1, అక్టోబర్ 2019, మంగళవారం

తొలివలపు (సీరియల్)...PART-18


                                                తొలివలపు….(సీరియల్)
                                                            (PART-18)


భార్య మరణం బాపిరాజు గారిని నడిచే శవంలాగా తయారుచేసింది. అంచెలంచెలుగా సమస్యలు. కొలవటం వీలుకాని శోకం అంటూ ఆ ఇల్లే విధి ఆడిన ఆటవలన చిన్నాభిన్నం అయ్యింది. ఇదేమీ చాలదన్నట్లు శకుంతలాదేవి చనిపోయిన పదమూడో రోజు కార్యం ఎప్పుడు పూర్తి అవుతుందా అని కాచుకోనున్నట్లు, బాపిరాజు గారి ఇల్లు వెతుక్కుంటూ ప్రమీల పెట్టెతో వచ్చింది. ఊరి ప్రజలను పిలిచి శోకాలు పెట్టింది. బాపిరాజు గారు ప్రమీలను ఏలుకోవాలని పంచాయతి తీర్పు ఇచ్చింది. ఇష్టంలేకపోయినా ప్రమీల మెడలో తాళి కట్టారు బాపిరాజు గారు.

ఒక పక్క కూతురు మొహాన్ని చూడటానికి శక్తి లేక, మరో పక్క ప్రమీల ముఖం చూడటానికి ఇష్టంలేక రోజులో ఎక్కువ సమయం గుడిలోనే గడుపుతున్నారు బాపిరాజు గారు. ప్రెశిడెంట్ పోస్టు తానుగా ఆయన్ని విడిచి వెళ్ళిపోయింది. ఊరు వేసే నిందలను పట్టించుకోకుండా...ప్రియమైన భార్యకు తాను చేసిన ద్రోహాన్ని తలచుకుని లోలోపల ఏడుస్తూ రోజులు గడుపుతున్నారు. తండ్రిని మామూలు స్థితికి తీసుకురావటానికి తాను చేసిన ప్రతి ప్రయత్నంలోనూ ఒటమినే చవిచూసింది గాయత్రి. వీటి గురించి ఎటువంటి బాధ పడకుండా రోజులను ఆనందంగా గడుపుతోంది ప్రమీల. తాను అనుకున్నది సాధించినట్లు సంతోషంతో ఆమె గర్వంగా ఫీలవుతోంది. ఏదో ఆ ఉరికే మహారాణి అయిపోయినట్లు దర్జాగా రోజుకో పట్టుచీరతో తిరుగుతోంది.

రాత్రి-పగలు మారి మారి దోబూచులాడటంతో రోజులు ఒక్కొక్కటీ జరిగిపోతున్నదే తెలియలేదు.

అందమైన ఆడపిల్లకు తల్లి అయ్యింది ప్రమీల.

ఆ తరువాతే ఆమెలో చాలా మార్పులు కనబడ్డాయి.

శకుంతలాదేవి ఉన్నప్పుడు వాకిటి వరకే వచ్చి, అట్నుంచే తిరిగి వెళ్ళే వెంకన్న, ఇప్పుడు ఇంటిలోపలకు వచ్చేంత సన్నిహితుడయ్యాడు. పిల్ల ఏడుపును కూడా పట్టించుకోకుండా వాడితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది ప్రమీల. అలాంటి సమయాలలో గాయత్రినే పరిగెత్తుకు వెళ్ళి ఏడుస్తున్న పిల్లను ఎత్తుకుని సమాధాన పరుస్తుంది. ఒక తల్లి ప్రేమనూ, స్పర్షనూ గాయత్రి దగ్గర నుండి గ్రహించగలిగింది ఆ పసిపిల్ల. ఆ పసిపిల్ల ఆటలతో తన శోకాన్ని మరిచింది గాయత్రి. ఇంట్లో పనులు ముగించుకుని, మిగిలిన సమయాన్నంతా చెల్లితో గడిపేది గాయత్రి.

చివరగా అన్నిటికీ కలిపి ఒక ముగింపు వచ్చే విధంగా అలాంటి ఒక సంఘటన జరుగుతుందని ఎవరూ ఎదురు చూడలేదు.

ఆ తెల్లవారు జామున నిద్ర గాయత్రీని వదిలి వెళ్ళిపోయింది. లేవటం ఇష్టం లేక దుప్పట్లోనే ముడుచుకుపోయిన ఆమెకు ఎవరివో మాటలు వినబడటంతో గబుక్కున లేచి మాటలు వినబడ్డ వైపు నడవటం మొదలుపెట్టింది. పక్క గది నుండి గొళ్ళేం వేయబడ్డ తలుపుల వెనుక మాట్లాడుకుంటున్న మాటలు కొనసాగుతున్నాయి.

"చాలు...వదులు వెంకన్నా, తెల్లారబోతోంది. త్వరగా ఇక్కడ్నుంచి బయలుదేరు"

బ్రతిమిలాడుతున్న ప్రమీల గొంతు క్లియర్ గా వినబడింది.

"ఏం...నీ మొగుడు వచ్చేస్తాడని భయంగా ఉన్నదా?"

"ఛఛ...ఆయన దగ్గర నాకెందుకు భయం? ఎప్పుడూ చనిపోయిన వాళ్ళావిడ గురించే అలొచిస్తూ ఏదో ఒక మూల ముడుచుకుని పడుంటాడు. నేను ఎందుకు చెబుతున్నానంటే, మన ప్లాన్ విజయవంతంగా ముగిసేంత వరకైనా కొంచం జాగ్రత్తగా ఉండొద్దా?"

"నేనుండగా నువ్వెందుకు గాబరాపడతావు? నీ భర్త ఒక చచ్చిన పాము. దాన్ని చంపడానికి నాకు ఎంత సమయం పడుతుందో చెప్పు?"

"నీకు అన్నిట్లోనూ ఆటలే వెంకన్నా. త్వరగా ఆతని కథ ముగించే దారి చూడు. మిగిలింది గాయత్రి మాత్రమే. ఈ ఊరి నుంచే దాన్ని తరిమేద్దాం. మొండికేసిందనుకో దాన్ని కూడా చంపేద్దాం. ఆస్తంతా తానుగా నా చేతికి వచ్చేస్తుంది. ఆ తరువాత అంతా మన ఇష్టం. కానీ, అంతవరకు ఎవరి కళ్ళల్లోనూ మనం పడకూడదు కదా?"

"నువ్వు చెప్పేది కరక్టే. అయితే సరి...నేను బయలుదేరుతాను"

ఆ తరువాత మాటలు ఆగిపోయి ఆ గదిలో నిశ్శబ్ధం అలుముకుంది.

వస్తున్న ఏడుపును ఆపుకోవటానికి నోరు మూసుకుని, తాను వచ్చింది ఎవరూ గమనించకూడదని మెల్లగా తిరిగి వెళ్ళింది గాయత్రి. మళ్ళీ దుప్పటిలోకి దూరింది గాయత్రి. కన్నీరు...చెవి చివర నుండి కారి దిండును తడిపింది.

తెల్లారింది.

ప్రమీల తన కళ్లల్లో పడినప్పుడంతా తనలో ఎగిసిపడుతున్న ఆవేశాన్ని కష్టపడి అనుచుకుంటోంది గాయత్రి.

ఆ రోజు రాత్రి పొద్దు తనతో పాటూ వర్షాన్ని తెచ్చుకుంది. ఆ కారణం చేత ఊరి ప్రజలంతా ఇళ్ళల్లోనే ఉండిపోయారు.

అలవాటుకు విరుద్దంగా ఆ రోజు తొందరగా నిద్ర పోయింది ప్రమీల. గాయత్రి తనలో తానే నవ్వుకుంది. ఒకటా...రెండా? పాలల్లో వేసింది పది నిద్ర మాత్రలు కదా! మెల్లగా ప్రమీల దగ్గరకు వెళ్ళి ఆమెను క్షుణ్ణంగా గమనించింది గాయత్రి. ఊహూ...చలనం లేదు. పూర్తిగా తృప్తి ఏర్పడకపోవటంతో దిండును ఆమె మొహం మీద పెట్టి బలం ఉన్నంత వరకు నొక్కింది గాయత్రి. శబ్ధమే లేకుండా చనిపోయింది ప్రమీల.

‘హమ్మయ్య’ అనుకుంటూ ఆనందంతో వెనక్కు తిరిగిన గాయత్రికి తన వెనుక నుండి "శభాష్" అంటూ ఒక గొంతు వినబడింది.

వెనక్కు తిరిగింది.

వెంకన్న నిలబడున్నాడు. వెకిలిగా నవ్వాడు.

ఐదు నిమిషాల తరువాత ఇల్లంతా చిందర వందరగా పడున్న వస్తువుల మధ్యలొ, ఆయసపడుతూ వంకర టింకరగా పరిగెత్తుతోంది గాయత్రి. పిచ్చి పట్టిన కుక్కలాగా వదలకుండా ఆమెను తరుముతున్నాడు వెంకన్న.

తన శక్తి అంతా కరిగిపోయి ఒడిపోయింది గాయత్రి.

విజయోత్సాహంతో బలవంతంగా ఆమెను పూర్తిగా అనగదొక్కాడు. వసపరుచుకున్నాడు. ఆమె యౌవనాన్ని జుర్రుకున్నాడు. కన్యత్వాన్ని దొచుకున్నాడు.

బయట వర్షం కుంభవృష్టిగా కురుస్తోంది.

లేవటానికి కూడా ఓపిక లేక గొడను ఆనుకుని ఒక మూలలో ముడుచుకు పడుంది నందిని.

ఆమెకు మరింత చేరువకు వెళ్ళి ఆమెను ముట్టుకున్నాడు.

"వదిలేయ్... నన్ను వదిలేయ్...వెళ్ళిపో...ఇక్కడ్నుంచి వెళ్ళిపో"--అంటున్న ఆమె వొళ్ళంతా వణుకు. మరింతగా ముడుచుకుపోయింది.

"నిన్ను చూడటానికి నాకే పాపం అనిపిస్తోంది. కానీ ఏం చేయను? ఎన్నో రోజుల నా తపస్సు ఈ రోజు పూర్తి అయిపోయింది తెలుసా? నీ మీద నాకున్న ఆశ, నీ వల్ల నా అక్క కొడుకు మొహన్ చచ్చిపోయినప్పుడు వెర్రిగా మారింది. ఎక్కడ నిన్ను ముట్టుకోకుండానే వెళ్ళిపోతానో అనుకున్నాను. పరవలేదు...ఆ భగవంతుడే నా వైపు ఉన్నాడు. లేకపోతే ఇలాంటి ఒక సందర్భాన్ని నాకు ఏర్పరచి ఇస్తాడా?"--అని చెప్పి సిగిరెట్టు ఒకటి ముట్టించుకున్నాడు.

"ఇలా చూడు గాయత్రీ...ఒకవేల నాకూ, ప్రమీలకూ ఉన్న సంబంధం నీకు తెలిసిపోయి అది ఇష్టంలేకనే నువ్వు దాన్ని చంపేసేవోమో నన్న సందేహం నాకుంది. ఏది ఎలా ఉన్నా సరే...నీ భవిష్యత్తు ఇప్పుడు నా చేతుల్లో. భయపడకు. నేనే నిన్ను పెళ్ళి చేసుకుంటాను. ఇది సత్యం. కన్న తల్లీ చనిపోయింది. తండ్రి సగం పిచ్చోడిగా తిరిగుతున్నాడు. నీకు ఎవరున్నారు? నీ మంచికే చెబుతున్నాను. మీ నాన్న దగ్గర చెప్పి ఆస్తంతా నా పేరు మీద రాసిమ్మని చెప్పు. నాకు అది చాలు. నిన్ను చివరి వరకు కష్టమనేది తెలియకుండా చూసుకునే బాధ్యత నాది.

తరువాత ప్రమీల గురించి నువ్వు భయపడకు! అనాధగా ఈ ఊరికి వచ్చిందేగా? అనాధ శవంగా నది ప్రవాహంలో కొట్టుకుపోతుంది. దానికి నేను బాధ్యుడ్ని. కానీ, ఇదంతా ఇబ్బంది లేకుండా జరగాలంటే మన పెళ్ళికి నువ్వు అంగీకరించాలి. ఏమంటావ్? చెడిపోయిన దాన్ని పెళ్ళి చేసుకోవటానికి ఎవరూ ముందుకు రారు బంగారం. ఆలొచించి మంచి సమాధానం చెప్పు"

వెంకన్న లేచి నిలబడ్డాడు. గాయత్రి ఆలొచనలో మునిగింది. నిమిషాల తరువాత "సరే" నని తన అంగీకారం తెలిపింది.

ఇంకా ఉంది.....Continued in: PART-19

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి