9, మే 2020, శనివారం

గాలితో ఒక యుద్దం (సీరియల్)...PART-1



                                ************************************************************************************  
నవలలు అంటేనే చాలా వరకు సస్పెన్స్, మర్మం కలిగే ఉంటాయి, నవలలు అంతకు మించి మంచి విషయాలను ఆలోచింపచేయదు అనే ఒక విమర్శ కొందరిలో ఉంది.

అందులోని కొంతమంది చాలా వరకు మర్మ నవలలను రాయడానికి ప్రయత్నించి, రాయలేకపోయారు. వీళ్ళ విమర్శలూ 'ఛీఛీఛీ...ఈ పండూ పులుపే' అనే రకమే!

ఈ 'గాలితో ఒక యుద్దం' కూడా మర్మ నవలే. అదే సమయం ఈ నవల, ఈ రోజు మనిషి జీవితంలో ఉన్న అధ్యాత్మిక నమ్మకాలను, వాటిని నిర్లక్ష్యం చేయటం వలన ఏర్పడే పరిణామాలను, నష్టాలను అన్వేషించి చూస్తోంది. నవల పూర్తిగా ఈ రోజుల్లో సమూహ స్థితిని రిజిస్టర్ చేస్తోంది. నవల ముగింపు కొందరిని ఆశ్చర్యపరుస్తుంది, కొందరిని ఆలొచింపచేస్తుంది.
************************************************************************                                        గాలితో ఒక యుద్దం (సీరియల్)
                                                        (PART-1)

కొన్ని నమ్మకాలు వినోదంగా ఉంటాయి. కొన్ని నమ్మకాలు లోతుగా ఉంటాయి. కొన్ని నమ్మకాలు చిక్కుముడిలాగా ఉంటాయి. కొన్ని నమ్మకాలకు అర్ధమే ఉండదు. కానీ, నమ్మకాలు...నమ్మకాలే! అదిలేకపోతే ఒక్క అడుగు కూడా ఒక్కరూ ముందుకు వేయలేరు. మనం నిద్ర నుండి లేస్తున్నప్పుడే నమ్మకం కూడా మనతో పాటూ కలిసే లేస్తుంది. ఈ రోజు ఖచ్చితంగా సూర్యుడు ఉదయిస్తాడు. తాగటానికి నీళ్ళు దొరుకుతాయి లాంటి విషయాలు ఎన్నో కాలల నుండి మనల్ని మోసం చేయకుండా ఉంటున్న నమ్మకాలు!

వాకిట్లో మోటార్ సైకిల్ శబ్ధం.

తొంగి చూసింది పల్లవి.

కార్తిక్ లోపలకు రావటం కనబడింది. అతనికి ముప్పై సంవత్సరాల వయసు.

“అన్నయ్య వచ్చాశాడు” అని అరిచింది పల్లవి.

అది విని వంట గదిలో నుండి అతని తల్లి విమలాదేవి, పెరట్లో బట్టలు ఉతుకుతున్న అతని భార్య అఖిల, పూజ రూములో నుండి అతని తండ్రి రామశర్మ హాలులోకి వచ్చారు.

హాలులో కొన్ని వెదురు కుర్చీలు, ఒక కుషన్ సోఫా వేసున్నాయి. మధ్యలో ప్లాస్టిక్ మోడా. దానిపైన ఆ కుటుంబం చదివే దిన పత్రికలు, వార పత్రికలు పడున్నాయి. అందులో ఒకటి పల్లవి చేతిలో ఉంది.

కార్తిక్ నీరసంగా లోపలకు వచ్చి ఒక వెదురు కుర్చీలో కూర్చున్నాడు.

ఎక్కువ చెమటతో తడిసిపోయున్నాడు. నిట్టూర్పు వచ్చింది.

అందరూ అతన్నే ఆసక్తితో చూస్తున్నారు.

విమలాదేవి మాత్రం మాట్లాడటం మొదలు పెట్టింది.....“వెళ్ళిన పని ఏమైందిరా అబ్బాయ్?”

“మంచిగా జరిగుంటే నేనిలా నిట్టూర్పు విడిచే వాడినా?”--అతనూ తిరిగి అడిగాడు.

“సరే అబ్బాయ్...ఏం జరిగింది? అదైనా చెప్పు” ---ఇది అతని తండ్రి రామశర్మ.

“ప్రయోజనం లేదు నాన్నా! 'గాలిపేట ఇల్లు’ అంటేనే అందరూ పరుగెత్తి వెళ్ళిపోతున్నారు.”

“అలాగైతే ఆ ఇల్లు వలన మనకు దమిడి కూడా రాదని చెప్పు”

“ఇప్పుడైతే అదే పరిస్థితి. కానీ, కడప సులేమాన్ అనే ఒకాయన మాత్రం, 'ఎవరైనా అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఒక నెల రోజులు ఉండొస్తే...ఆ తరువాత ఆ ఇంటిని నేనే కొనుక్కుంటాను’ అని చెప్పారు”

“నిజంగానే కొనుక్కుంటానని చెప్పారా?”

“అవును నాన్నా...! కానీ, ఎవరు ఆ ఇంట్లో ఉండగలరు?”

“ఇదేం ప్రశ్నరా అబ్బాయ్? నేనూ, మీ అమ్మా ఉంటాము”

“నాన్నా...”

“ఏం అబ్బాయ్...భయంగా ఉన్నదా?”

“లేదు నాన్నా...కానీ ఆ వాగ్ధానం!”

“ఓ...నువ్వు దాని గురించి చెబుతున్నావా? మేము అక్కడ కాపురం పెట్టకూడదు. నెల రోజులు ఉండొచ్చు”

“వద్దు నాన్నా...వద్దు. ఇంకేదైనా దారి ఉందేమోనని నేను ఆలొచిస్తాను”

“ఇదిగో ఇలా చూడు...రోజులు దగ్గర పడుతున్నాయి. ఆ ఇల్లు అమ్మితేనే నాలుగు డబ్బులు వస్తాయి. పెళ్ళి కూడా బాగా జరుపగలం. ‘వేరే దారి ఉందేమో... ఆలొచిస్తాను’ అని కాలం వెళ్లబుచ్చకు! ఆ సులేమాన్ గారిని దేవుడే పంపించుంటాడు... ఆయన్నీ, ఈ సందర్భాన్నీ వదిలి పెట్ట కూడదు”

వాళ్ళ మధ్య మాటలు వేడెక్కుతున్న సమయంలో వాకిటి గేటు శబ్దం.

కార్తిక్ స్నేహితుడు వీరబద్రం రావటం కనిపించింది. అతని పూర్తి పేరు వీరబద్ర వెంకటాచలం!

వెంకటాచలం అనేది వాళ్ళ ఇంటి పేరు. దాని వెనుక ఒక పెద్ద కథ దాగుంది. అది అతను చెప్పటం ప్రారంభిస్తే...మనకే నిద్ర వస్తుంది. అంత పెద్ద కథ...అది ఇప్పటికి వద్దు.

“రా రా బద్రం...” -- స్వాగతించాడు కార్తిక్. స్నేహితుడ్ని బద్రం అనే పిలుస్తాడు కార్తిక్.

“వస్తూనే ఉన్నాగా! అరెరె...ఏమిటిది. ఈ రోజు అందరూ ఇంట్లోనే ఉన్నారు?”

“ఏం బాబూ వీరబద్రం...నువ్వెలా ఉన్నావు?” -- అడిగారు రామశర్మ.

“నాకేం ‘అంకుల’ ...చాలా బాగున్నాను”

“సంతోషం...నువ్వైనా బాగున్నావని మనసారా చెబుతున్నావే! చాలా సంతోషం!”--- రామశర్మ గారు చెప్పిన జవాబు వీరబద్రాన్ని ఆలొచింప జేసింది.

“అంకుల్”

“ఏమిటి వీరబద్రం?”

“నువ్వైనా బాగున్నావని చెప్పావే అంటూ మీరు నీరసంగా మాట్లాడుతున్నారు. చూస్తుంటే ఇక్కడ ఏదో సమస్య ఉన్నట్లు కనబడుతోందే?”--పాయింటును పట్టుకున్నాడు.

“సమస్యే వీరబద్రం...! జీవితంలో కొందరికి సమస్యలు వస్తాయి. నా వరకు సమస్యలలోనే జీవితం ఉన్నది"

రామశర్మగారి ఆ జవాబు...వీరబద్రాన్ని మరింత ఎక్కువగా ఆలొచనకు గురిచేసింది.

“కార్తిక్...మీ నాన్న మాట్లాడేది చూస్తుంటే నువ్వేదో కష్టాలలో ఉన్నటు తెలుస్తోంది. అదేమిటో నా దగ్గర చెప్పకూడదా?”

“ఇందులో చెప్పటానికేముంది బద్రం. చెల్లి పల్లవికి మంచి సంబంధం వచ్చింది. అతను అమెరికాలో 'ఐ.టీ' కంపెనీలో ఉద్యోగం”

“ఇదంతా తెలిసిన విషయమే కదా! ఇప్పుడు పెళ్ళి ఖర్చులకు డబ్బులు లేవు...అదే కదా మీ సమస్య?”

“అవున్రా...మా సొంత ఊరైన ‘గాలి పేట’ లో ఉన్న ఇల్లు అమ్మితే డబ్బులొస్తాయి. అది పెట్టుకుని పెళ్ళి చేసేద్దాం అని అనుకుంటే...”---లాగుతూ మాట్లాడాడు కార్తిక్.

“ఏం. మీరు చెప్పే రేటుకు ఎవరూ రావటం లేదా?”

“అది...అది...”

ఏదో చెప్పాలని, చెప్పలేక పోయాడు కార్తిక్.

ఆ ఇంటి గురించిన ఏదో ఒక మర్మం వాళ్ళ దగ్గర దాగున్నదని కార్తిక్ మాటలే చెబుతున్నాయి. అప్పుడు 90 ఏళ్ళున్న కార్తిక్ బామ్మ లోపలున్న ఒక సపరేట్ గదిలో నుండి కేకేసింది.

“కార్తిక్... కార్తిక్...”

“బామ్మ పిలుస్తున్నట్టుంది...”

“కార్తిక్...నువ్వు వెళ్ళకు! ఇప్పుడు నువ్వు వెళితే అమ్మ ఏం చెబుతుందో నాకు తెలుసు”---అడ్డుపడ్డాడు తండ్రి రామశర్మ

“నాన్నా...”

“నువెళ్ళు...వెళ్ళి నీ పని చూసుకో, నేనూ, మీ అమ్మ రేపు గాలిపేటకు వెళ్తాము. ఆ ఇంటిని శుభ్ర పరిచి, ఇల్లంతా కడిగి ఆ ఇంట్లో ఉంటాము. రాత్రి పడుకోవటానికి సర్పంచ్ ఇంటికి వెళ్ళిపోతాం”

“నాన్నా...కాదు నాన్నా! దయచేసి మీరు అక్కడికి వెళ్ళొద్దు.నేను వేరే విధంగా ఆ ఇంటిని అమ్మటానికి చూస్తాను” అంటూ కార్తిక్ తల్లి-తండ్రులను పట్టుదలగా ఆపాడు.

“పోరా పిచ్చోడా...ఇక్కడ పెళ్ళి పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు పోయి వేరే విధంగా అమ్ముతాను అంటూ కాలం పొడిగిస్తున్నావు! నువ్వెళ్ళు...నాకు ఈ పెళ్ళి ఏ లోటూ లేకుండా జరగాలి. అదే ముఖ్యం. మేము వెళ్తున్నాము. అంతే...” రామశర్మ గారు చెప్పటాన్ని తన మౌనంతోనే అంగీకరించింది భార్య విమలాదేవి.

ఆ తరువాత కార్తిక్ వాళ్ళతో వాదన చెయ్యదలుచుకోలేదు.

లోపలున్న బామ్మ దగ్గర నుండి ఆపకుండా పిలుపు వస్తూనే ఉంది.

“కార్తిక్... కార్తిక్... కార్తిక్...” అని!

మనసు ఒప్పుకోక బామ్మ సరోజమ్మ గదివైపుకు నడిచాడు కార్తిక్.

"వెళ్ళొద్దు..." అని అరుస్తున్న తండ్రి కేకలను పట్టించుకోకుండా......

కానీ, ఇవన్నీ వీరబద్రానికి వినోదంగా ఉన్నది.

గదిలో నులక మంచంపైన పడుకోనుంది కార్తిక్ బామ్మ సరోజమ్మ.

కొద్ది అడుగుల దూరంలో చావు వచ్చేసినట్టు ఒక ఆకారం. వొంటి మీద దుప్పటి కప్పబడి ఉంది. గదిలోపల కూడా ఒక విధమైన అశుభ్ర వాసన. ఆ గదిలో ఎక్కువగా వెలుతురు లేదు.

వృద్దులకు మరణం రావటం ఆలశ్యమయితే వేరుగా ఒక నరకం అక్కర్లేదు. వాళ్ళు అనాధల్లాగా మంచంపై పడుండటం కూడా నరకమే కదా! కార్తిక్ వెనుకే వెళ్ళిన వీరబద్రానికి ఆ గదిలోని దృశ్యం చూశాక ఏదోలాగా అయ్యింది.

“బామ్మా...పిలిచావా?”

“దగ్గరకు రా...”

“దగ్గరే ఉన్నాను! చెప్పు...”

“ఆ ఇంటికి వెళ్ళొద్దు! ఆ ఇంటిని మరిచిపో...?”

“చాలు బామ్మా...! దాన్ని ఎలా వదిలిపెట్టటం? అది తాతయ్య సంపాదించిన ఆస్తే కదా? ఆయన మనవుడ్ని నేను. నాకు అందులో హక్కు లేదా?”

“లేదు...అది ఇప్పుడు మన ఆస్తి కాదు. మీ తాతయ్య నిన్ను కాపాడటానికి ఆ ఇంటిని ఆ గాలి దేవుడికి ఇస్తున్నట్టు ఆ దేవుడి దగ్గర వాగ్ధానం చేశారు. ఇప్పుడది ఆ గాలి దేవుడి సొంతం” అనేటప్పుడు రామశర్మ గారు వచ్చి మాట్లాడారు.

“అయ్యో అమ్మా...నువ్వు చెప్పే గాలిదేవుడు ఇప్పుడు అక్కడ ఎక్కడున్నాడు? మూర్ఖత్వంగా నాన్న వాగ్ధానం చేసి...ఇప్పుడు ఆ ఇల్లు ఎవరికీ ప్రయోజనం లేకుండా పోయింది”

“గాలిదేవుడు ఎక్కడున్నాడని అడుగుతున్నావా? అన్ని చోట్లా ఉన్నాడు. ఆ దేవుడు గాలి లాంటి వాడు. అందుకనే 'గాలి...దేవుడు’ అని చెబుతారు”

“ఈ వ్యాఖ్యానం అంతా వినటానికి బాగానే ఉంది. కానీ, దాని వలన ఏ ప్రయోజనమూ లేకుండా ఆ ఇల్లు అక్కడ పాడుబడ్డ చీకటి కొంపలా ఉంది. దాన్ని అమ్మితే...డబ్బులొస్తాయి. అదిమాత్రమే కాదు...ఆ ఇంట్లో నలుగురు నివసిస్తారు. ఉపయోగంగా ఉంటుంది”

“లేదు...అక్కడ ఎవరూ నివాసం చేయలేరు. వాగ్ధానాన్ని తోసి పారేసి ఎవరు అక్కడికి వెడతారో వాళ్ళను ఆ గాలిదేవుడు వూరికే వదిలిపెట్టడు”

వృద్ద వయసులోనూ దీర్ఘంగా మాట్లాడింది సరోజమ్మ.

వీరబద్రానికి బామ్మ మాటలు వింతగానూ, చిక్కు ముడిగానూ అనిపించింది.

“కార్తిక్... ఈ గదిలోకి రావద్దని నేను చెప్పానుగా. నువ్వు నా మాట విన్నావా? మీ బామ్మకు భయం. అందుకనే ఆమె అలాగే మాట్లాడుతుంది. నువ్వెళ్ళు! వెళ్ళి ఇక జరగాల్సిన పని చూడు"

--- రామశర్మ గారు కొడుకును పక్కకు తోశారు.

బామ్మ చాలా శక్తి తెచ్చుకుంది.

"వద్దర్రా...నా మాటలను దయచేసి వినండి. గాలిపేట వైపు వెళ్ళకండి..." అన్నది.

వీరబద్రానికి మాత్రం బామ్మ మాటల్లో ఏదో ఒక నిజం దాగున్నదని బాగా అర్ధమయ్యింది.

                                                                                           (ఇంకా ఉంది) *************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి