దరికీ జరగబోయే పెళ్ళిని ఎలా ఆపాలా అని నేను ఆలొచిస్తున్నప్పుడు, మీ అమ్మగారు చనిపోయారనే వార్త 'బ్రోకర్’ ద్వారా మాకు తెలిసింది. నిశ్చయతార్దం ముగిసిన వెంటనే ఇలాంటి శోకం చోటుచేసుకుందే, అనే బాధతో...అదే వారంలో మా బామ్మ కూడా చనిపోయింది.

జరిగిన సంఘటనలకు ఒక వైపు బాధపడుతున్నా, ఇంకో వైపు పెద్ద ఇబ్బంది నుండి తప్పించుకున్నాను అని సంతోష పడ్డాను. పెళ్ళి గురించిన విషయాలు మాట్లాడటానికి మీ ఇంటి నుండి ఎవరూ రాకపోవటంతో నేను ప్రశాంతంగా ఉన్నాను.

చదువు ముగించాను. నేను ఆశ పడినట్లే పోలీసు అధికారి అయ్యాను. మా ఇంట్లో నాకు మళ్ళీ పెళ్ళి ఏర్పాట్లు మొదలు పెట్టారు. కానీ, నాకు దాంట్లో పెద్దగా ఇష్టం లేదు. కారణం ఇదే" అంటూ తన పర్స్ లోని ఒక ఫోటోను తీసి గాయత్రి ముందు జాపాడు.

ఆ ఫోటో తీసుకుని చూసి ఆశ్చర్యపోయింది. రెండు జడలతో, లంగా వోణి తో, నవ్వుతూ ఉన్నది చిన్న వయసు గాయత్రి. మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు రమేష్.

"ఎందుకో తెలియలేదు గాయత్రీ...మా ఇంట్లో నా పెళ్ళి మాటలు ఎత్తినప్పుడు నాకు నిన్నే చూడాలని అనిపించింది. మీ గురించి తెలుసుకుందామని మీ ఊరు వెళ్ళాను. మీ నాన్నను పోలీసులు ఖైదు చేసి తీసుకు వెళ్ళేరని చెప్పేరే గానీ నీ గురించి ఎవరి దగ్గరా సరైన వివరం దొరకలేదు. ఏదో పోగొట్టుకుని తిరిగి వచ్చినట్లు అనిపించింది. నాకు ఒక విషయం మాత్రం అర్ధం కాలేదు. పెళ్ళి వద్దని చెప్పిన నేను, నీ ఫోటోను మాత్రం ఎందుకు బద్రపరుచుకున్నాను? ఎంతో మంది ఆడపిల్లలు నన్ను చేసుకోవాలని ముందుకు వస్తున్నా వాళ్ళల్లో ఎవరూ ఎందుకు నాకు నచ్చ లేదు. నా భార్య అనే చోట్లో మిమ్మల్ని తప్ప ఎవర్నీ ఊహించుకోలేక పోయాను...ఎందుకో? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఏమయ్యావు? నీకు పెళ్ళి అయ్యిందా? బ్రతికే వున్నావా?...అలా మీ గురించి ఏమీ తెలియకపోయినా ఏ ధైర్యంతో, ఏ నమ్మకంతో మిమ్మల్ని వెతకటం నేను మొదలు పెట్టేను?

ఈ ప్రశ్నలన్నిటికీ నాకు సమాధానం తెలియదు గాయత్రి. కానీ, ఒకటి మాత్రం కచ్చితంగా తెలుసు. నాకు నువ్వే, నీకు నేనే అని ఆ దేవుడు వేసిన మూడు ముళ్లనూ ఎవరూ విడదీయలేరు. మనం ఒకటిగా చేరటమనేదే విధి. లేకపోతే, నాకు పెళ్ళి చేసి చూడాలని ఎందుకు నా బామ్మకు అనిపించింది? మా ఇళ్లు వెతుక్కుని మీ అమ్మ ఎందుకు వచ్చింది? చెప్పండి.

ప్లీజ్...గాయత్రీ! నన్ను అర్ధం చేసుకోండి. మనం ఒకర్ని ఒకరు చూసుకున్న తరువాత కూడా ఒకటవలేదంటే మీ అమ్మగారి కొరిక మాత్రమే కాదు...మీ నాన్నకు నేను చేసిచ్చిన ప్రామిస్ కు కూడా అర్ధం లేకుండా పోతుంది"

"ఏ..ఏం...చెప్పారు? మా నాన్నను చూశారా? ఎక్కడ చూశారు... ఎప్పుడు చూశారు? చెప్పండి రమేష్" ఆదుర్దాగానూ, సంతోషంగానూ అడిగింది గాయత్రి.

ఇంకా ఉంది.....Continued in: PART-21


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి