25, ఏప్రిల్ 2021, ఆదివారం

కరోనావైరస్: సెకండ్ వేవ్‌ ఎందుకు ఇంత తీవ్రంగా ఉన్నది?...(న్యూస్/నాలెడ్జ్)

 

                                             కరోనావైరస్: సెకండ్ వేవ్ఎందుకు ఇంత తీవ్రంగా ఉన్నది?                                                                                                                                  (న్యూస్/నాలెడ్జ్)

భారత్‌ను కరోనా సెకండ్‌ వేవ్‌ దారుణంగా కుదిపోస్తోంది. గతేడాది వచ్చిన తొలి వేవ్‌తో పోలిస్తే ఎన్నో రెట్లు అదికంగా, వేగంగా ఇది విస్తరిస్తోంది. అదీ కేంద్ర ప్రభుత్వం కరోనాపై యుద్దం ముగిసిందంటూ ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ కుదుపు ప్రారంభం కావడం విశేషం. దీంతో ఇప్పుడు తప్పెక్కడ జరిగిందనే చర్చ సర్వత్రా సాగుతోంది.

దేశంలో కరోనా కేసులు పెరగడానికి 70 శాతం ప్రజలు, 30 శాతం ప్రబుత్వం కారణమని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

ప్రజలు మాస్క్ లు పెట్టుకోక పోవడం…ఆరుబయట తిరగడం…శానిటైజేషన్ చేసుకోకపోవడం, సామాజిక దూరం పాటించక పోవడం లాంటి నిర్లక్ష్య పోకడే ప్రజల వైపు నుండి ముఖ్య కారణమని చెబుతున్నారు.

మరో కారణం: వైరస్ లు సహజ సిద్ధంగా పరివర్తనం చెందుతాయి. ఈ క్రమంలో కొన్ని బలహీన పడతాయి. కొన్ని బలం పుంజుకుంటాయి. బలపడిన మ్యుటేంట్లు వేగంగా వ్యాప్తి చెందుతాయని డాక్టర్లు చెబుతున్నారు. అలా బలపడిన కరోనా వైరస్ మ్యూటెంట్ మహారాష్ట్రకు చెందిన 50 శాతం శాంపిల్స్ ను పరిశీలించిన పరిశోధకులు వాటి జన్యువులో బి.1.617 వేరియంట్ ఉన్నట్టు గుర్తించారు. ఇది  అతి వేగంగా వ్యాపించటమే కాకుండా, తీవ్రమైన బాధింపులను ఏర్పరుస్తుందట.


ఇక ప్రభుత్వం వైపు నుండి: గత ఏడాది చివరి నుంచే అందరూ వైరస్ను ఓడించామనే ఆనందంలో మునిగితేలారు. రాజకీయ నాయకులు, అధికారులు, మీడియాలో కొన్నివర్గాలు భారత్ నిజంగా మహమ్మారి నుంచి బయటపడిందని భావించారు.భారత్ కోవిడ్ కేసుల గ్రాఫ్ను వంచిందని, దానికి ఆధారాలు కూడా ఉన్నాయని డిసెంబర్లో రిజర్వ్ బ్యాంక్ అధికారులు కూడా ఒక ప్రకటన చేశారు."ఆర్థికవ్యవస్థ సుదీర్ఘ శీతాకాలం చీకట్లను చీల్చుకుని, సూర్యుడి వెలుతురు దిశగా అడుగులు వేస్తోంది" అని కవితాత్మకంగా వర్ణించారు.

గొప్పగా చెప్పుకున్న తమ టీకా దౌత్యంలో భాగంగా భారత్ జనవరి నుంచి టీకా డోసులను వివిధ దేశాలకు ఎగుమతి చేయడం కూడా ప్రారంభించింది. సెప్టెంబర్ మధ్యలో రోజుకు సగటున 93 వేల కేసుల స్థాయి నుంచి ఫిబ్రవరి మధ్య నాటికి రోజుకు 11 వేలకు కరోనా కేసులు తగ్గిపోవడంతోనూ, రోజువారీ మరణాలు ఏడు రోజుల సగటు కూడా వంద కన్నా తగ్గి నందువలన ప్రభుత్వం కరోనాపై యుద్దం ముగిసిందంటూ వ్యాఖ్యలు చేసింది.

దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుతున్నదని ఎప్పుడైతే గుర్తించారో అప్పుడే ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నోటిపికేషన్ ఇచ్చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రచారం, పోలింగ్ పేరుతో విచ్చలవిడిగా జనం రోడ్లపైకి రావడం మొదలుపెట్టేశారు. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో సైతం విపరీతమైన కరోనా కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాది భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన రెండు మ్యాచ్‌లకు దాదాపు 1.3 లక్షల మందిని అనుమతించారు. దీంతో అక్కడ భారీగా కేసులు రావడం మొదలుపెట్టాయి. తాజాగా సెకండ్‌ వేవ్ ఉందని తెలిసీ లెక్క చేయకుండా కుంభమేళాకు అనుమతులివ్వడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెంటిమెంట్ల పేరుతో సమర్దించాయి.

నెలలోనే పరిస్థితులు తల్లకిందులయ్యాయి. భారత్ దారుణమైన కరోనా సెకండ్ వేవ్ గుప్పిట్లో చిక్కుకుంది. నగరాల్లో కొత్తగా లాక్డౌన్ విధించారు. ఏప్రిల్ మధ్యకల్లా దేశంలో సగటున రోజుకు లక్ష కేసులు నమోదయ్యాయి.

ఆదివారం(ఏప్రిల్ 18) భారత్లో 2,70,000కి పైగా కొత్త కేసులు, 1600కు పైగా మరణాలు నమోదయ్యాయి. రోజువారీ కరోనా గణాంకాల్లో రెండూ సరికొత్త రికార్డులు. కరోనా కేసులను సరిగా ట్రాక్ చేయకపోతే, జూన్ మొదటి వారానికి భారత్లో రోజుకు 2,300కు పైగా మరణాలు నమోదు కావచ్చని 'ది లాన్సెట్' కోవిడ్-19 కమిషన్ నివేదిక చెబుతోంది.

రాష్ట్రాల నుంచి తెచ్చిన శ్యాంపిళ్లపై జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు పరిశోధకులు. ఈ శాంపిళ్ళ ఫలితాలు మరో రెండురోజులలో వస్తాయని భావిస్తున్నారు. ఈ సెకండ్ వేవ్ కి కారణం కొత్త వేరియంటా...కాదా అనేది తేల్చనున్నది అధ్యయనం. అయితే, ఇప్పటికే ఇది కొత్త వేరియంట్ అని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా అనుమానం వ్యక్తం చేశారు. అదీకాకుండా ఈ వేరియంట్ మరో రూపు తీసుకుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర వేరియంట్ల కన్నా బి.1.617 మ‌రింత ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతుంది.మహారాష్ట్రకు చెందిన 50 శాతం శాంపిల్స్ ను పరిశీలించిన పరిశోధకులు వాటి జన్యువులో బి.1.617 వేరియంట్ ఉన్నట్టు గుర్తించారు.

భారత్ ఇప్పుడు ప్రజారోగ్య అత్యవసర స్థితి గుప్పిట్లో విలవిల్లాడుతోంది. కిక్కిరిసిన శ్మశానాల్లో కోవిడ్ మృతుల అంత్యక్రియలు, ఆస్పత్రుల బయట మృతదేహాల కోసం ఎదురుచూసే కుటుంబాలు, శ్వాస అందని రోగులతో ఆస్పత్రుల బయట నిలిచిన అంబులెన్సులు, శవాలతో నిండిన మార్చురీల వీడియోలతో సోషల్ మీడియా నిండిపోతోంది. కొన్ని ఆస్పత్రుల్లోని కారిడార్లలో, వరండాల్లో ఒకే బెడ్ మీద ఇద్దరు రోగులు ఉండడం కూడా కనిపిస్తోంది.

ఎన్నికల ర్యాలీల్లో కొన్ని వేల మంది తమ నేతలను అనుసరిస్తున్నారు. కుంభమేళాలో నదీ స్నానాలకు జనం పోటెత్తుతున్నారు. ఇందులో చాలా మంది మాస్కులు వేసుకొకుండానే హాజరైయ్యారు.

శారీరక దూరం పాటించండి, ప్రతి ఒక్కరూ సరైన మాస్క్ వేసుకోండి, దాన్ని సరిగ్గా వేసుకునేలా చూసుకోండి, చేతులు కడుక్కోండి, సానిటైజర్ వాడండి...ఇలా చేసి కరోనాను కట్టడి చేయటంలో మనవంతు సహాయం చేద్దాం.

Image Credits: To those who took the original photos. 

************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి