20, సెప్టెంబర్ 2020, ఆదివారం

జీవన పోరాటం...(సీరియల్)...PART-16


                                                                        జీవన పోరాటం...(సీరియల్)                                                                                                                                                                     (PART-16) 

(చేసిన ద్రోహాన్ని సహించుకోలేక ద్రోహం చేసిన వాళ్ళను ధండించటం అప్పటికప్పుడు సంతోషం కలిగిస్తుంది. కానీ, ఆ ద్రొహాన్ని సహించుకోగలిగిన వారే...ప్రపంచం ఉన్నంతవరకు నిలకడైన సంతోషం పొందుతారు)

విపరీతమైన కోపంతో ఇళ్ళు జేరిన గాయత్రి, తన గదిలోకి వెళ్ళి తలుపును గట్టిగా తోసి మంచం మీద దబాలున పడింది. ప్రేమించినవాడు ఇంత నీచుడుగా ఉంటాడని ఆమె కలలో కూడా ఎదురుచూడలేదు. ఓటమిని ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఆమెను రహస్యంగా ఫాలో చేసింది కూడా ఆమె సహించుకోలేకపోయింది. సత్యపాల్ ను, వాడి తల్లిని బయటకు పంపకపోతే తాను ప్రశాంతంగా జీవించలేదని ఆమె అనుకున్నది.

'వాళ్ళను ఎలా బయటకు పంపేది? నాన్నా, అమ్మా వాళ్ళను ఎందుకు నెత్తికి ఎక్కించుకుని ఆడుకుంటున్నారు?

ఇప్పుడు ఇతను...వాళ్ళ కళ్ళకు 'హీరో'గా కనబడతాడే! ఇంటి నుండి పారిపోయిన నా మాటలను ఇక వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు?'

ఇలాంటి ప్రశ్నలు ఆమె మెదడును కెలుకుతుంటే ఆమె ప్రశాంతత కోల్పోయింది.

నన్ను కన్న వాళ్ళు నాకు ఎలాంటి శిక్ష వేయాలనుకున్నా వేయనీ. కానీ, 'ఎలాగైనా వీళ్ళను బయటకు పంపించే' కావాలి అని నిర్ణయించుకుంది.

గదిలో నుండి బయటకు వచ్చి హాలులో నిలబడి, "నా..న్నా..." అని అరిచింది.

ఎదురు చూసిన సునామి...హాలులోకి వచ్చిందని గ్రహించిన అందరూ వెంటనే అక్కడికి వచ్చారు.

గాయత్రి...మళ్ళీ అరిచింది, "నాన్నా...ఈ అనాధ ఇక ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండకూడదు. వెంటనే బయటకు పంపించండి" అని చెబుతూనే సత్యపాల్ ను చూసి గుమ్మం వైపు చేయి చూపింది.

అదిరిపడ్డ పరంధామయ్య, భార్య వైపు చూశాడు. ఆయన మౌనాన్ని తనకు అనుమతిగా తీసుకుని ఇంకా గట్టిగా అరిచింది. బిచ్చం అడుక్కోవటానికి వచ్చిన వాళ్ళు, ఈ రోజు ఇంటినే ఆక్రమించారు. వీళ్ళను ఇంకా ఇక్కడ ఉంచితే త్వరలో మనల్నే రోడ్డు మీదకు పంపించేస్తారు"

అంతవరకు ఓర్పుతో ఉన్న రాజరాజేశ్వరి, "ఒసేయ్...ఎవర్ని చూసి ఏం మాట్లాడుతున్నావు?" అన్నది కోపంగా!

దానికంతా ఆమె అనిగిపోవటానికి తయారుగా లేదు. వాళ్ళు ఎవరు...ఎందుకని ఇక్కడ అతుక్కుని ఉన్నారు?  ఇది తెలుసుకోవటం కోసమే కదా ఇన్ని రోజులు ఎన్నో కష్టాలు పడ్డాను.

ఇదొక మంచి సంధర్భం. ఈ సంధర్భాన్ని సరిగ్గా వాడుకోవాలి. అందుకని, తల్లి దగ్గర కఠనంగా అరిచింది, "నాకంటే వాళ్ళే నీకు ముఖ్యమా? కన్న కూతురు కంటే మిగిలినవాళ్ళు నీకు బాగా కావలసిన వాళ్ళు అయిపోయారు కదా?"

"నిన్ను నిజంగా కన్నది ఎవరో నీకు తెలుసా?'...పేలింది రాజరాజేశ్వరి.

మంగమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి రాజరాజేశ్వరి చేతులు పుచ్చుకుని, "అమ్మా...వద్దమ్మా. ఏదీ చెప్పేయకండి" అని బ్రతిమిలాడింది.

కోపంగా మంగమ్మ వైపు తిరిగి చూసిన గాయత్రి, "ఓవర్ గా నటించకే! ఏవేవో కధలు చెప్పి మా  అమ్మను మోసం చేసి నీ గుప్పిట్లో ఉంచుకున్న మాయాలమారివి నువ్వు" అన్నది.

గాయత్రి చెప్పి ముగించే లోపు గాయత్రి చెంప మీద 'చెల్లు మని లాగి ఒక దెబ్బ కొట్టింది రాజరాజేశ్వరి.

ఎదురుచూడని ఆ దెబ్బతో తడబడిపోయింది గాయత్రి. అయినా, అమె కోపం, ఆగ్రహం అన్నీ వెర్రిగా మారి... మంగమ్మ చేతులు పుచ్చుకుని ఇంటి బయటకు లాక్కుని  వెళ్ళింది.

పరిగెత్తుకు వచ్చి వాళ్ళను అడ్డుకున్న రాజరాజేశ్వరి, “బయటకు వెళ్ళాల్సింది ఈమె కాదే. ఈ రోజు వరకు గొడ్రాలుగా ఉంటున్న నేనేనే బయటకు వెళ్ళాల్సింది. నేను కన్న కూతురివి కావు నువ్వు. మీ నాన్నకూ, ఈ మంగమ్మకి పుట్టిన దానివి నువ్వు"

తన తల మీద పిడిగు పడినట్లు అయ్యింది గాయత్రికి. ఆమె అది నమ్మలేకపోయింది. రాజరాజేశ్వరియే చెప్పినందువలన నమ్మకుండానూ ఉండలేకపోయింది. రెండు చేతులతోనూ తల పట్టుకుని కూర్చుండిపోయింది.

కోపంగా ఆమె దగ్గరకు వచ్చి చేతులు పుచ్చుకుని పైకి లేపి మాటలు పొడిగించింది రాజరాజేశ్వరి, "నువ్వు నిజంగానే మంగమ్మ కన్న కూతురివే. తపం చేసి గర్భం దాల్చి పది మాసాలు మోసి నొప్పులను భరించి కనాల్సిన పుత్ర భాగ్యానికి నోచుకోని అర్హతలేని గొడ్రాలైన నాకు, నిన్ను పూర్తిగా కూతురిగా ఇచ్చేసిన త్యాగి అది.

చేసిన ఒకే ఒక తప్పుకోసం తనని తానే దండించుకుని...తపస్సు చేసే జీవితం జీవిస్తూ వస్తున్న పుణ్యవతే ఆమె. అదిమాత్రమే కాదు...నీ మీద ఎటువంటీ బంధుత్వాన్నీ కలుపుకోక -- ఆమెకూ, సత్యపాల్  కూ నువ్వు చేసిన ఘోరాల నన్నిటినీ సహించుకుని...నిన్ను అభిమానిస్తూ...నీకు మంచి చేయాలని, చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పు...వాళ్ళను బయటకు పంపేద్దామా?”

ఒక్క క్షణంలో పర్వత శిఖరం పై నుండి ఎగరేయబడి చదురమైన నేల మీద పడినట్లు ఫీలైంది. తాను ఏదేదో ఊహించుకుని తప్పుగా అనుకుంటుంటే, అందరూ ఓర్పుగా ఉండటంతో పాటూ ఆమె మీద ప్రేమానురాగాలు కుమ్మరించేరనేది ఫీలై నప్పుడు ఏడుపు ముంచుకు వచ్చింది. అలాగే ఒక స్తంభానికి ఆనుకుని జారుతూ కింద కూర్చుండిపోయింది. రెండు కాళ్ళనూ దగ్గరగా పట్టుకుని మోకాళ్ళపై తల దించుకుని '' అంటూ ఏడ్చింది.

ఆమెను సమాధాన పరచటానికి రాజరాజేశ్వరి ప్రయత్నించినప్పుడు  'ఏడ్చి ముగించనీ' అని సత్యపాల్ సైగ చేసి అడ్డుపడ్డాడు.   

ఏడ్చి ముగించిన తరువాత రాజరాజేశ్వరి గాయత్రి దగ్గరకు వెళ్ళి కూర్చుని ఆదరణగా ఆమె తల నిమిరింది.

"అమ్మా, మీరందరూ నా మీద అంత ప్రేమ చూపించినప్పుడు...నేను మిమ్మల్ని అర్ధం చేసుకోకుండా తప్పుగా నడుచుకున్నాను. నేనూ కష్టపడుతూ...మీ అందరినీ ఆవేదనకు గురిచేశాను. నేను తప్పుగా నిర్ణయం తీసుకుని ఇంటి నుండి వెళ్ళినప్పుడు కూడా అన్నయ్య ఎంతో శ్రమపడి నా తప్పును ఎత్తి చూపినప్పుడు అది కూడా అర్ధం చేసుకోకుండా మిమ్మల్ని మరింత కష్టపెట్టాను.

మీరు ఆ కష్టాలన్నిటినీ సహించుకుని...నా మీద ప్రేమ కురిపించారు. మీదగ్గర ఎలా క్షమాపణలు అడగాలో తెలియటం లేదు" అన్నది.

దానికి రాజరాజేశ్వరి, "నువ్వు చిన్నప్పటి నుండీ మంచిదానివే. ఆ విషయం మాకు బాగా తెలుసు. మధ్యలో నీకు కొన్ని సందేహాలు ఏర్పడటంతో అప్పట్నుంచీ నువ్వు చేసేవన్నీ తప్పుగా చేశావు. నీకు వివరాలు అర్ధం చేసుకునే వయసు వచ్చినప్పుడు నీతో నిజం చెప్పాలని అనుకున్నా. కానీ, దానికి ముందే అన్నిటినీ తప్పుగా అర్ధం చేసుకున్నావు...నువ్వూ కష్టపడి, మమ్మల్నీ కష్టపెట్టావు! నీ పట్టుదల మాకు తెలుసు. మేము చెబితే వినవు. అందువల్ల నువ్వుగా అర్ధం చేసుకునేంత వరకు కాచుకోనున్నాము. మాలో ఎవరికీ నీమీద కోపం లేదు. అందువల్ల నువ్వు ఎవరి దగ్గరా క్షమాపణ అడగక్కర్లేదు" అన్నది.

అయినాకానీ గాయత్రి సమాధాన పడలేదు. తండ్రిని చూసి, "నన్ను క్షమించడి నాన్నగారూ. మీ గురంచి చాలా నీచంగా ఆలొచించాను. అందువల్ల మీ దగ్గర బాగా నిర్లక్ష్యంగా మాట్లాడాను. నన్ను క్షమిస్తారా నాన్నా?" అని ఏడ్చింది.

పరంధామయ్య ప్రేమగా కూతుర్ని దగ్గరకు తీసుకుని, " గాయత్రీ, అయ్యిందేదో అయిపోయింది. పాతవన్నీ మరిచిపోయి ఇకనైనా మనమందరం సంతోషంగా ఉందాం" అని చెప్పి గాయత్రి కన్నీరును తుడిచాడు.

తరువాత ఆమె సత్యపాల్ ను చూసినప్పుడు, అతను గాయత్రిని మాట్లాడనివ్వకుండా,   "చాలు గాయత్రీ...నువ్వు ఏడ్చిందీ చాలు. క్షమించమని అడగటం కూడా చాలు. ఏప్పుడూ నువ్వు నా ప్రియమైన చెల్లివే. నీమీద నాకు ఎప్పుడూ కోపం వచ్చిందే లేదు"  అన్నాడు.

మంగమ్మ వైపు తిరిగిన గాయత్రికి, ఆమె మొహాన్ని నేరుగా చూడడానికి ధైర్యం చాల లేదు. ఆమె దగ్గరకు నడవాలనుకున్నప్పుడు గాయత్రికి అడుగులు తడబడ్డాయి. కింద పడబోతుంటే మంగమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి గాయత్రిని పట్టుకుంది.

"అమ్మా...అమ్మా..." అని ఏదేదో చెప్పాలనుకున్నది. కాని నొటి నుండి ఒక్క మాట కూడా బయటకు రాలేకపోయినై. కన్నీళ్ళు మాత్రం ధార ధారగా వచ్చింది.

మంగమ్మ ఆమెను పొగడింది. "నీ మీద తప్పేమీ లేదమ్మా. అందువల్ల నువ్వు క్షమాపణ అడగాల్సిన అవసరమే లేదు.

సత్యపాల్ కు వివరాలు అర్ధం చేసుకునే వయసు వచ్చినప్పుడు, వాడి దగ్గర ఏ ఒక్కటీ దాచకుండా అన్నీ చెప్పాను. వాడు దానిని సరిగ్గా అర్ధం చేసుకున్నాడు కనుక ఎటువంటి  సమస్య లేకుండా పోయింది. కానీ, నీకు మా మీద చిన్న వయసు నుండే సందేహం రావడంతో, నీ దగ్గర ఏ విషయాన్నీ చెప్పలేకపోయాము. చెప్పినా నువ్వు అర్ధం చేసుకునే పరిస్థితిలో లేవు. సరే, నువ్వు అర్ధం చేసుకునేంత వరకు ఆగాలని ఆగాము. ఆ మంచి రోజు ఈ రోజే వచ్చింది. నువ్వూ నిజాలను సరిగ్గా అర్ధం చేసుకున్నది మంచిదయ్యింది. దీనికి సంతోషించాలి. ఏడవకూడదు."

"అమ్మా... నాకొసం నువ్వు ఎంతో పెద్ద త్యాగం చేశావు?"

"లేదు. నేను చేసిన దాంట్లో ఏ త్యాగమూ లేదు. నీవలన నాకు మంచి రక్షణ దొరికింది. సత్యపాల్ కు మంచి జీవితం దొరికింది. ఈ ఇంటికి ఒక వారసురాలు దొరికింది. అమ్మగారికి  సంఘంలో ఉన్న చెడ్డ పేరు తొలగిపోయింది...ఇలా నువ్వు నా కడుపులో పడిన దగ్గర నుండి మాకు మంచి చేసే పుట్టావు.

'తాను ఇన్నిరోజులుగా వాళ్ళ దగ్గర తప్పుగా నడుచుకున్నా, వాళ్ళ తన మీద ఎటువంటి కోపమూ చూపకుండా ఎంతో ప్రేమగా ఉన్నారే? ఈ స్వర్గాన్ని అనుభవించకుండా నరకంగా చేసుకున్నానే?' అని తలచుకుని బాధపడింది. వాళ్ళింట్లో ఉన్న ఒక్కొక్కరి మీద ప్రేమ, అభిమానం, మర్యాద పెరిగింది.

అందువలన, తిరిగి ఇంకోసారి ఆమె మొహం వైపు చూసి ప్రేమగా "అమ్మా"అని పిలిచింది

"కాదు...నేను మీ అమ్మను కాదు. అది నువ్వు పూర్తిగా మరిచిపోవాలి"

"అమ్మా..."

"ఇదిగో ఈమే నీకు అమ్మ. నేను ఎప్పుడూ పిన్నినే"

మంగమ్మ ఎందుకు అలా మాట్లాడుతోందనేది ఎవరికీ అర్ధం కాలేదు.

"ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? నా మీద ఇంకా కోపం పోలేదా?" అడిగింది గాయత్రి.

"కోపం కాదురా పండూ. నువ్వు కడుపులో ఉన్నప్పుడే ఎవరేవరికి మంచి జరిగిందో చెప్పానే, అవన్నీ కొనసాగాలి...నిలబడాలి. దానికి నేను కాలమంతా నీకు పిన్నిగానే ఉండాలి. అమ్మగారే నిన్ను కన్నది అనేది మారనే కూడదు. అదే అందరికీ మంచిది"

"........................."

"అది మాత్రమే కాదు...నేను నిన్ను కన్నదానిని మాత్రమే. ఆ తరువాత నీకు జోలపాట పాడి, ఊయల ఊపి ప్రేమ కురిపించి పెంచింది ఆమే. నీకు చిన్నగా వొళ్ళు వేడిగా ఉందంటే ఆమె ఎంత ఆందోళన చెందుతుందో తెలుసా? 'అమ్మా' అని నువ్వు పిలిచిన ప్రతిసారి ఆమె ఎంత ఆనందపడేదో తెలుసా? నీకొసం ఆమె ఎన్ని పథకాలును, కలలు కని ఉంచుకుందో తెలుసా?"

"అమ్మా, ఆమెను నేను ' అమ్మ కాదని చెప్పలేదే! నిన్ను కూడా 'అమ్మ అని పిలుస్తాను"

ఆమెను చూడటానికే అందరికీ జాలి, ఆశ్చర్యం వేసింది. 'ఇదే గాయత్రి నిన్నటి వరకు అందరి దగ్గరా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడింది. అందరినీ ఎదిరించి మాట్లాడింది? ఇప్పుడు ఇంత బ్రతిమిలాడుతోందే" అని తలచుకుని ఆశ్చర్యపోయారు.

అప్పుడు రాజరాజేశ్వరి, "ఎందుకు మంగమ్మ ఇంత పట్టుదల పడుతున్నావు? అది ఇష్టపడినట్లే పిలవనీ?" అని చెప్పగా...

"లేదమ్మగారూ...ఇది ఇరవైరెండేళ్ళు కట్టి కాపాడిన రహస్యం. మధ్యలోనే చెదిరి పోకూడదు. ఇక దీనిని గాయత్రి కూడా కలిసి చివరి వరకు కాపాడే తీరాలి"  అని చెప్పిన  ఆమె కూతురి వైపు తిరిగి "నేను జీవితాంతం నీకు పిన్నినే. ఆమే నీకు అమ్మ. దీన్ని నువ్వు మీరనని నాకు వాగ్ధానం చెయ్యి" అని చెప్పి తన కుడి చేతిని ముందుకు జాపింది.

"కుదరదు...కుదరనే కుదరదు" అంటూ వెనకడుగు వేసింది గాయత్రి.

ఈ తల్లీ-కూతుర్ల ప్రేమ పొరాటం చూసినవాళ్ళు కన్నీరు పెట్టుకున్నారు.

"కుదరదని చెబితే నా నిర్ణయం వేరే విధంగా ఉంటుంది. నా పట్టుదల గురించి కూడా నీకు తెలుసు కదా?' -- జాపిన చేతిన జాపినట్లే ఉంచి స్వరంలో కఠినత్వం చూపింది మంగమ్మ.

"సరేనమ్మా...'పిన్నీ'అని వద్దు. 'చిన్నమ్మా' అనైనా పిలుస్తానమ్మా?" -- బ్రతిమిలాడింది.

అందరూ కలిసి మంగమ్మని ఒప్పించటంతో వేరే దారిలేక "సరే" అని చెప్పి ఒప్పుకుంది.

సత్యపాల్ ని అడిగింది: "అన్నయ్యా...నువ్వైనా నాన్నను, నాన్నా అని పిలవచ్చు కదా. మనమందరం కలిసిపోయినప్పుడు ఎందుకు వేరుబాట్లు?"

అందరి మొహాలలోనూ...'గాయత్రి కోరికను సత్యపాల్ అంగీకరించాలి!" అనే ఉత్కంఠ కనబడింది.

సత్యపాల్ ఎప్పుడూ రాజరాజేశ్వరికి పెద్ద కొడుకే. అందువల్ల 'ఆయన్ని నాన్నా అని అతను పిలవటం సబబే' అనిపించింది.

పరంధామయ్య మనసులోనే ఆనందపడ్డారు. కొడుకుకు కోడుకుగా ఉంటూ ఇంటి పెద్దగా ఉండి ఇంటినీ, కంపెనీని తెలివిగా నిర్వాహం చేస్తూ వెడుతున్న అతను కొడుకుగా ఉండటం సరైనదే' అని అనుకున్నారు.

తండ్రి ప్రేమను సత్యపాల్ పూర్తిగా పొందటానికి తాను అడ్డుగా ఉండకూడదని మంగమ్మ నిర్ణయించుకుంది.

సత్యపాల్ కీ అదే ఆశ ఉన్నది. వివరం తెలిసిన రోజు నుంచి తండ్రి కొడుకుకు చేయాల్సిన అన్ని భాద్యతలను ఏ లోటూ లేకుండా చేస్తూ వస్తున్నారు ఆయన. అపరిమితమైన ప్రేమను చూపిస్తూ వస్తున్నారు.

పెద్దై అన్నీ బాధ్యతలూ తీసుకున్నప్పుడు తాను తీసుకున్న నిర్ణయాలను మరు పరిశీలన చేయకుండా నా నిర్ణయాన్ని అలాగే అంగీకరించేరంటే నా మీద ఎంత నమ్మకం ఉంచారో ఎవరికైనా అర్ధమవుతుంది. ఆయన్నీ 'నాన్నా' అని పిలవడం తనకు హక్కుగా దొరకటం పెద్ద భాగ్యంగా భావించాడు.

మెల్లగా తల తిప్పి మంగమ్మని చూశాడు.

ఆమె కూడా 'సరే' నని తల ఊపింది.

రాజరాజేశ్వరి సత్యపాల్ దగ్గరకు వచ్చి అతని చేతులు పుచ్చుకున్నది. "నువ్వూ, మంగమ్మ ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ, ఈ ఇంటికి నువ్వే బాబూ పెద్ద కొడుకువి" అని ఆవేశంగా చెప్పింది.  

సత్యపాల్ తిన్నగా పరంధామయ్య దగ్గరకు వెళ్ళి ఆయన చేతులు పుచ్చుకుని "నాన్నా" అన్నాడు.

ప్రేమతో నిండిన అతని చేతుల స్పర్శ తగలగానే పరంధామయ్య కళ్ళల్లో ఆనంద కన్నీరు బయటకు వచ్చింది.

                                                                                           Continued...PART-17

వీటిని కూడా చదవండి:

జెంటిల్ మ్యాన్(కథ)

ఆకాశం నుండి విచిత్రమైన శబ్ధాలు(మిస్టరీ)

**************************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి