1, అక్టోబర్ 2021, శుక్రవారం

సముద్రంలో అదృశ్యమై,తిరిగి కనబడే ఆలయం...(ఆసక్తి)


                                                     సముద్రంలో అదృశ్యమై,తిరిగి కనబడే ఆలయం                                                                                                                                                    (ఆసక్తి) 

శివుడికి అంకితం చేసిన అనేక పుణ్యక్షేత్రాలలో, స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రత్యేకం. ఎందుకంటే కొండలలో  శివుడికి అంకితం చేయబడిన చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రాల  మాదిరిగా కాకుండా, స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం సముద్రంలో ఉంది. మీరు కరెక్టుగానే చదివారు; ఆలయం సముద్ర తీరంలో కాదు, ఇది సముద్రంలోనే ఉంది.

గుజరాత్ రాజధాని గాంధీనగర్ నుండి 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంబుసర్ లోని కవి కాంబోయ్ గ్రామంలో స్తంభేశ్వర మహాదేవ్ ఆలయం ఉన్నది. మంచి రోజున, ఆలయానికి వెళ్లటానికి(కారులో వెడితే)మీకు నాలుగు గంటలకు మించి పట్టకూడదు. అయితే మీరు ఆలయం యొక్క ప్రత్యేకతకు సాక్ష్యంగా ఉండాలంటే మీరు గ్రామంలో లేదా గ్రామానికి సమీపంలో ఒక రాత్రి ఉండడం మంచిది.

అరేబియా సముద్రతీరంలో ఉన్న ఆలయం గురించి స్కందపురాణంలో కూడా ప్రసక్తి ఉందంటున్నారు ఆలయ నిర్వాహకులు. శివుని కుమారుడైన కార్తికేయుడు, తారకాసురుడు అనే రాక్షసుని సంహరించిన విషయం తెలిసిందే! తారకాసురుడు లోకకంటకుడే కావచ్చు. కానీ అతను మహాశివభక్తుడు. అలాంటి శివభక్తుని తన చేతులతో సంహరించినందుకు కార్తికేయుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తను చేసిన పనికి ఏదన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తపించిపోయాడు. కార్తికేయుని దుగ్ధను గమనించిన విష్ణుమూర్తిశివభక్తుని పట్ల జరిగిన అపచారం శివపూజతోనే తొలగిపోతుందనిసూచించాడు. అప్పుడు కార్తికేయుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ చేత మూడు శివలింగాలను చెక్కించి వాటిని పూజించాడు. వాటిలో ఒక శివలింగమే స్తంభేశ్వర ఆలయంలోని మూలవిరాట్టు.

స్తంభేశ్వర ఆలయంలోని శివలింగం ప్రాచీనమైనదే అయినా, దీని చుట్టూ ఉన్న ఆలయాన్ని మాత్రం 150 ఏళ్ల క్రితమే నిర్మించారు. చాలా సాదాసీదాగా కనిపించే ఆలయం అద్భుత నిర్మాణం ఏమీ కాదు. కానీ ఆలయం వెనుక ఉన్న స్థలపురాణం వల్లనే వేలాదిగా భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. సముద్రపు అలలకు అనుగుణంగా ఆలయం కనిపించడం మరో విశేషం. అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒకొక్క అంగుళమే ఆలయం బయటయపడుతూ చివరికి భక్తులు అందులోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. మళ్లీ అదే క్రమంలో నిదానంగా సముద్రంలోకి మునిగిపోతుంది. ఆలయం బయటకు రావడం దగ్గర్నుంచీ సముద్రగర్భంలోకి వెళ్లిపోవడం వరకూ మొత్తం క్రమాన్ని గమనించేందుకు భక్తులు ఉదయం నుంచీ సాయంత్రం వరకూ తీరం వద్దనే వేచి ఉంటారు. చంద్రుని కళలను అనుసరించి ఒకో రోజు ఒకో తీరుగా ఆలయం దర్శనమిస్తుంది. సముద్రం మంచి పోటు మీద ఉండే అమవాస్య/ పౌర్ణమి రోజులలో శివుని దర్శనం కోసం కాస్త ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుంది.

ఆలయాన్ని కావాలనే ఇలా నిర్మించారా లేకపోతే కాలక్రమేణా తీరుగా మారిందా అనేది చెప్పడం కష్టం. ఏమైనా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నిత్యం సముద్రుడే ఆయనకు అభిషేకించి తరిస్తున్నాడని భావించవచ్చు. ఆలయం సమీపంలోనే మహీనది అరేబియా సముద్రంలో కలవడం మరో విశేషం. సంగమ ప్రాంతంలో స్నానాలు చేసి స్తంభేశ్వరుని దర్శించుకునేందుకు వేలాదిమంది ఇక్కడకు చేరుకుంటారు. శివపుత్రుడైన కార్తికేయుడు ఇక్కడి శివలింగాన్ని పూజించి సర్వదోషాల నుంచి విముక్తుడైన విధంగానే... లింగాన్ని దర్శించుకున్నవారు కూడా తెలిసీతెలియక చేసిన తప్పుల నుంచి విముక్తులవుతారని భక్తుల నమ్మకం.

Images Credit: To those who took the original photos.

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి